– వచ్చే ఆగస్టు 15లోగా పూర్తి – నాలుగేండ్లలో ప్రతి గ్రామానికీ తాగునీరు.. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి – పథకాల అమలుకు కేంద్రం సాయం చేయాలి – పారిశుద్ధ్యంపై ప్రజల్లో జవాబుదారీతనం పెరగాలి – పంచాయతీరాజ్శాఖ మంత్రుల సదస్సులో మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కేంద్రం తగిన తీరులో సాయం చేస్తే రానున్న నాలుగేండ్లలో ప్రతి గ్రామానికీ రక్షిణ మంచినీరు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్గడ్కరీ అధ్యక్షతన సోమవారం జరిగిన అన్ని రాష్ర్టాల పంచాయతీరాజ్శాఖ మంత్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 2019 నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పారిశుధ్యంలో 2019 నాటికి రాష్ట్రంలో 100% ఫలితాలు సాధిస్తామన్నారు. స్కూళ్లలో ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు. పారిశుద్ధ్య వ్యవస్థ సమగ్ర అమలుకు ప్రతిగ్రామంలోనూ స్వచ్ఛతా దూత్ పేరుతో ఒక ప్రతినిధిని నెలకు రూ. 3,000 గౌరవ వేతనంతో నియమించటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం సమాజంలో ఒక భాగంగా ఉండాలంటే ప్రజల్లో కూడా జవాబుదారీతనం, బాధ్యత పెరగాలన్నారు. నిర్బంధ విద్య, సమాచార హక్కు తరహాలో మరుగుదొడ్డి హక్కుగా దీన్ని పగడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కుటుంబ సమగ్ర సర్వేను ఒకే రోజులో చేపట్టి విజయవంతం చేసిందని, దీని వెలుగులో గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు.

తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో తాగునీటి అవసరాల కోసం రూ.24వేల కోట్లతో సమగ్ర వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని కేటీఆర్ తెలిపారు. రానున్న నాలుగేండ్లలో ప్రతి గ్రామానికీ రక్షిత తాగునీటిని అందించగలమని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటిలో 10శాతం నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించినట్లు వివరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో 2019 నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.
రైలను ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి అనేక బాలారిష్టాలు ఉన్నాయని, ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించుకుంటూ ప్రజలంతా కోరుకున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాకారం చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని చెప్పారు. రాష్ర్టాల పంచాయతీరాజ్శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 70 రోజులే అయ్యిందని, అన్ని సమస్యలకూ ఇప్పుడే పరిష్కారించాలంటే కష్టమన్నారు. రాష్ర్టానికి విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నదని, పొరుగు రాష్ర్టాల నుంచి కొనుక్కోటానికి ఎన్ని చర్యలు తీసుకున్నా దాన్ని తెప్పించుకోడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ అవసరాలకు సంబంధించి గ్రామీణ అభివృద్ధిపై కేంద్ర పంచాయితీరాజ్ మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం మధ్యాహ్నం సమావేశమవుతానని, జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్తో కూడా 1.30 గంటలకు సమావేశమవుతామని చెప్పారు.
నేడు ఢిల్లీలో డిజిటల్ ఇండియా సదస్సు – హాజరుకానున్న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో నిర్వహించే ఐటీ మంత్రుల డిజిటల్ ఇండియా సదస్సుకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్సింగ్, ఐటీ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో చేపట్టే ఐటీఐఆర్ ప్రాజెక్టుతో పాటు నేషనల్ అప్టెక్ ఫైబర్ నెట్వర్క్, ఈ-క్రాంతి, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్ఈజీపీ ప్రాజెక్టుల గురించి ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ వివరిస్తారు.