మినీడెయిరీల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మన ఊరు – మన పాడిపంట – మన ప్రణాళిక అనే నినాదంతో వ్యవసాయానికి అనుబంధంగా డెయిరీ రంగం బలోపేతానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి

నాబార్డు సహకారంతో ప్రతి ఇంటికి రెండు బర్రెలు పంపిణీ చేసే వినూత్న పథకం ప్రవేశపెట్టామని శుక్రవారం డెయిరీబిజ్ ఇండియా – 2014 సదస్సులో మంత్రి పోచారం మాట్లాడుతూ చెప్పారు. పాడి పరిశ్రమలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ), నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఏఏఆర్ఎం), ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లి నుంచి ఈ పథకం ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు మహిళలకు రూ.1.30 కోట్ల చెక్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
ఈ పథకం వల్ల రెండెకరాల భూమి సాగుతో వచ్చే ఆదాయం, బర్రెల పాలతో వచ్చే ఆదాయంతో సమానమన్నారు. పశు సంవర్థక శాఖలో మౌలిక వసతుల కల్పనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.370 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు 108 తరహాలో మొబైల్ వ్యాన్ సౌకర్యం కల్పించనున్నట్లు పోచారం ప్రకటించారు. ఇందుకోసం రూ.280 కోట్లు విడుదల చేస్తామన్నారు. జంట నగరాలకు ప్రతిరోజు 20 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా, విజయ డెయిరీ కేవలం 4.5 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నదని చెప్పారు. మిగతా పాలు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సదస్సులో నాబార్డ్ సీజీఎం జీజీ మమ్మేన్, ఐసీఏఆర్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అనిల్ కుమార్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.