టీఆర్ఎస్ను గెలిపిస్తే జన్మలో చూడని హైదరాబాద్ను చూపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. తనలాంటి మొండోడు ఉంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖండాంతారాలు దాటుతుందని చెప్పారు.

-జన్మలో చూడని హైదరాబాద్ను చూపిస్తా -పొట్టకూటి కోసం వచ్చిన సెటిలర్లతో విభేదాల్లేవు -విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జేపీ, దినేశ్రెడ్డి మల్కాజిగిరిలో పోటీ -అల్వాల్ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని అల్వాల్లో టీఆర్ఎస్ బహిరంగ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా ట్రాఫిక్, కాలుష్యం, మురికివాడలు లేని భాగ్యనగరం చూడగల్గుతామని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ కావాలన్నా.. లక్షల కోట్ల నిధులు రావాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని బంజారాహిల్స్ మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. నగరానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్తోపాటు, మంచినీటికి కొరత లేకుండా చూస్తానని చెప్పారు. వితంతువులకు వేయి రూపాయలు, వృద్ధులకు రూ.15 వందలు పింఛన్లు ఇస్తామన్నారు. కేవీపీ కాళ్లు మొక్కిన పొన్నాల వైఎస్ రాజశేఖర్రెడ్డి దగ్గర గుమస్తాగా పని చేసిన కేవీపీ కాళ్ళు మొక్కి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ర్టానికి న్యాయం చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ఆరు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న పొన్నాల కనీసం స్వంత నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసుకోలేని అసమర్ధుడని విమర్శించారు. ఇటువంటి వ్యక్తి తెలంగాణను ఎలా ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు.
ఉద్యమంలో కాంగ్రెస్ నేతలెక్కడ? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళి పోవాలంటే తప్పా? అని నిలదీశారు. చచ్చినా.. చంపినా సరే తెలంగాణ దిక్కే మాట్లాడుతానని కేసీఆర్ ఉద్ఘాటించారు. పొట్టకూటి కోసం వచ్చిన సెటిలర్లతో విభేదాలు లేవని, కేవలం పొట్టకొట్టే సీమాంధ్రుల పైనే పోరాటం అన్నారు. చం ద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు వద్దని చెప్పినా చంద్రబాబుతో వెంకయ్య బీజేపీకీ లింకు పెట్టించాడని అన్నారు. 90 సీట్లలో టీఆర్ఎస్దే జయం రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. నగర శివార్లలో టీఆర్ఎస్కు బలం లేదని విమర్శించేవారు ఈ సభకు వచ్చిన జనా న్ని చూడాలని అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు ఓటు వేస్తే తెలంగాణ చిన్నబోతదని అభిప్రాయపడ్డా రు. 14 వందల మంది బలిదానాలు చేసుకుంటే మల్కాజిగిరి ప్రజలు సోయితప్పి ఎందుకున్నారని తెలంగాణ బాధపడ్తదని అన్నారు. దినేశ్రెడ్డి, జేపీలకు మల్కాజిగిరి స్థానంపై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. సెటిలర్ల ఓట్లు ఉన్నాయని ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ సెటిలర్లు వారికి ఓటు వేస్తే.. మనంకూడా జిద్దుగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు ఓటు వేసి మైనంపల్లి హన్మంతరావును ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలన్నారు. మైనంపల్లిని విజయవాడలో నిలబెడితే ఆంధ్ర ప్రజలు ఒక్క ఓటైనా వేస్తారా? అని ప్రశ్నించిన కేసీఆర్.. మరి మనమెందుకు సీమాంధ్ర నాయకులకు, సీమాంధ్ర పార్టీలకు ఓట్లు వేయాలని అన్నారు. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ను గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆత్మగౌరవానికి పరీక్ష అన్నారు.
చివరి వరకూ అడ్డుకున్న బాబు చంద్రబాబు చివరి వరకు తెలంగాణను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. కొంతమంది సన్నాసులు ఇంకా చంద్రబాబును అంటిపెట్టుకున్నారని అన్నారు. సీమాంధ్రులు ఇంకా తెలంగాణ ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోక్సత్తాకు సత్తా లేదని ఆది ఏక్సత్తాగా తయారైందని అభివర్ణించారు. కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొడ్తారని ఆరోపిస్తున్నారని, నిజానికి సీమాంధ్రులే విద్వేషాలు రెచ్చగొడ్తున్నారని ఆరోపించారు.
దినేష్రెడ్డి నెల్లూరులో, జేపీ విజయవాడలో పోటీ చేయకుండా తెలంగాణలో పోటీ చేయడం విద్వేషాలు రెచ్చగొట్టడం కిందకు రాదా? అని ప్రశ్నించారు. 60 ఏళ్ళలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే తెలంగాణకు తీరని నష్టం చేశాయన్నారు. కొత్తగా టీఆర్ఎస్ మేస్త్రీనే ఎన్నుకోవాలని సూచించారు. సభలో మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కనకారెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి గజ్గెల నగేష్, మేడ్చల్ అభ్యర్థి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ అభ్యర్థి రామ్మోహన్గౌడ్, ఉప్పల్ అభ్యర్థి సుభాష్రెడ్డి, కూకట్పల్లి అభ్యర్థి పద్మారావు, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.