నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా,ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో తొలిఅడుగు పడింది. దసరా సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల నిర్మాణాలకు అట్టహాసంగా శంకుస్థాపనలు జరిగాయి. రూ. 5.04 లక్షల వ్య యంతో రెండు బెడ్రూంలు, ఒక హాల్, రెండు టాయిలెట్లుతో నిర్మించే అధునాతన ఇండ్లకు పునాదిరాయి పడింది. -రాష్ట్రవ్యాప్తంగా డబుల్బెడ్రూం పథకం ప్రారంభం -పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -వారి అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడం -వచ్చే మార్చికల్లా జిల్లాగా సూర్యాపేట -ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ -ఆనందోత్సాహాల మధ్య ఇండ్లకు మంత్రుల శంకుస్థాపనలు -అమల్లోకి వచ్చిన కేసీఆర్ మరో వాగ్దానం
ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గురువారం శంకుస్థాపనల్లో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ అక్రమాలకు తావులేకుండా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వ హాయాంలో నిరుపేదలకు కనీసం రూ.లక్ష కూడా వెచ్చించకుండా పిట్టగూడు ఇండ్లు కట్టించారని, సగం నిధులు కాంగ్రెస్నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. నిరుపేదలు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో ఇండ్లకు రూపకల్పన చేసిందని వివరించారు.
వచ్చే ఏడాది నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని పద్మారావునగర్ డివిజన్లోని హమాలీ బస్తీ, సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ దోబీఘాట్ బస్తీ, ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీ, కూకట్పల్లి పరిధిలోని చిత్తారమ్మ బస్తీలో డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి, సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడలో మల్టీపర్పస్ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి.కార్యక్రమాల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్,వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్శాఖ మంత్రి టీ పద్మారావు, రవాణాశాఖ మంత్రి పీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ సలీమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పరిధిలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో పంచాయతీ రాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ మంత్రి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజచేశారు. వచ్చే ఏడాది నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు: మంత్రి హరీశ్రావు నిరుపేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పారదర్శకంగా ఇండ్ల కేటాయింపులు జరుగుతాయని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్, చిన్నకోడూరు మండలం మందపల్లి మధిర గ్రామం పిట్టలవాడలో డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. మెదక్ మండలం హవేళీఘణపూర్లో గంగిరెద్దుల కాలనీలో శుక్రవారం కలెక్టర్ రోనాల్డ్రోస్తో కలసి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఇండ్ల నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు.

మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్, తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరుతో పాటు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం కప్పెట గ్రామాల్లో డబుల్బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపనలో ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి సీ లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు.
ఇతర రాష్ర్టాలపై ఒత్తిళ్లు వస్తున్నాయి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నాలుగేండ్లలో పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో చేపడుతున్న ఈ పథకాన్ని చూసి ఆయా రాష్ర్టాల్లోనూ ప్రభుత్వాలపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆదిలాబాద్ మండలంలోని బట్టిసావర్గాం, మావల గ్రామ పంచాయతీల్లో ఇండ్ల నిర్మాణాలకు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగురామన్న భూమిపూజ చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, మోర్తాడ్, ఆర్మూర్ మండలం కోటార్మూర్లో ఇండ్ల నిర్మాణాలకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్, బోధన్, నిజామాబాద్ మండలం న్యాల్కల్, పాల్దా గ్రామాల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి, బెన్నూరు, పరిగి సమీపంలోని తుంకలగడ్డ, రామయ్యగూడెంలలో ఇండ్లనిర్మాణాలకు శంకుస్థాపనలో మంత్రి పీ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -వారి అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడం: సీఎం కేసీఆర్ -సూర్యాపేట, ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి -వచ్చే మార్చికల్లా జిల్లాగా సూర్యాపేట -15 రోజుల్లో పట్టణానికి మళ్లీ వస్తా: కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా అపురూప కానుకనందించింది. ప్రతిష్ఠాత్మక డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయదశమి పర్వదినంనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూర్యాపేట, ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఇండ్లనిర్మాణానికి శంకు స్థాపన చేశారు. పది జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆనందోత్సాహాల మధ్య ఇండ్ల నిర్మాణాలకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఎనిమిది నెలల్లో గృహప్రవేశాలు జరిగేలా నిర్మాణాలు వేగవంతంగా జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిరుపేదల జీవితాల్లో స్వర్ణయుగం రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పేదల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేందుకే రెండు పడకగదుల ఇండ్ల పథకానికి విజయదశమి శుభసందర్భంగా శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. ఈ ఇండ్లలో రెండుతరాలపాటు పేదలు ఆనందంగా నివసించవచ్చునన్నారు. ఉద్యమ సమయంలో.. అలాగే ఎన్నికల సమయంలో పేదలకు డబుల్బెడ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పామని, ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 60వేల ఇళ్ల నిర్మాణాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. గతంలో ఊరికి బయట విసిరేసినట్లుగా పేదలకు ఇళ్లు నిర్మించతలపెట్టారని, అవి కూడా అమలు కాలేదని గుర్తు చేశారు.
సూర్యాపేటలో మాటిచ్చా… తెలంగాణ ఉద్యమ సమయంలో సూర్యాపేటలో జరిగిన సమర శంఖారావంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చానని, ఆ పథకానికి ఇక్కడే శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు. అలాగే సూర్యాపేటను జిల్లా కేంద్రం చేస్తామని కూడా హామీ ఇచ్చానని వచ్చే మార్చికల్లా సూర్యాపేట జిల్లా ఏర్పాటవుతుందని సీఎం ప్రకటించారు. సూర్యాపేటతో పాటు పెన్పహాడ్, చివ్వెంలలో నిర్మించతలపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు స్థానిక గొల్లబజారులో ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లబజార్తో పాటు మరో రెండు చోట్ల 400 ఇండ్లు నిర్మించబోతున్నామని, దానికి అదనంగా తన కోటా నుంచి మరో 500 ఇండ్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు. కేవలం ఇండ్లు నిర్మిస్తేనే అంతా బాగుపడినట్టు కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవలిసి ఉందని సీఎం అన్నారు.
తాగునీరు, సాగు నీరు అందినపుడే సత్వర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జిల్లాలో డిండి ఎత్తిపోతల ద్వారా మునుగోడు, దేవరకొండతోపాటు నల్లగొండ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. మిడ్ మానేరు పనులు వేగవంతమయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి తుంగతుర్తి, సూర్యాపేట, మునగాల ప్రాంతాలకు సాగునీటిని తీసుకురాబోతున్నామని చెప్పారు. మరో పక్క రూ.40వేల కోట్లతో అన్ని పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వాటర్గ్రిడ్ పథకం ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందించబోతున్నామని సీఎం చెప్పారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లి రావడంతో సమయం సరిపోనందున మరో 15 రోజుల్లో వచ్చి పట్టణంలో పాదయాత్ర చేసి జిల్లా హెడ్క్వార్టర్కు కావాల్సిన వసతులను గుర్తించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సభకు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధ్యక్షత వహించారు. నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, ఐజీ నవీన్చంద్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు తదితరులు పాల్గొనగా… ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో జరిగిన సమావేశాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్మన్ రాజమణి, కలెక్టర్ రోనాల్డ్రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, రెండు గ్రామాల సర్పంచ్లు భాగ్యబాల్రాజు, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐదు నెలల్లో ఇండ్లు పూర్తి కావాలి… గజ్వేల్ నియాజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఐదు నెలలో పూర్తి చేయాలని ఈ పనులు చేపట్టిన కంపెనీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఎర్రవల్లి, నర్సన్నపేట ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నదని చెప్పారు. ప్రజలకోసం చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. ఈ బృహత్కార్యక్రమంలో పాలు పంచుకోవడం సంతృప్తినిస్తుంది. మీరు అనుకున్న సమయంలో పూర్తి చేసి ఐదు నెలల్లోపు కొత్త ఇండ్లలోకి వెళ్ళే అవకాశం కల్పించాలి అని సీఎం సూచించారు.
ఎర్రవల్లిలో 280 ఇళ్లకు, నర్సన్నపేటలో 200 ఇండ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. ముందుగా ఎర్రవల్లి గ్రామాన్ని హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం శమీపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ప్రసంగిస్తూ పట్టుదల, పరస్పర సహకారం చైతన్యంతో కూడిన నడవడికతో ఆదర్శ గ్రామాలుగా మారాలని గ్రామస్థులకు సూచించారు. ఈ రెండు గ్రామాలు తెలంగాణకే దిక్సూచిగా మారాలన్నది తన తాపత్రయమని కేసీఆర్ అన్నారు.
మీ చైతన్యం అపూర్వం… ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో వచ్చిన చైతన్యం అపూర్వమని సీఎం ప్రశంసించారు. మూడు నెలల ముందున్న పరిస్థితికి ఇప్పటికి ఎంతో తేడా ఉందని అన్నారు. తమ గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుకోవడానికి ప్రజలు చూపుతున్న ఉత్సాహం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికోసం కులమతాలకు అతీతంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకున్నారని, ప్రతి శనివారం శ్రమదానం చేస్తున్నారని కొనియాడారు. చిన్న చిన్న పంచాయతీలుంటే ఊర్లనే తష్ప చేసుకోవాలన్నారు. ఇదే స్ఫూర్తితో అభివృద్ధి కోసం కదిలితే వచ్చే దసరా నాటికి రెండు ఊర్లు దేశ విదేశ ప్రముఖుల దృష్టిని ఆకర్శించడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అభివృద్ధితో పాటు సంస్కారం కూడా పెంపొందాలని కోరారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు గుడారాల్లో లేదా అనువైన ప్రాంతాల్లో ఉంటూ సహకరించాలని కోరారు.
ఒక్క ఇండ్ల నిర్మాణంతోనే అంతా అయిపోనట్టు కాదని, బతుకుతెరువు చూసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఇప్పటి వరకు జరిగింది తక్కువ… ఇంకా జరిగేదే ఎక్కువుంది. రోహిణి కార్తె నుంచి రెండు గ్రామాల్లో నూతన పద్ధతుల్లో సాగు పనులు జరగాలి. వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు అవసరమైన అన్ని పనులు చేస్తున్నారు. ప్రతి ఎకరానికి అవసరమైన డ్రిప్ పరికరాలు సమకూర్చుతారు. కమతాల ఏకీకరణకు సహకరించాలి. విద్యుత్ లైన్లు, బోరు మోటార్లు అన్నీ ఏర్పాటు చేస్తాం అని కేసీఆర్ అన్నారు. జేసీ వెంకట్రాంరెడ్డి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు. నర్సన్నపేటలో చేబర్తి చెరువు అలుగు నీళ్లను వాడుకోవడానికి చెక్డ్యాంను నిర్మాణంకోసం ప్రభుత్వం త్వరలో నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని గజ్వేల్ నియోజకవర్గం మొత్తం సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.