పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్కు చెందిన పార్లమెంట్, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం వైఖరి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్ర విధానం, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. సమావేశానికి సీనియర్ అధికారులు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.