-విశ్వనగరం మా నినాదం.. -ఎలాంటి నగరం కావాలో ప్రజలే తేల్చుకోవాలి -చెప్పుకోవటానికి ఏమీ లేకనే బీజేపీ విష ప్రచారం -ఆరేండ్లలో హైదరాబాద్కు కేంద్రం ఏం మేలు చేసింది? -క్రైస్తవ సమాజ సుహృద్భావ సమావేశంలో మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో భవన నిర్మాణ సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపడుతాం. లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, బిల్డర్లు అడిగిన వెంటనే జీవోలు ఇచ్చిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సామాన్యులకు భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లంచం ఇచ్చే బాధ ఉండొద్దన్న ఏకైక ఎజెండాతోనే ధరణిని తీసుకువచ్చాం.
విశ్వనగరం టీఆర్ఎస్ నినాదమని, విద్వేషం బీజేపీ వాదమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పచ్చని హైదరాబాద్లో ఓట్ల కోసం బీజేపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేద మండిపడ్డారు. హైదరాబాద్ను ఎవరు అభివృద్ధి చేయగలరో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. క్రైస్తవ మత పెద్దలు, నాయకులు సోమవారం జలవిహార్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఓట్ల కోసం మాట్లాడే పార్టీలను నమ్మొద్దని కోరారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఎన్నో అధిగమించినం.. తెలంగాణ వస్తే కొట్లాటలు జరుగుతాయని, ఆంధ్ర- తెలంగాణ పేరుతో, మతం పేరుతో పంచాయితీలు తలెత్తుతాయని, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ఎన్నోరకాలుగా ప్రచారం చేశారు. కోటి మంది ప్రజలను కన్నతల్లిలాగా కడుపులో పెట్టుకొని చూసుకున్న నగరం హైదరాబాద్. కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయో అని ఎన్నో విమర్శలు చేసిన్రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో ఆ దుష్ప్రచాలన్నింటినీ తిప్పికొట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేసినం. తాగునీటి కోసం ఆందోళనలు చేసే రోజులు పోయినయి. ఈ ఎన్నికల్లో మేం గెలిస్తే రోజూ నీటి సరఫరా అందించే బాధ్యత తీసుకుంటాం.
అభివృద్ధిలో మనమే టాప్ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎన్నో నగరాలు ఉన్నా.. కేంద్ర నివేదిక ప్రకారమే 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నది. నగరంలో 90 డీ సెంట్రలైజింగ్ వేస్ట్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినం. జవహర్ నగర్లోని లెగసీ డంప్ను రూ.125 కోట్లతో మార్చేశాం. చెత్త ద్వారా 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకో 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపన చేయబోతున్నాం. హైదరాబాద్ నగరంలో 2050 వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కేశవాపూర్ రిజర్వాయర్ కడుతున్నరు. ఏడాదిలోపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా కృషి చేస్తం.
బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపడుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, బిల్డర్లు అడిగిన వెంటనే జీవోలు ఇచ్చిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చేనెల 5వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. సంబంధిత అధికారులతో సమావేశమై బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, కార్యదర్శి టీ నర్సింహారావు, కోశాధికారి బీ గోపాల్, సలహాదారులు జే వెంకట్ రెడ్డి, సీహెచ్ రాఘవ రావు, ఉపాధ్యక్షులు విద్యాసాగర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ స్థిరత్వం వల్లనే కంపెనీల రాక.. కేసీఆర్ ప్రభుత్వానికి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే దమ్ముంది. తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉండటం, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఉన్నందు వల్లనే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. వీటితోపాటు ఎన్నో అంతర్జాతీయ పరిశ్రమలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. భద్రమైన నగరం ఏది అన్న అంశంపై బ్రిటన్ సంస్థ చేసిన సర్వేలో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానం, భారతదేశంలో నంబర్ వన్ స్థానం దక్కింది’ అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు స్టీఫెన్ సన్, రాజయ్య, రేచల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.