-రుణమాఫీకి స్పష్టమైన జీవో ఇచ్చిన సీఎం -సీమాంధ్ర మీడియా ప్రచారం నమ్మొద్దు -టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటూ తెలంగాణ నిర్మాణానికే -ఎన్నికల ప్రచారసభల్లో మంత్రి హరీశ్రావు
పంటరుణాల మాఫీ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.లక్ష వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన జీవో ఇచ్చారని తెలిపారు. 45 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు.
నెలాఖరు నాటికి రైతన్నల రుణాలు మాఫీ అవుతాయని, కొత్త రుణాలు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట, పాపన్నపేట మండలం మల్లంపేట, ఎల్లాపూర్, లక్ష్మీనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కొన్ని సీమాంధ్ర చానళ్లు, పత్రికలు రుణమాఫీపై లేనిపోని కథనాలు అల్లి దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేదా.. వచ్చిన తెలంగాణపై ఆంధ్ర నాయకుల పెత్తనం అవసరమా అని హరీశ్రావు ప్రశ్నించడంతో కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు.
కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమైంది. ఆంధ్ర నాయకుల పెత్తనం తెలంగాణకు అవసరం లేదు అని ప్రజలు బదులిచ్చారు. దీంతో హరీశ్రావు ఇదీ తెలంగాణ ప్రజల సత్తా. ఇదే స్ఫూర్తితో టీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేసి కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు చేయాలి అని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డికి చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు వల్లనే టికెట్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ రెబల్స్తో మాత్రమే పోటీ అని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమ న్యాయం కల్పిస్తున్నది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. మెదక్లోని టీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమపథకాల అమలుపై దీనికి బహిరంగ చర్చకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డికి సవాల్ విసిరారు. సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు రేపటి బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు.
మన వేలితో మన కన్ను పొడిచేందుకే పచ్చి సమైక్యవాది జగ్గారెడ్డిని ఏరికోరి ఎన్నికల బరిలో నిలిపారని విమర్శించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో పాపన్నపేట జడ్పీటీసీ స్వప్నబాలాగౌడ్, ఏడుపాయల ఆలయ మాజీ చైర్మన్ తాడెపు సోములు, డీసీసీబీ డైరెక్టర్, సింగిల్విండో చైర్మన్ మోహన్రెడ్డి, మల్లంపేట ఎంపీటీసీ చందనప్రశాంత్రెడ్డితో పాటు పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు వెంట టీఆర్ఎస్ అభ్యర్థి ప్రబాకర్రెడ్డి, నాయకులు నరేంద్రనాథ్, మచ్చ వేణుగోపాల్రెడ్డి, చిప్ప ప్రభాకర్, ఈసీ సభ్యులు పయ్యావుల రాజయ్య, కిష్టాపూర్ లక్ష్మణ్, పెర్క దుర్గయ్య, కనకవ్వ, శోభన్, లక్ష్మణ్, మల్లేశం, వెంకటరాంరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.