-విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -షార్ట్ టెండర్ల విధానంలో విద్యుత్ పనులు -సమీక్షా సమావేశంలో మంత్రి కే తారకరామారావు

తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. విద్యుత్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తాగు నీటి సరఫరా ప్రాజెక్టును నిర్దిష్టకాలంలో పూర్తిచేయాలని సూచించారు. తెలంగాణ వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలపై సోమవారం సచివాలయంలో ట్రాన్స్కో, డిస్కంల ఎండీలు, ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫలాలను మూడేండ్లలో ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలను అదే స్ఫూర్తితో అందించాలని మంత్రి అధికారులను కోరారు. ప్రాజెక్టుకు అవసరమైన ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్ వివరాలు విద్యుత్ శాఖాధికారులకు వెంటనే ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడేండ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తొలుత ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీళ్లివ్వాలన్న ఉద్దేశంతో ముందుగా పూర్తయ్యే సెగ్మెంట్లకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొత్తం ప్రాజెక్టుకు 200 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం విద్యుత్ శాఖకు ఇప్పటికే రూ.100కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని, దీనిని బట్టి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు.
విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం జిల్లాల్లో ఇరుశాఖల అధికారులతో వెంటనే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరు శాఖలు చేపట్టాల్సిన పనులపైన నివేదిక ఇవ్వాలని కోరారు. విద్యుత్ పనులను వెంటనే చేపట్టాలని విద్యుత్ శాఖాధికారులను కోరిన మంత్రి కేటీఆర్ ఇందుకోసం అవసరమైన పనులను షార్ట్ టెండర్ విధానంలో చేపట్టాలని సూచించారు. నిధుల కొరత లేనందున పనులు పూర్తిచేయడంపైనే దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ విద్యుత్శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ బీ సురేందర్రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో ఉన్నతాధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.