విద్యావిధానం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఉండాలే తప్ప, నిరుద్యోగులను పెంచేలా ఉండకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ, విదేశాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా మన యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వీసీలతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యావిధానం తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగానే ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపారు. -నిరుద్యోగులను పెంచే విధానాలు పోవాలి -యూనివర్సిటీలకు నిధులిస్తాం -ఉపాధికి అనుగుణమైన కోర్సులు పెట్టండి -తెలంగాణ పరిస్థితులకు అనుగుణమైన విద్య రావాలి -పెడధోరణులు పారదోలి, పూర్వ వైభవం తీసుకురండి -కొత్తగా నియమితులైన వీసీలతో సీఎం సమీక్ష

ఈ దిశగా మన యూనివర్సిటీ విద్య ఎలా ఉండాలి? యూనివర్సిటీలను గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశంమీద మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. అక్కడ వెల్లడైన అభిప్రాయాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వీసీలను ఆదేశించారు. యూనివర్సిటీలు అధ్యయనానికి, పరిశోధనలకు వేదికగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం దేశ, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు, కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు. గతంలో చాలా మంది వీసీలు మన యూనివర్సిటీలను చక్కగా తీర్చిదిద్ది ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని గుర్తు చేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.
అవకాశాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రతియేటా 40-45వేల మంది బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారని, అంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల అవసరం లేకపోవటంతో వారంతా నిరుద్యోగులుగా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కోర్సుల పరిస్థితి ఇలాగే తయారైందని తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలేమిటి? ఏ కోర్సులు చేస్తే భవిష్యత్తుకు ఉపయోగం? అనే అంశాలను అర్థం చేసుకునేలా విద్యార్థులకు మార్గనిర్దేశం జరగాలని సీఎం చెప్పారు. ఐటీ, ఫార్మా, ఇన్ఫా, మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాలు తెలంగాణలో బాగా విస్తరిస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవైపు చదువుకుంటూనే రెండోవైపు కంపెనీల్లో పనిచేసే వెసులుబాటు కల్పించాలని వీసీలకు చెప్పారు. దీని వల్ల వారు అనుభవం గడిస్తారని తెలిపారు. అర్అండ్బీ, ఐబీ, పంచాయతీరాజ్, హౌజింగ్ తదితర శాఖల్లో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని, సివిల్ ఇంజనీరింగ్ చేసే వారిని ఆ పనుల్లో భాగస్వాములను చేయడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయవచ్చునన్నారు.
యూనివర్సిటీల్లో పెడధోరణులను పాలద్రోలడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వీసీలకు సీఎం స్పష్టం చేశారు. వీసీలుగా అవకాశం వచ్చిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన యూనివర్సిటీ విద్యకు మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు. ఇప్పుడు మనం వేసే బాటలే రేపు తెలంగాణ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని అన్నారు. యూనివర్సిటీల ఆర్థిక స్థితిపై నివేదికలు సమర్పించాలని, వాటి ఆధారంగా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. యూజీసీ నిధుల కేటాయింపులో మన యూనివర్సిటీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఇటీవల ప్రధాన మంత్రి వద్ద జరిగిన సీఎంల సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. యూజీసీ నుంచి ఎక్కువ నిధులు రాబట్టడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని చెప్పారు.
కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వివిధ రకాల పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్లో పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విద్య గురించి మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం తయారుచేసే విత్తనాలకు గతంలో ఎంతో డిమాండ్ ఉండేదని, తానుకూడా హైదరాబాద్ వచ్చి విత్తనాలు తీసుకుపోయేవాడినని గుర్తు చేసుకున్నారు. ఎంతో విశ్వసనీయత కలిగిన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని, ఆ మేరకు పరిశోధనలు పెరగాలని అన్నారు. వ్యవసాయంలో అనేక ఆధునిక పద్ధతులు వస్తున్నాయని, రైతులు వాటిని అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. మన వ్యవసాయంలో ఉత్పత్తి మాత్రమే పెరుగుతున్నదని, ఉత్పాదకత కూడా పెంచాలని అన్నారు. వీసీలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.