-రాష్ట్రంలో సాగునీటి రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యం -1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు: సీఎం కేసీఆర్ -రోజూ గోదావరి నుంచి 4, కృష్ణ నుంచి 3 టీఎంసీల లిఫ్ట్ -దానికి అనుగుణంగా జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణ -వేర్వేరు విభాగాలు రద్దు.. ప్రాదేశిక ప్రాంతాలుగా విభజన -ప్రాజెక్టులనుంచి చెరువుల దాకా సీఈ ఆధీనంలో -ప్రాజెక్టుల దగ్గర ఆపరేషన్ మాన్యువల్స్ తప్పనిసరి -అవసరమైతే వెయ్యి కొత్త పోస్టుల మంజూరుకు సిద్ధం -సాగునీటిరంగంపై విస్తృతస్థాయి భేటీలో సీఎం కేసీఆర్ -శాఖ పునర్వ్యవస్థీకరణపై అధికారుల ముసాయిదా -ముసాయిదాకు మార్పులు సూచించిన సీఎం

జలవనరులశాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై ఉండవు. వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఈఈ, డీఈల పరిధిని ఖరారుచేయాలి. సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి.
పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ఇప్పుడు ఎందరున్నారు? అన్న విషయాల్లో వాస్తవిక అంచనాలు వేసి, కచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈఎన్సీలు ఎందరుండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్సీ ఆపరేషన్స్ తప్పనిసరిగా ఉండాలి.
ఎంతో వ్యయప్రయాసకోర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. వాటి ద్వారా 1.25 కోట్ల ఎకరాలకు నీరందించాలి. దీనికి తగ్గట్టుగా జలవనరులశాఖ సంసిద్ధం కావాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చుపై సరైన అంచనాలు వేయాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్) గా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సీఎం చెప్పారు. జలవనరులశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటిరంగం పరిస్థితికి తగ్గట్టుగా జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూపొందించిన ముసాయిదాను సీఎంకు అధికారులు అందించారు.
ఈ ముసాయిదాలో కొన్ని మార్పులు చేర్పులను చేయాలని సీఎం సూచించారు. మరోసారి వర్క్షాప్ను నిర్వహించుకొని.. తాను సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు లిఫ్ట్చేసి రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవసరమైన వ్యవస్థను సిద్ధంచేయాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్సీలు మురళీధర్రావు, నాగేందర్రావు, అనిల్కుమార్, వెంకటేశ్వర్లు, హరిరాం, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, పలువురు సీఈలు పాల్గొన్నారు.
జలవనరులశాఖలో మార్పులపై సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు
ఎంతో వ్యయంతో, ప్రయాసలకోర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. వాటి ద్వారా 1.25 కోట్ల ఎకరాలకు నీరందించాలి. దీనికి తగ్గట్టుగా జలవనరులశాఖ సంసిద్ధం కావాలి. జలవనరులశాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై ఉండవు. వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఈఈ, డీఈల పరిధిని ఖరారుచేయాలి. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, లిఫ్టులు, చెక్డ్యాంలు.. ఇలా సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి. సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో కచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నందున సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధంకావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు ఎంతమంది సిబ్బంది కావాలి? ఇప్పుడు ఎందరున్నారు? అన్న విషయాల్లో వాస్తవిక అంచనాలు వేసి, కచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈఎన్సీలు ఎందరుండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్సీ ఆపరేషన్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించి, దానికి అనుగుణంగా నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి. అన్ని పంప్హౌజ్ల నిర్వహణ బాధ్యత విద్యుత్శాఖకు అప్పగించాలి నరేగా ద్వారా సాగునీటిరంగంలో ఏయే పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్ట్హౌజులు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి.