-అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నారా? -రైతులను కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబు సర్కారుదే -రైతు రుణాలన్నీ మాఫీ చేయటం అనాలోచిత నిర్ణయమా? -ఉద్యమ సమయంలో లేని ప్రేమ ఉస్మానియాపై ఇప్పుడెందుకు? -టీఆర్ఎస్ ఎంపీ సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ధ్వజం

అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, టీడీపీలే ప్రస్తుత రైతు ఆత్మహత్యలకు కారణమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రావులు చంద్రశేఖర్రెడ్డి లాంటివారు రైతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్తో కలిసి సుమన్ విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పడం సిగ్గుచేటని సుమన్ మండిపడ్డారు.
రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం అనాలోచితమా? ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేసిన తెలంగాణ రైతులకు రూ.483 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందించడం అనాలోచితమా? ఆంధ్రా పాలకులు కాల్పులు జరిపి రక్తం కళ్లజూసిన ఎర్రజొన్న రైతులకు రూ.11.5 కోట్ల బకాయిలను చెల్లించడం అనాలోచితమా? అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించిందని తెలిపారు. పగటిపూటే రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న విషయాన్ని టీడీపీ నాయకులు గ్రహించాలని సూచించారు.
రైతులను కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబుదే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పాలనలో పడినన్ని కష్టాలు రైతులు ఎన్నడూ ఎదుర్కోలేదని సుమన్ అన్నారు. కష్టాలు భరించలేక పిట్టల్లా రాలిపోతున్న రైతన్నలను ఎగతాళి చేసి మాట్లాడిన విషయం మర్చిపోవద్దన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి, రైతులను కాల్చి చంపిన చిరిత్ర టీడీపీ న్రభుత్వానిదేనని విమర్శించారు. రైతులకు పంటల బీమా, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కష్టాలుండవని, కానీ వీటని కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను పోలీస్ అధికారులు స్టీఫెన్ రవీంద్ర, సీతారామాంజనేయులు చిత్రహింసలు పెట్టి తప్పుడు కేసులు బనాయించి జైళ్లపాలు చేసినపుడు కనిపించని ప్రేమను కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు చూపుతున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ హయాంలో ఉస్మానియాకు ఎన్నినిధులు, ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి నాయకులు ఉస్మానియా గురించి మాట్లాడుతుంటే యాకుబ్రెడ్డి, యాదయ్య, వేణుగోపాల్రెడ్డి, ఇషాన్రెడ్డి వంటి వీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. ఎన్కౌంటర్లు ప్రభుత్వ విధానం కాదని, టీఆర్ఎస్ విధానం అంతకన్నా కాదని బాల్క సుమన్ స్పష్టంచేశారు.
ఆత్మహత్యలకు ప్రతిపక్షాలే ఉసిగొల్పుతున్నాయి: శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్ముక్కై రైతులను ఆత్మహత్యలు చేసుకొనేలా ఉసిగొల్పుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ రూపొందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలైతే పుట్టగతులుండవనే భయంతోనే బురదజల్లే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు.