Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాజోలిబండలో ‘తుమ్మిళ్ళ’ పరవళ్లు

తుమ్మిళ్ళ మొదటి దశ పనులను 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి ఆర్‌డిఎస్‌ రైతాంగానికి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకున్నది. తెలంగాణ ఇంజనీర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆర్‌డిఎస్‌ రైతాంగానికి ఎట్టకేలకు తుంగభద్ర జలాలను అందించిన సాగునీటి శాఖ, విద్యుత్ శాఖ ఇంజనీర్లకు, 45 రోజుల ముందే పనులు పూర్తి చేసిన గుత్తేదార్లకు అభినందనలు.

గత ఏడాది జనవరిలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్నిపదకొండు నెలల్లోనే పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని కరువు మండలాలైన తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలాల్లో 58 వేల ఎకరాలకు సాగు నీరు అందించాము. ఆనాడు అదొక రికార్డు. ఆ రికార్డుని తిరగరాస్తూ పది నెలల్లోనే గద్వాల జిల్లాలో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నవంబరు 24న రాజోలిబండ కాలువలోకి ఎత్తి పోయడం జరిగింది. ఈ ఏడాది జనవరిలో తుమ్మిళ్ళ ప్రాజెక్టు పనులు ప్రారంభమయినాయి. ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి ఒప్పందం ఉన్నా 45 రోజుల ముందుగానే పనులు పూర్తి చేసి ఆర్‌డిఎస్‌ కాలువ 75వ కిలోమీటర్ వద్ద నీటిని జారవిడిచారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా తుంగభద్ర నీటి కేటాయింపులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్ష కారణంగా దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోని ఆర్‌డిఎస్‌ రైతాంగానికి తుమ్మిళ్ళ ప్రాజెక్టు ఒక వరంగా మారనున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ ది ఒక విషాద గాథ. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది. 1944లో పూర్వపు హైదరాబాద్ రాజ్యానికి, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న మద్రాస్ రాష్ట్రానికి తుంగభద్ర జలాల వినియోగంపై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ఆర్‌డి‌ఎస్ ఆనకట్ట వద్ద ఎడమ వైపున హైదరాబాదు రాష్ట్రానికి ఆర్‌డి‌ఎస్ కెనాల్ ద్వారా మళ్లించే నీరు, ఆర్‌డిఎస్‌ దిగువన సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్ కు వెళ్లే నీళ్ళు సమానంగా ఉండాలని అంగీకారం కుదిరింది. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు, ఆనకట్ట స్థలం ఉన్న రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రాలకు బదిలీ అయినాయి. తుంగభద్ర జలాల వాడకంలో మద్రాస్ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలకు బదులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వచ్చి చేరినాయి. 1944లో హైదరాబాద్, మద్రాస్ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుట్ట దాఖలు చేసింది. ఈ ఒప్పంద వివరాలను 1970వ దశకంలో కృష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటయిన బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టకుండా కేసీ కెనాల్‌కు ఎక్కువ నీటి కేటాయింపు చేయించుకొన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 1970వ దశకంలో, బచావత్ ట్రిబ్యునల్ ముందు ఆర్డీఎస్ కాలువకు, కేసీ కెనాల్ కు సమానంగా నీటిని కేటాయించాలని వాదించాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసీ కెనాల్‌కు 69.4 టీఎంసీలు, ఆర్‌డి‌ఎస్ కెనాల్‌కు 15.9 టీఎంసీలు డిమాండు చేసింది. జూన్ 1944 ఒప్పందం ప్రకారం కేటాయింపులు జరపాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు చేసిన క్షమార్హం కాని అన్యాయం. వాదనలు విన్న ట్రిబ్యునల్ కెసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలు, ఆర్‌డిఎస్‌కు 17.1 TMC (మహబూబ్ నగర్ జిల్లాకు 15.9 టీఎంసీలు, రాయచూర్ జిల్లాకు 1.2 టి ఎం సి లు) ల కేటాయింపులు చేసింది. కేసి కెనాల్ ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలుగా నిర్ధారించగా, రాజోలిబండ ఆయకట్టును 92,900 ఎకరాలుగా (87,000 ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో) నిర్ధారించారు.

ఇది రాజోలిబండకు ఎదురైన మొదటి అన్యాయం. రాజోలిబండ ఆనకట్ట నిర్మాణం 1958లో పూర్తయింది. రాజోలిబండ నిర్మాణం జరిపేటప్పుడు ఏర్పాటు చేసిన పది construction తూముల్లో ఏడింటిని మూసివేసి మూడింటిని అట్లాగే తెరిచి ఉంచడం వల్ల రాజోలిబండకు న్యాయంగా దక్కవలసిన వాటా ఎప్పుడు దక్కలేదు. ఇది రెండో అన్యాయం. 15.90 టీఎంసీల తుంగభద్ర జలాలను మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల తాలూకాలో 7 గ్రామాల్లో, ఆలంపూర్ తాలుకాలో 67 గ్రామాల్లో మొత్తం 87,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన రాజోలిబండ కాలువ గత 30 సంవత్సరాల్లో సగటున 5.5 టీఎంసీలకు మించి దక్కలేదని రికార్డులు చెపుతున్నాయి. 87,500 ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. అంటే మొత్తం ఆయకట్టులో సాగునీరు అందుతున్నది 36% ఆయకట్టుకే. 64% ఆయకట్టు నీరందక దుర్భిక్ష ప్రాంతంగా మిగిలిపోయింది. తెలంగాణాకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాల్లో రాజోలిబండ ఒక సజీవ సాక్ష్యం. ఒకవైపు కృష్ణా నది, మరొక వైపు తుంగభద్రా నది మధ్యలో ఉన్న నడిగడ్డ ప్రాంతం అయిన పాలకుల నిర్లక్ష్యం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్ల సాగునీటికి నోచుకోకుండా దశాబ్దాలుగా కరువు ప్రాంతంగా మగ్గిపోయింది. అదే సమయంలో 39.9 టీఎంసీలు వాడుకోవాలసిన కేసి కెనాల్ సగటున 55 నుంచి 60 టీఎంసీలు ఉపయోగించుకున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. తర్వాతి కాలంలో సుంకేసుల ఆనకట్ట బ్యారేజీగా మారింది. కె సి కెనాల్ ఆధునికీకరణ పూర్తి అయ్యింది. ఆర్‌డిఎస్‌ మాత్రం శిథిలమైన స్థితిలో ఉండిపోయింది.

ఉమ్మడి పాలకులు సుంకేసులనే కాదు బ్రిటిష్ వారు కట్టించిన అన్ని ఆనకట్టలను బ్యారేజీలుగా మార్చుకునారు. గోదావరి ఆనకట్ట ఆర్థర్ కాటన్ బ్యారేజిగా, కృష్ణా ఆనకట్ట ప్రకాశం బ్యారేజీగా, సోమశిల ఆనకట్ట సోమశిల బ్యారేజీగా రూపం మార్చుకున్నాయి. తెలంగాణలో ఉన్న పాత ఆర్‌డిఎస్‌, సదర్మాట్, ఘన్‌పూర్, దుమ్ముగూడెం ఆనకట్టలు మాత్రం బ్యారేజీలుగా మారలేదు. రాజోలిబండ ఆనకట్ట ఎడమ వైపున ఆర్‌డిఎస్‌ కాలువ మొదలవుతుంది. కాలువ మొత్తం పొడవు 143 కిలోమీటర్లు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 42.6 కి మీ ప్రయాణించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాలువ 42.6 కి మీ నుంచి 143 కి.మీ దాకా ఉంటుంది. ఆర్‌డిఎస్‌ ఆనకట్ట వద్ద తెరిచి ఉంచిన తూముల కారణంగా ఆనకట్ట వద్ద తగినంత నీటి మట్టం లేక నీరు రాక పోవడం ఒక కారణమైతే కాలువల నిర్వహణ లేక శిథిలమై పోవడం చేత నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొన్నది. 2001 లో కె సి ఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసినాడు. కె సి ఆర్ తన జల సాధనా ఉద్యమాన్ని ఆర్‌డిఎస్‌ నుంచే మొదలు పెట్టినాడు. ఆర్‌డిఎస్‌ కాలువపై పాదయాత్ర చేసి ఆయకట్టు రైతాంగానికి న్యాయం జరగాలని డిమాండ్ చేసినాడు. ఆర్‌డిఎస్‌ కాలువని ఆధునికీకరించాలని, ఆర్‌డిఎస్‌ ఆనకట్ట వద్ద తెరిచి ఉంచిన తూములను మూసివేయాలని డిమాండ్ చేసినాడు. 2003 జూలై 20న రాజోలిబండ పాదయాత్రను కెసిఆర్ మొదలు పెట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆలంపూర్ నుంచి గద్వాల వరకు 120 కి మీ 30 గ్రామాల గుండా నీటి కోసం సాగిన ఈ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. నేనూ కె సి ఆర్ తో పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నాను. అపూర్వమైన ప్రజా మద్దతుతో సాగిన ఈ పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర పాలకుల్లో ప్రకంపనాలు సృష్టించింది. 5 రోజుల తర్వాత జూలై 25 న గద్వాలలో జరిగిన బహిరంగ సభ తెలంగాణా జల సాధనా ఉద్యమానికి ఊపిరి పోసింది. రాజోలిబండ తూముల మూసివేతపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు మడమ తిప్పను, డిల్లీ దాకా ఈ సమస్యను తీసుకపోతాం, రాజోలిబండ ఆయకట్టు రైతాంగానికి న్యాయం జరిగే దాకా పోరాటం ఆగదు అని గద్వాల సభలో కె సి ఆర్ ప్రకటించినాడు.

ఈ ఉద్యమానికి జడిసి తూములు మూసి వేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు బాంబులతో పేల్చివేయడంతో తూముల మూసివేత ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణా ఉద్యమ తీవ్రతను గమనించి 2008 మూసివేయించినాడు. అయితే రివర్ స్లుయీసులు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరి, పక్షపాత వైఖరి కారణంగా మొన్నటికి మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అసలు జాడ పతా లేని రాజోలి బండ కుడి కాలువకు 4 టీఎంసీలను కేటాయించుకోవడం జరిగింది. రాజోలిబండకు కుడి వైపున కర్నూల్ జిల్లా. రాజోలిబండ కుడికాలువ కోసం పట్టు బట్టి 4 టీఎంసీలు సాధించుకున్న ప్రభుత్వం సుంకేసుల బ్యారేజి నుంచి ఎడమ వైపున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు ప్రయోజనం కల్పించే ఎడమ కాలువను డిమాండు చేయలేదు. సుంకేసుల ఎడమ కాలువ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. అయినా కూడా ఉమ్మడి ప్రభుత్వం సుంకేసుల ఎడమ కాలువ జోలికి పోలేదు. ఇది ఉమ్మడి ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాపై ప్రదర్శించిన వివక్ష. ఆర్‌డి‌ఎస్ కెనాల్ కు కేసి కెనాల్ తో సమానంగా కేటాయింపులు జరపాల్సిందిపోయి, కొత్తగా ఇంతకుముందు ప్రతిపాదనలోనే లేని కుడి కాలువకు కేటాయింపులు చేయడాన్ని తెలంగాణ ప్రాంతానికి జరిగిన తాజా వివక్షకు ఉదాహరణ. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఆమోదించిన ఆర్‌డిఎస్‌ ఆధునికీకరణ పనులకు, ఆనకట్ట ఎత్తు పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డుతూనే ఉన్నది. కర్ణాటక ప్రభుత్వం పనులు మొదలు పెడితే అక్కడ వేలాది మండి రైతులను తరలించి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సహకారం లేకుండా తాము ఆర్‌డి‌ఎస్ పనులు కొనసాగించలేమని, మూడు రాష్ట్రాల త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆంధ్రపదేశ్ రాష్ట్రం త్రైపాక్షిక సమావేశానికి లేఖలు రాసినప్పటికీ స్పందించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజోలిబండ మళ్లింపు పథకం ద్వారా సాగు నీరు అందని 55,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ పథకాన్నిఅన్వేషించింది.

రైతాంగానికి దశాబ్దాలుగా ఎదురైన ఈ అన్యాయాన్ని సవరించడానికే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుంకేసుల ఎడమ వైపున తుంగభద్రా నీటిలో తెలంగాణకు హక్కుగా ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి పథకం తయారు చెయ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినారు. సర్వే జరిపి, డి పి ఆర్ తయారు చేసిన అనంతరం ప్రభుత్వం ఏప్రిల్, 2017 లోజి ఓ నంబరు 429 ద్వారా మొదటి దశ పనులకు 397 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. బచావత్ ట్రిబ్యూనల్ ద్వారా నికర జలాల కేటాయింపులు ఉన్నఈ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు అని, పనులు ఆపి వేయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మొత్తం మీద కేసిఆర్‌ పట్టుదలతో, ముందుచూపుతో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం రికార్డు సమయంలో పూర్తయింది. మొదటి దశలో తుమ్మిళ్ళ గ్రామం వద్ద తుంగభద్రా నది నుంచి 70 రోజుల్లో సుంకేసుల ఆనకట్ట పొంగి పొర్లుతున్నపుడు 5.44 టి ఎం సి ల నీటిని ఎత్తిపోసి ఆర్‌డిఎస్‌ కాలువలో 75 వ కి.మీ వద్ద పోయడం జరుగుతుంది. రెండవ దశలో మూడు బ్యాలెన్సింగ్ జలాశయాలకు (మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు)నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆర్‌డిఎస్‌ రైతాంగానికి ఇచ్చిన హామీని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకున్నది. తెలంగాణ ఇంజనీర్లు రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పథకాన్ని పది నెలల్లో పూర్తి చేసి ఆర్‌డిఎస్‌ రైతాంగానికి తుంగభద్ర జలాలను అందించిన సాగునీటి శాఖ ఇంజనీర్లను, విద్యుత్ శాఖ ఇంజనీర్లను, 45 రోజుల ముందే పనులు పూర్తి చేసిన గుత్తేదార్లకు ఈ శుభ సందర్భాన నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

-తన్నీరు హరీష్ రావు
(తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు(నవంబర్‌ 24న తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం తొలిదశ పూర్తి చేసి రాజోలిబండ ఆయకట్టుకు నీళ్లు విడుదల చేసిన సందర్భంగా…)

Source : http://www.andhrajyothy.com/artical?SID=670478

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.