– గులాబీ పార్టీకి ప్రజల నుంచి అద్భుత స్పందన – పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు – విదేశాల్లోనూ జోరుగా నమోదు

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తున్నది. ఈ స్పందన చూసి నిర్దేశించిన లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. మండలాల వారీగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి 50వేల చొప్పున మొత్తం 60 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పుస్తకాల పంపిణీ పూర్తయింది. ఈనెల 20లోగా సభ్యత్వాన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకోగా ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా ఈనెల 10కల్లా పూర్తి చేస్తామని నాయకులు చెప్తున్నారు. ప్రజల స్పందనను సానుకూలంగా మలుచుకొని త్వరగా సభ్యత్వ నమోదు పూర్తి చేయడంతోపాటు కమిటీలు వేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు. సభ్యత్వ నమోదు పకడ్బందీగా సాగేందుకు ఒకటి, రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున రాష్ట్ర స్థాయి నాయకులను ఇంచార్జీలుగా నియమించారు. వీరు సభ్యత్వ నమోదుతోపాటుగా గ్రామ, మండల కమిటీలు ఎన్నుకునే వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు ప్రమాద బీమా కల్పించారు. దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ సమయంలో వారి సంబంధీకులకు ఆ మొత్తం చెల్లించడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్కార్డు నంబర్, నామినీ పేరు, ఫోన్ నంబర్, చిరునామా తప్పనిసరిగా పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. టీఆర్ఎస్ను ప్రజలు తమ ఇంటి పార్టీగా అభిమానిస్తూ ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని గుండెలకుహత్తుకున్నారు. పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నారు.
సభ్యత్వ నమోదు ఇలా.. మహబూబ్నగర్లో సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పలువురికి సభ్యత్వాన్ని అందజేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు మండలాలు, సూర్యాపేట, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్వత్వ నమోదులో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్లో నియోజకవర్గ ఇంచార్జి ఎండీ ఖాజా ముజీబుద్దీన్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు నాయకులకు మంత్రి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని చెంగిచెర్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్, జగిత్యాల జిల్లా కోరుట్లలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల, కోరుట్లలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పరిశీలకులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నియోజకవర్గ పార్టీ ఇంచార్జి, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావుతో కలిసి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం వీడీవోస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్తో కలిసి మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్తోపాటు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇంచార్జి మెట్టు శ్రీనివాస్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్రావు, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు, జనగామ జిల్లా కడవెండి, జనగామ జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామ్యూల్ పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని సభ్యత్వాలు అందించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నేరేడుచర్లలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, చిట్యాల మండలం చిన్నకాపర్తిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కార్యకర్తలకు సభ్యత్వాలు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందులో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొని పార్టీ నాయకులకు సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. నాగర్కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పలువురికి సభ్యత్వాలు అందజేశారు. కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభ్వత్వాలు అందజేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో టీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే అబ్రహం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

విదేశాల్లోనూ విశేష స్పందన.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఎన్నారై శాఖలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కమిటీలు ఉన్న 40 దేశాల్లో సభ్యత్వం జరిగే విధంగా ఎన్నారై సమన్వయకర్త మహేశ్ బిగాల పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచంలోనే మన దేశానికి సంబంధించి ఏ పార్టీకి లేనంత సభ్యత్వం టీఆర్ఎస్కు ఉంటుందని, ఆ దిశగా స్పందన వస్తున్నదని బిగాల పేర్కొన్నారు. కమిటీలు లేని దేశాల్లోనూ పార్టీ సభ్యత్వం స్వీకరిస్తామంటూ వినతులు వస్తున్నాయన్నారు. ఆమేరకు కమిటీలు వేయడానికి పార్టీ యంత్రాంగం సిద్ధమవుతున్నదన్నారు. సభ్యత్వ నమోదు వరకు పరిమితం కాకుండా సభ్యుల వివరాలన్నింటిని డిజిటలైజేషన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో డిజిటలీకరణ ప్రారంభించారు. ఈ వివరాల సేకరణ ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కేడర్కు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండ టం, పార్టీకి సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేయడం సులవుతుందని అంచనా వేస్తున్నారు. నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం వంటి వాటికి అవసరమవుతాయనే ఉద్దేశంతో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.

