-రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి లక్ష్మారెడ్డి -గ్లోబల్సిటీగా హైదరాబాద్ అభివృద్ధి -పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ -టెరి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన
వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయన ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావుతో కలిసి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. ఆ తర్వాత జరిగిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను రెండు, మూడేండ్లలో అధిగమిస్తామన్నారు. విద్యుత్ కొరత నివారణకు ప్రత్యేక ప్రణాళికలతోపాటు ప్రత్యామ్నాయ వనరులపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంతోపాటు పునరుత్పాదక ఇంధనకేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
సౌరవిద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ అనువైనదన్న మంత్రి కేటీఆర్.. రెండు నెలల క్రితం 500 మెగావాట్ల సౌర విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి టెండర్లను ఆహ్వానిస్తే 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 30 లక్షల ప్రభుత్వ భూమిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ రంగాల సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. టెరి డైరెక్టర్ జనరల్ ఆర్కే పచౌరీ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన కేంద్రంగా నిలిచేందుకు తెలంగాణ అనువైన ప్రాంతం అని చెప్పారు. టెరికి హైదరాబాద్లో రెండో క్యాంపస్ ఏర్పాటవుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టెరి విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ లీనా శ్రీవాత్సవ్, కార్యదర్శి ఎస్కే జోషి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీ జే నారాయణన్, ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు.
ఇదీ టెరి వర్సిటీ నేపథ్యం పునరుత్పాదక వనరుల నుంచి ఇంధన ఉత్పత్తిపై పరిశోధనలు జరిపే ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి)ని గోపన్పల్లిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నారు.ఈ విశ్వవిద్యాలయం పర్యావరణ అనుకూల పునరుత్పాదక ఇంధనం, పర్యావరణం తదితర అంశాలపై కోర్సులు నిర్వహిస్తున్నది.