Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నాలుగు చట్టాలతో నూతన పట్టణ విధానం

-రెండురోజుల్లో ముసాయిదా రూపొందించాలి
-అర్బన్ పాలసీతోపాటే.. గ్రామీణ, రెవెన్యూ విధానాలు
-ప్రజలకు పారదర్శకంగా సేవలందేలా కొత్త చట్టాలు
-రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలి
-గ్రామాల అభివృద్ధికి ఐదేండ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చుచేస్తాం
-మూడునెలల్లో గ్రామాల్లో మార్పు కనిపించాలి
-విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
-రాష్ట్రంలో నాలుగుచోట్ల పంచాయతీరాజ్ సమ్మేళనాలు
-త్వరలో హైదరాబాద్‌లో కలెక్టర్ల సదస్సు
-ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
-నూతన అర్బన్ పాలసీలో కొత్త చట్టాలు
-కొత్త మున్సిపల్ చట్టం
-కొత్త కార్పొరేషన్ల చట్టం
-కొత్త హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం
-ఇతర నగరాల అభివృద్ధి సంస్థల చట్టం

అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శకంగా సేవలందేలా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ది జరిగేవిధంగా నూతన పాలసీలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నూతన పట్టణ పాలసీతోపాటు కొత్త గ్రామీణ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీ కూడా రూపొందించాలన్నారు. నూతన పట్టణ పాలసీలో భాగంగా నాలుగు నూతన చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చట్టాల ముసాయిదాను రెండురోజుల్లో రూపొందించాలని నిర్దేశించారు. కొత్తగా రూపొందించే చట్టప్రకారమే పరిపాలన జరుగాలని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాలని తెలిపారు. బాధ్యతలను విస్మరించినవారిపై కఠినచర్యలు తీసుకునే అధికారం కూడా చట్టం కల్పిస్తుందని సీఎం స్పష్టంచేశారు. పల్లెలు పరిశుభ్రతతో కళకళలాడాలని, మూడునెలల్లో అన్ని పల్లెల్లో మార్పు కనిపించాలని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఏటా రూ.ఏడువేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.35వేల కోట్ల నిధులు ఖర్చుచేస్తామని, వీటిని స్థానికసంస్థలు సమర్థంగా వినియోగించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో నాలుగుచోట్ల సమ్మేళనాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని సీఎం తెలిపారు.

గ్రామాభివృద్ధిని నిత్యం పర్యవేక్షించడానికి వంద ఫ్లయింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటుచేసి నిత్యం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటువేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టంచేశారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్‌లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నూతన పట్టణ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, పురపాలకశాఖ కమిషనర్ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ మరో మెట్టు ఎక్కాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, రాష్ట్ర ప్రాధాన్యాలను గుర్తించాం. సంక్షేమరంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాం. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నాం. మంచినీళ్ళ సమస్యను తీర్చుకున్నాం. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం టీఎస్ ఐపాస్ చట్టం చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ మరో మెట్టు ఎక్కాలి. దీనికోసం మంచి విధానాలు రావాలి. కొత్తగా పంచాయతీరాజ్ చట్టం చేసుకున్నాం. ఇదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు కూడా రావాలి. పరిపాలన పారదర్శకంగా, వేగంగా, అవినీతికి ఆస్కారం లేని విధంగా సాగాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

ప్రజాప్రతినిధులు గ్రామాల వికాసానికి పూనుకోవాలి
గ్రామాల అభివృద్ధికి ఏటా దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు, ఐదేండ్లలో 35వేల కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినం. ఈ నిధులను సమర్థంగా వినియోగించుకునేవిధంగా జిల్లా పరిషత్తులు, గ్రామీణ స్థానిక సంస్థలు బలోపేతం కావాలి. తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని పిలుపు ఇస్తున్నా. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు, గ్రామాల వికాసానికి ప్రభుత్వంచేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినం. రాష్ట్రంలో నాలుగుచోట్ల ఈ సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఈ సమ్మేళనాలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, సీఈవోలను ఆహ్వానిస్తాం.గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారుకావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయాన్ని ఈ సమ్మేళనాలలో చర్చిస్తారు. సమ్మేళనాల తరువాత అధికారులతో కూడిన వంద ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేస్తాం, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయి. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠినచర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మూడునెలల్లో మార్పు కనిపించాలి అని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టంచేశారు.

ఒక పద్ధతి ప్రకారం పాలన సాగాలి
నూతన పట్టణపాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్ల చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలి. హెచ్‌ఎండీఏతోపాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలి. రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల డ్రాఫ్ట్ తయారుచేయండి. త్వరలోనే అసెంబ్లీని సమావేశపరిచి కొత్త చట్టాలు తెస్తాం. అవినీతికి ఆస్కారం లేని విధంగా, అక్రమ కట్టడాలకు ఏ మాత్రం వీలులేని విధంగా, పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడేలా కొత్త చట్టాలుండాలి. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినం. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారాలను కూడా చట్టంలో కల్పించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతాం. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చుచేయకుండా, ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యాలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలి. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలి. వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలి. రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం నగర పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలి అని సీఎం అధికారులకు స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.