ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది. 60 ఏండ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్, టీడీపీలకు..16 నెలల్లోనే ప్రజారంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కులేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీలు తెలంగాణ ప్రజలకు కనీస వసతులను కూడా కల్పించలేకపోయాయి.
-60 ఏండ్లలో జరగని అభివృద్ధిని సాధ్యం చేశాం -టీఆర్ఎస్ను విమర్శించే హక్కు విపక్షాలకు లేదు -వరంగల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ -సర్వమత సమానత్వాన్ని పాటిస్తున్న సీఎం కేసీఆర్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి -రైతును రాజు చేయడమే లక్ష్యం: మంత్రి జగదీశ్రెడ్డి
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా అమలుచేస్తున్నది అని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం వర్ధన్నపేట మండలం ఐనవోలులో మంత్రి మాట్లాడారు. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పింఛన్లు, ఆరు కిలోల రేషన్ బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని త్వరలో బీసీ, ఓసీల్లోని పేదలకు అమలు చేస్తామన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ఓర్వలేని విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వానికి మరింత బలం ఇవ్వాలని కోరారు. ప్రచారంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, జీవన్రెడ్డి, బాబూమోహన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సెక్యులర్ స్టేట్: డిప్యూటీ సీఎం శ్రీహరి
సీఎం కేసీఆర్ సర్వమత సమానత్వాన్ని పాటించడమేగాక అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. హన్మకొండలోని వెంకటేశ్వరగార్డెన్లో జరిగిన జిల్లా క్రైస్తవ ఐక్య క్రిస్మస్ వేడుకల సన్నాహక ప్రార్థన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందరినీ సమానస్థాయిలో గౌరవించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెక్యులర్ స్టేట్గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. క్రైస్తవుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారేనన్నారు. కేసీఆర్ కంటే సెక్యులర్ నేత దేశంలో, రాష్ట్రంలో మరొకరు లేరన్నారు.
అభివృద్ధిలో క్రైస్తవులు కలిసిరావాలి: మంత్రి హరీశ్రావు అన్ని మతాలను సమానంగా నడిపించే నేత సీఎం కేసీఆర్ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తున్నారని, అన్నివర్గాలను కలుపుకుని పనిచేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రైస్తవులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సామాన్య దళిత కార్యకర్త పసునూరి దయాకర్కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తున్నానని, భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎంపీలు కే కేశవరావు, గుండు సుధారాణి, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీవీ పాటిల్, బీ వినోద్కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, పాస్టర్లు పాల్గొన్నారు.
విపక్షాలకు గుణపాఠం చెప్పండి: మంత్రి జగదీశ్రెడ్డి తెలంగాణలో రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రుల పాలనలో అన్నిరంగాల్లో వివక్షకు గురైన తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. దేవరుప్పుల మండలం గొల్లపల్లి, అప్పిరెడ్డిపల్లి, ధర్మాపురం గ్రామాల్లో ఆయన ప్రజలను కలుసుకుని మాట్లాడారు. పరాయి పాలనలో మన నీళ్లు మనకు దక్కలేదని, ఆంధ్రోళ్లకు అమ్ముడుబోయిన టీడీపీ,కాంగ్రెస్ నేతల వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఉపఎన్నికలో విపక్షాలకు గుణపాఠం చెప్పేలా టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
స్వరాష్ట్రంలోనే తెలంగాణకు న్యాయం: మంత్రి పోచారం ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే తెలంగాణను చీకటిమయం చేసి అన్యాయం చేశారని, టీఆర్ఎస్ పోరాటంతో స్వరాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శాయంపేటలో ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు తక్కువగా నిర్మించడంతో వ్యవసాయ మోటార్లు 20 లక్షలున్నాయని, ఆంధ్రాలో ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించడంతో ఆంధ్రా, రాయలసీమలో 13 లక్షల మోటార్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. అందుకే తెలంగాణకు ఎక్కువ కరెంటు కావాల్సి ఉన్నదని, విభజన చట్టం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు మనకు రావాల్సిన కరెంట్ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కరెంట్కోతలు లేకుండా అదనపు విద్యుత్ కొనుగోలు చేశారని, దీంతో రైతులకు సమస్యలు తప్పాయన్నారు. ఉగాది నుంచి సాగుకు పగలే తొమ్మిది గంటల కరెంటు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించి, కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
దయాకర్కే ఓటెయ్యండి: ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ కోరారు. వరంగల్-1, 2, హన్మకొండ డిపోల్లో భోజన విరామ సమయంలో కార్మికులను కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతోపాటు ఆర్టీసీ కార్మికుల సంక్షే మమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచిన టీఆర్ఎస్ ను ఉపఎన్నికలో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కే మద్దతు: ఆలిండియా ముస్లిం సంఘం వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆలిండియా ముస్లిం సంఘం అధ్యక్షుడు ఖాలిద్ రసూల్ఖాన్, ప్రధాన కార్యదర్శి నహీంముల్లా షరీఫ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ముస్లిం మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేకసంక్షేమ పథకాలను చేపడుతున్నదని, అందుకే వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడిన ముస్లింల అభివృద్ధికికి కృషిచేయాలని ప్రభుత్వం దృషికి తీసుకుళ్లగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేసి, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో యూసుఫ్ బేగ్, జావీద్ఇక్బాల్, జహురుద్దీన్,మంజార్ ఖాద్రీ పాల్గొన్నారు.

