టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నదని, గతంలోకంటే రెట్టింపు దిశగా దూసుకుపోతున్నదని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1,7,8 వార్డుల్లో కాలినడకగా వెళ్లి సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే గత ఏడాది సభ్యత్వాల సంఖ్యను అధిగమించామని, అన్నివర్గాల ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరించడం అభినందనీయమన్నారు.

గ్రేటర్ హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఓల్డ్అల్వాల్లో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వికారాబాద్ జిల్లా పూడూరు మండల కెరవెళ్లిలో ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, యాదవరెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, పార్టీ పొలిట్భ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొని పార్టీ సభ్యత్వాలు అందజేశారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని 23వ డివిజన్ లో హిజ్రాలకు కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ పార్టీ సభ్యత్వాలు అందజేశారు.

