Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఊపిరికి భరోసా

-48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు.. 324 టన్నుల సామర్థ్యం
-హైదరాబాద్‌లో 100 టన్నుల ప్లాంటు
-10 రోజుల్లోగా 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లు
-ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత రావొద్దు
-ఇతర రాష్ట్రాలపై ఆధారపడొద్దు: సీఎం
-16 టన్నుల ప్లాంట్లు 6
-8 టన్నుల ప్లాంట్లు15
-4 టన్నుల ప్లాంట్లు 27

-రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలు
-వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు
-12 సబ్‌ సెంటర్ల నుంచి మందుల సరఫరా
-మందులు నిల్వ చేయడానికి కోల్డ్‌ స్టోరేజీలు
-బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక చర్యలు
-కొవిడ్‌ అడ్మిషన్లు తగ్గటం చాలా సంతోషకరం
-కరోనాపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
-కేంద్రం నుంచి వచ్చిన టీకా డోసులు 57,30,220
-ప్రస్తుతం ఉన్నస్టాక్‌ 1,86,780
-(కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి)కొవాగ్జిన్‌ 58,230,కొవిషీల్డ్‌ 1,28,550

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ రోగులకు ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలి. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్‌ దవాఖానలను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఎకడైనా ఒకటే వైద్యం అయినందున కొవిడ్‌ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత రావొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొవిడ్‌ రోగులకు అవసరమైన ప్రాణవాయువు అందించడానికి 324 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా మరో 100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటును కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు. 16 మెట్రిక్‌ టన్నుల ప్లాంట్లు ఆరు, 8 మెట్రిక్‌ టన్నుల ప్లాంట్లు 15, 4 మెట్రిక్‌ టన్నుల ప్లాంట్లు 27.. హైదరాబాద్‌లో, జిల్లా, ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకొకటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఆక్సిజన్‌ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం కొవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకోండి
రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ రోగులకు ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలని సీఎం కేసీఆర్‌ కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్‌ బెడ్స్‌ 2,253, ఐసీయూ బెడ్స్‌ 533, జనరల్‌ బెడ్స్‌ 4,140 ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలో ఎకడైనా ఒకటే వైద్యం అయినందున కొవిడ్‌ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలని కోరారు.

రీజినల్‌ సబ్‌ సెంటర్లు
ప్రభుత్వ దవాఖానల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం కొత్తగా 12 రీజినల్‌ సబ్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. వీటిని సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్‌, గద్వాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రీజినల్‌ సబ్‌ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ దవాఖానలకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, మందులు నిల్వ చేయడానికి సబ్‌ సెంటర్లలో కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పేదలు వైద్యం పొందే ప్రభుత్వ దవాఖానలకే ఆక్సిజన్‌ సరఫరా విషయంలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌ కొరత ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టంచేశారు.

బ్లాక్‌ ఫంగస్‌కు ఈఎన్టీ, సికింద్రాబాద్‌ గాంధీ
కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి సోకుతున్నదని, దానికి చికిత్స అందించడం కోసం కోఠిలోని ఈఎన్టీ, సికింద్రాబాద్‌లోని గాంధీ, జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీ దవాఖానలకు వైద్య పరికరాలు, అవసరమైన మందులు సమకూర్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను కోరారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్‌ మిషన్లు, హెచ్‌డీ ఎండోసోపిక్‌ కెమెరాలను తక్షణమే తెప్పించాలని సీఎం ఆదేశించారు.

వ్యాక్సిన్‌ కోసం నిరంతరం సంప్రదింపులు
కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్‌ టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సిన్ల కోటా కోసం నిరంతరం సంప్రదిస్తూ, తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే వచ్చిందని, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసుల స్టాకు ఉన్నదని అధికారులు సీఎంకు తెలిపారు.

ప్రైవేట్‌ దవాఖానల్లో ధరలపై ఎప్పుడో నిర్ణయం
ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, వివిధ పరీక్షలకు నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం జీవో నంబర్‌ 248 విడుదల చేసిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో అకడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ రాష్ట్రాల్లోనూ ప్రైవేట్‌ దవాఖానల్లో పేషంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నట్టు తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు వివరించారు.

కొవిడ్‌ చికిత్సకు అనంతగిరి దవాఖాన
వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఉన్న 200 పడకల దవాఖానను తక్షణమే కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, రైల్వే, ఆర్మీ, ఈఎస్‌ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని దవాఖానలను కొవిడ్‌ సేవలు అందించడానికి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

కొవిడ్‌ అడ్మిషన్లు తగ్గడం సంతోషకరం
ప్రభుత్వ దవాఖానల్ల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు లాక్‌డౌన్‌, జ్వరసర్వే, కొవిడ్‌ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్నవారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమన్నారు. జ్వరసర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సీఎం సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, సీఎంవో కార్యదర్శి, కొవిడ్‌ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు సర్ఫరాజ్‌ అహ్మద్‌, రొనాల్డ్‌ రాస్‌, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ కే రమేశ్‌రెడ్డి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ డాక్టర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మౌలిక వసతుల కల్ప న కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఈ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కాలేజీలు లేని చోట వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్‌ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సూచించారు.

సీఎంకు మంత్రి కొప్పుల కృతజ్ఞతలు
జగిత్యాలలో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం పై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు వైద్యవిద్య మరింత అందుబాటులోకి రావటమే కాకుండా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. సంగారెడ్డికి మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.