నాందేడ్లో బీఆర్ఎస్ దౌడ్ అనేక మార్లు చప్పట్లు.. జిందాబాద్లు.. తెలంగాణ మాడల్ పేరెత్తితే చాలు.. హర్షధ్వానాలు.. బీఆర్ఎస్ ఎజెండా చెప్తే చాలు కేకలు.. ఈలలు.. దేశ్ కీ నేత కైసా హో.. కేసీఆర్ కీ జైసా హో.. కేసీఆర్ జరూర్ ఆనా.. దేశ్ కో బదల్నా! అంటూ బిగించిన పిడికిళ్లు..
-రైతులు ఏకమైతేనే కిసాన్ సర్కార్.. జో తెలంగాణ మే.. వో సబ్ దేశ్మే..
-తెలంగాణలో సాధ్యమైంది.. మహారాష్ట్రలో, దేశంలో ఎందుకు కాదు?
-తెలంగాణ పథకాలు కావాలంటే గులాబీ జెండా ఎత్తాల్సిందే: సీఎం కేసీఆర్
-బీఆర్ఎస్లో భారీగా మహారాష్ట్ర ప్రముఖుల చేరిక.. సభ సూపర్ హిట్
-తెలంగాణ – మహారాష్ట్రది రోటి బేటీ బంధం
-ఇన్ని నదులున్న మహారాష్ట్రలో నీటి కష్టాలా?
-శివాజీ పుట్టినూరు సాక్షిగా రైతు రాత మారుస్త
-మహారాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ కమిటీల ఏర్పాటు
-పది రోజుల్లో ప్రతి ఊరికి బీఆర్ఎస్ బండి..
-వచ్చే జడ్పీఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది
-రైతులు, కార్మికుల కుటుంబాలే జనాభాలో సగం
-ఏమంటున్నారు? వినబడటం లేదు.. చెవి ఒగ్గి అడిగాడు కేసీఆర్
-అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్..
-అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్..
-ఆయన వద్దనే దాకా నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
-24 గంటల కరెంటు కావాలా.. వద్దా?
-వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలా లేదా?
-హోనా హీ హై.. దేనా హీ హై.. మరోసారి సభ దద్దరిల్లింది.
-అనేక మార్లు చప్పట్లు.. జిందాబాద్లు.. తెలంగాణ మాడల్ పేరెత్తితే చాలు.. హర్షధ్వానాలు.. బీఆర్ఎస్ ఎజెండా చెప్తే చాలు కేకలు.. ఈలలు.. దేశ్ కీ నేత కైసా హో.. కేసీఆర్ కీ జైసా హో.. కేసీఆర్ జరూర్ ఆనా.. దేశ్ కో బదల్నా! అంటూ బిగించిన పిడికిళ్లు..

తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం బీఆర్ఎస్ నిర్వహించిన సభాస్థలిలో దృశ్యమిది. జాతీయ పార్టీగా మారిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణను దాటి వేరే రాష్ట్రంలో సభ ఇదే మొదటిసారి. ఈ సభ ఊహించిన దానికన్నా ఎక్కువ విజయవంతం అయ్యింది. ఎనిమిదిన్నరేండ్ల తెలంగాణలో తన ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నదో కేసీఆర్ వివరించి.. ఇవి తెలంగాణలో చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేం అని ప్రశ్నించినప్పుడు సభాస్థలి మొత్తం.. జరూర్ కర్నా (తప్పక చేయాల్సిందే) అని తీర్మానించింది. ఒకప్పటి తెలంగాణలాగే రైతు ఆత్మహత్యలకు నెలవైన మరాఠ్వాడా ప్రాంత ప్రజలు సరైన నాయకుడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ఆ సన్నివేశం పట్టిచెప్పింది.
ఉద్యమకారుడి నుంచి రాష్ట్ర సాధకుడిగా, పార్టీ అధినేత నుంచి ప్రభుత్వాధినేతగా, 56 ఏండ్ల వలసపాలన విధ్వంసకుడి పాత్ర నుంచి 8 ఏండ్లలో ప్రగతి ప్రదాతగా, ప్రాంతీయ పార్టీ సారథి నుంచి జాతీయ పార్టీ అధినేతగా, తెలంగాణ ప్రియ పుత్రుడు కేసీఆర్ భరతమాత ముద్దు బిడ్డగా, మరో ముందడుగు వేశారు.
తెలంగాణ గడ్డ నుంచి జాతీయ, రాజకీయ సమరాంగణంలోకి ఉత్తరాది గేట్వే మహారాష్ట్ర వేదికగా శంఖారావం పూరించారు. రాజకీయ నేత నుంచి రాజనీతిజ్ఞుడిగా.. దేశం కోసం.. ఈ జాతి కోసం.. భూమి పుత్రుడి నిరంతర ప్రయాణం
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏకమైతే కేంద్రంలో కిసాన్ సర్కార్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. హలాలు (నాగళ్లు) పట్టి పొలాలు దున్నిన చేతులతోనే కలాలు (పెన్నులు) పట్టి చట్టాలు చేసేందుకు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రంవచ్చి 75 ఏండ్లు గడిచినా ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి కనీస అవసరాలు కూడా తీరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే దేశ గతిని మార్చేందుకు తాను జాతీయ రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్ను స్థాపించానని చెప్పారు. మరో 10 రోజుల్లో మహారాష్ట్రలోని గ్రామగ్రామాన పార్టీ కమిటీల ఏర్పాటు మొదలవుతుందని, రాబోయే జడ్పీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఛత్రపతి శివాజీ, సాహూ మహరాజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు జన్మించిన పుణ్యభూమి మహారాష్ట్రకు ప్రణామం చేస్తున్నానంటూ ప్రసంగం ప్రారంభించారు. ఒకప్పుడు టీఆర్ఎస్ పేరుతో తెలంగాణకే పరిమితమైన పార్టీ.. ఇటీవలే బీఆర్ఎస్గా మారిందని చెప్పారు. దేశంలోని దుర్భర పరిస్థితులను నిశితంగా గమనించిన తర్వాత.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకొన్నానని, ఇందుకోసం జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టానని వెల్లడించారు. మహారాష్ట్రలో తెలంగాణ తరహా అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు.
మనది రోటీ బేటీ సంబంధం
ఎనిమిదేండ్ల కిందటి వరకు తెలంగాణ ప్రాంతం మహారాష్ట్రకన్నా తీవ్ర కష్టాలను అనుభవించిందని సీఎం కేసీఆర్ అన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో భగవంతుడికే తెలుసని, దీంతో ఎంతోమంది రైతులు మరణించారని చెప్పారు. రాత్రిపూట కరెంట్తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, పాములు తేళ్లు కుట్టి కొంతమంది, విద్యుత్తు షాక్లతో కొందరు మరణించారని తెలిపారు. తాగునీటి కష్టాలు మరీ దారుణంగా ఉండేవని, ఉపాధిలేక సగం మంది బతుకుదెరువు కోసం వలసపోయేవారని పేర్కొన్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఎదర్కొన్న తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసని అన్నారు. ‘నాందేడ్ సరిహద్దున ఉన్న తెలంగాణలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. మనది రోటీ బేటీ సంబంధం. సోదర బంధం. ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. రోజూ వేల మంది ఇటువాళ్లు అటు.. అటువాళ్లు ఇటు వచ్చిపోతుంటారు. వాళ్ల ద్వారా తెలుసుకోండి’ అని సూచించారు.
తెలంగాణ తరహా అభివృద్ధి కావాలంటే
తెలంగాణలో రైతులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదుకొంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘యాదవుల కోసం 75 శాతం సబ్సిడీతో 7 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశాం. మత్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. నాయీ బ్రహ్మణులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి వర్గానికి ఉపాధి కల్పిస్తున్నాం. 17 లక్షల దళిత కుటుంబాల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చాం. ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా, వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు ఇస్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వెయ్యికిపైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఆ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలి.
ఇక్కడ నేతలు మారినా, జెండాలు మారినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడంలేదు. మిమ్ముల్ని యుద్ధం చేయమనో, వానలో తడవమనో, తల్వార్ పట్టుకోమనో చెప్పడం లేదు. గ్రామాల్లోకి వెళ్లిన తరువాత ఈ విషయాలు చర్చించండి. ఒక్క వేలితో కొడితే దెబ్బ తగలదు. అందరూ కలిసి పిడికిలి బిగించి కొడితే దెబ్బకు దిమ్మతిరుగుతుంది. మీ ఓటు మీ కోసమే. మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంటే తాగు, సాగు నీళ్లు వస్తాయి. కరెంటు వస్తుంది. గోల్మాల్ ఉండదు. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నా మాటల్లో సత్యం ఉన్నదనిపిస్తే, చిత్తశుద్ధి ఉన్నదనిపిస్తే గులాబీ జెండాను ఎగరేయండి. రైతు ప్రభుత్వాన్ని తీసుకురండి. మీ దమ్ము చూపండి’ అని పిలుపునిచ్చారు.
50 మోటర్లు పెట్టుకున్నా ఉచిత కరెంటు
తెలంగాణలో రైతులకు ప్రాజెక్టుల నుంచి పూర్తి ఉచితంగా సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో రైతు 50 మోటర్లు పెట్టుకున్నా అడగబోమని, కావాలంటే పక్కనే ఉన్న ఆదిలాబాద్కు వచ్చి చూడాలని కోరారు. తెలంగాణలో 70 లక్షల మంది రైతులకు రైతుబీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ప్రమాదమైనా, సాధారణ మరణమైనా ఎనిమిది రోజుల్లోనే రూ.5 లక్షల బీమా చెక్కును బాధితుడి ఇంటికే పంపుతున్నాం. ఇప్పటివరకు దాదాపు లక్ష మంది రైతుల కుటుంబాలకు చెక్కులు అందించాం. రైతుబంధు కింద ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నాం. రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. ఇందుకోసం గ్రామాల్లో ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. ఇదంతా తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాదు? మహారాష్ట్ర ప్రజలకు కూడా ఇవన్నీ దక్కాలంటే ఇక్కడ కూడా రైతు ప్రభుత్వం రావాలి’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
తెలంగాణలో అయ్యింది.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు?
తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఈ బక్క మనిషితో ఏమౌతుందని అంతా అనుకొనేవారని, కానీ ఇవాళ ఏమైందో మీ కండ్లముందే ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే నాయకుల ఆకారాన్ని చూసి హైరానా కావొద్దని, నేతలు మన ఓట్లతోనే బలపడతారని, మన ఓట్లతోనే వాళ్లు నాయకులుగా ఎదుగుతారనే వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు. ‘మన శక్తిని మనం గుర్తించనంతకాలం ఇలాగే ఆత్మహత్యలు కొనసాగుతాయి. మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకొంటే, బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తే రెండేండ్లలో మహారాష్ట్రతోపాటు యావత్ దేశంలో వెలుగులు నింపుతాం. దేశంలోని ప్రతి గ్రామంలో, మహారాష్ట్రలోని ప్రతి గల్లీకి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం.
తెలంగాణలో సాధ్యమైనప్పుడు, మహారాష్ట్రలో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు సాధ్యంకాదు? తెలంగాణ నాలుగు కోట్ల జనాభా గల చిన్న రాష్ట్రం. మహారాష్ట్ర జనాభా పన్నెండున్నర కోట్లు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లు. మహారాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి వ్యయం కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేరు? నిధులకు కొరత లేకున్నా పాలకులకు ఇవ్వాలనే మనసు లేదు. ఈ విషయాన్ని ప్రతిఒక్క రైతూ అర్థంచేసుకోవాలి. తెలంగాణలో లభిస్తున్న సౌకర్యాలు ఇక్కడ కూడా లభించాలంటే గులాబీ జెండాలను ఎత్తాల్సిందే. మీరే నేతలు కావాలి. మనలోనుంచే నాయకులు పుడతారు’ అని కేసీఆర్ ఉద్భోదించారు.
నాకోసం చనిపోయారా? అని ప్రధాని అనొచ్చా?
ఢిల్లీలో తమ హక్కుల కోసం 13 నెలలపాటు రైతులు ధర్నా చేసిన సమయంలో 750 మంది అన్నదాతలు చనిపోయారని గుర్తుచేసిన సీఎం కేసీఆర్, వారి గురించి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. రైతులంటే అంత చులకనా? అని నిలదీశారు. ఇదే విషయాన్ని ఒకరు ప్రధానిని అడిగితే ‘నాకోసం చనిపోయారా?’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు.
ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడితే.. దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. ‘దేశంలో ఎవరు అండగా నిలిచినా..నిలువకున్నా నేను రైతులకు అండగా ఉంటా. దేశంలో ఎక్కడా రైతు ఆత్మహత్యలు జరుగొద్దన్నదే నా లక్ష్యం. ప్రతి ఎకరాకు సాగునీరు అంది, ఉచితంగా విద్యుత్తు అంది, ఫసల్ బీమా వంటి నకిలీ పథకాలు కాకుండా రైతుబీమా వంటి భరోసా ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకోరు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా కిసాన్బంధు అమలు చేస్తాం. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. దేశంలో ఎక్కడ చూసినా రైతుల ధర్నాలే కనిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులు కొని, నెలలపాటు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వం అనుకొంటే 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేయలేదా? కానీ.. కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మనకు రిజర్వాయర్లు వద్దా?
ప్రపంచంలో అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉన్నదని, దాని నీటి నిల్వ సామర్థ్యం 6,500 టీఎంసీలు అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ విశాల భారతదేశంలో అలాంటివి కనీసం మూడు నాలుగు రిజర్వాయర్లయినా ఉండాలని, ఇప్పటివరకు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ‘మనదేశంలో సాగు యోగ్యమైన భూమి 41 కోట్ల ఎకరాలున్నది. బాధ్యతగల ప్రభుత్వాలుంటే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వవచ్చు. సముద్రం పాలవుతున్న నీటిని మళ్లించాల్సిన ప్రభుత్వాలు ట్రిబ్యునల్స్కు వెళ్లమంటున్నాయి.
20-30 ఏండ్లు ట్రిబ్యునళ్ల చుట్టూ తిరగాల్సిందేనా? గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్విరాన్మెంట్ కమిటీ.. ఇలా అనుమతులు రావాలంటే మరో 15 ఏండ్లు కావాలా? ఇక జాతీయ ప్రాజెక్టుకు 15-20 ఏండ్లయినా నిధులు రావు. ఈ ప్రభుత్వాలు వందేండ్లయినా సముద్రం పాలయ్యే నీళ్లను ఒడిసిపట్టి పొలాలకు పారించలేవు. రైతు ప్రభుత్వం వస్తేనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రైతు ప్రభుత్వం వస్తే నీళ్లు సముద్రంలో కలువకుండా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. మన బీడు భూమలకు నీళ్లు వస్తాయి. మన ఝాల్నాలో, పర్భణీలో, నాందేడ్లో, లాతూర్లో, గడ్చిరోలిలో..ఇలా నీరు అవసరమైన చోటికి బాజాప్తా తెచ్చుకోవచ్చు. శుద్ధిచేసిన మంచినీటిని ఇంటింటికీ తీసుకోవచ్చు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ధనిక దేశంగా మారొచ్చు
తాను రాజకీయాల్లో 50 ఏండ్లుగా కొనసాగుతున్న అనుభవంతో చెప్తున్నానని, మన దేశానికి పనిచేసే నాయకుడు, చిత్తశుద్ధి గల ప్రభుత్వం లభిస్తే అమెరికా కన్నా ధనిక దేశంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ‘మనదేశంలో అపార వనరులు ఉన్నాయి. అయినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందు కు మిగిలిపోయాం? ప్రకృతి, దేవుడు కలిసి మనకు నీళ్లు, భూమి, విద్యుత్తు, 140 కోట్ల మానవ వనరుల రూపంలో అద్భుతమైన వనరులు ఇచ్చారు. వాటిని వినియోగించడంలో లోపం వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశాన్ని 54 ఏండ్లు కాంగ్రెస్, 16 ఏండ్లు బీజేపీ పాలించింది. దేశం నేడు ఈ స్థితిలో ఉండటానికి వాళ్లే ప్రధాన కారణం’ అని విమర్శించారు. ప్రజలు సైతం కులం, మతం, పార్టీల పేరుతో విడిపోయారని, అందుకే దేశానికి ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
‘నేడు భారతదేశం ముందున్న లక్ష్యం ఏమిటి? మనకు ఏదైనా లక్ష్యం ఉన్నదా? లేక మన లక్ష్యాన్ని మర్చిపోయామా? ఎన్నికల్లో గెలవడం, అల్లర్లు చేయడమే మన లక్ష్యమా? కులమత విభేదాలు సృష్టించి రాజకీయం చేయడమే మన లక్ష్య మా? కోట్లు ఖర్చు చేసి, సారా తాగించి, హత్య లు చేసి ఎన్నికల్లో గెలవడమేనా మన లక్ష్యమా? ఎప్పటివరకు ఇలా ఇతరులను గెలిపిస్తుంటాం? ఎంతమంది ఓట్ల బిచ్చగాళ్లను మనం గెలిపిద్దాం? ఆలోచించండి. నేతలు మారుతారు కానీ రైతుల పరిస్థితులు ఎందుకు మారటంలేదు? తెలంగాణలో మాదిరిగా దేశంలో రైతుల బతుకులు మారాలంటే కిసాన్ సర్కార్ రావాల్సిందే’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
ఎంతో మందిని మట్టికరిపించిన చరిత్ర మనది
ఈ దేశం బుద్ధిజీవుల దేశమని, బుద్ధిహీనుల దేశం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘సమయం వచ్చినప్పుడు, నేతలు చేస్తున్న తప్పులు ప్రజలకు అర్థమైనప్పుడు ఎంతో మంది గొప్పగొప్ప నాయకులను మట్టి కరిపించారు. ఎమర్జెన్సీ సమయంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపుతో దేశం మొత్తం ఏమైంది! ఆ సమయంలో ‘మేమే గొప్ప’ అనుకున్న నాయకులను ప్రజలు విసిరి అవతల పడేశారు. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది. రైతు సోదరులారా.. 75 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ సమయం. ఇప్పటికైనా రైతు ప్రభుత్వం రావాలి. రైతులు హలాలు పట్టి దున్నడమే కాదు.. కలాలు పట్టి చట్టాలు లిఖించాల్సిన సమయం వచ్చింది’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘ధర్మస్య విజయోస్తు,
ఆధర్మస్య నాశోస్తు,
ప్రాణీషు సద్భవనాస్తు,
విశ్వస్య కళ్యాణమస్తు
జై మహారాష్ట్ర.. జై భారత్.. జై హింద్’
అని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
రాజధాని ఢిల్లీవెళ్తే.. 45 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. ఏరోడ్రోమ్ ఇరుకుగా ఉండటమే కారణం. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశ రాజధానిలో తాగునీటికి తండ్లాటనే ఉంటే, ఇక ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి?
సామాన్య విద్యార్థి ఎంపీ అయ్యాడు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేదికపై ఉన్న బాల్క సుమన్ను ప్రజలకు పరిచయం చేస్తూ.. ‘తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ యువ నేత కాలేజీలో చదువుకొనేవాడు. విద్యార్థిగా ఉండగానే నాతోపాటు పోరాడిండు. 29 ఏండ్లకే తక్కువ వయసులోనే ఎంపీ అయ్యాడు. అతడిలో ధైర్యంగా, నిజాయితీగా పోరాడే శక్తి ఉంది కాబట్టి నేతగా ఎదిగాడు. అంతేతప్ప నాయకుడికి పెద్ద ఆకారం ఉండాల్సిన అవసరం లేదు. మన నుంచే నాయకులు పుట్టాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
జింబాబ్వే 6,533 టీఎంసీల సామర్థ్యంతో కరేబియా డ్యామ్ కట్టింది. అంగారా నదిపై రష్యా 5,965 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మించింది. నైలు నదిపై ఈజిప్ట్ 4,600 టీఎంసీల డ్యామ్, బ్రిటిష్ కొలంబియా 2,600 టీఎంసీలతో డ్యామ్, చైనా త్రీగార్జెస్ డ్యామ్ 1,400 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మించింది. మరి, విశాల దేశమైన భారత్ ఎందుకు ఇలాంటి అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించలేకపోయింది? అబద్ధాలు చెప్పి జనాన్ని మోసపుచ్చటం కాదు ప్రభుత్వం చేయాల్సింది.. వినూత్నంగా ఆలోచించి దానిని కార్యాచరణలోకి తీసుకురావడం. అందు బాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచించాలి.
125 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తిచేసి దేశం మొత్తానికి 24 గంటలపాటు అందించినా, 125 ఏండ్లకు సరిపోతాయని తెలిపారు. బొగ్గు కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదని, మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్, ఉమ్రేడ్ తదితర ప్రాంతాల్లోనే అపార నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘బొగ్గు నిల్వలు, గోదావరి నది ఉన్నా ఇక్కడ నీటికి, కరెంటుకు తీవ్ర కొరత ఉండటంలో ఆంతర్యమేంటి? లోపం ఎక్కడున్నదో ప్రజలు గుర్తించాలి. మనం పార్టీల జెండా చూడగానే పిచ్చివాళ్లమవుతాం. దీనివల్ల మహా అయితే సర్పంచ్లు, జడ్పీ చైర్మన్లు అవుతారు తప్ప అంతకుమించి సాధించేదేమీ లేదు. మనకు కావాల్సింది పదవులేనా? మౌనంగా ఉన్నంతకాలం, ఏకం కాకుండా ఉన్నంతకాలం ఈ రాజకీయ నాటకం ఇలాగే కొనసాగుతుంది’ అని ప్రజలను జాగృతం చేశారు.
శివ్నేరి ప్రాశస్త్యం
క్రీ.శ 1వ శతబ్దానికే శివ్నేరి బౌద్ధుల ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. అక్కడి గుహలు, రాతి ఆకృతులు బట్టి ఇవి ఆ కాలానికి చెందినవేనని చెప్తారు. దేవగిరి యాదవుల అధీనంలో ఉన్నందున దీనికి శివ్నేరి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు బలహీన పడిన తర్వాత ఈ ప్రదేశం బహమనీ సుల్తానుల ఏలుబడి కిందకు వచ్చింది. 16వ శతాబ్దంలో అహ్మద్నగర్ సుల్తానుల చేతిలోకి వచ్చింది. 1595లో శివాజీ భోంస్లే తాత అయిన మలోజీ భోంస్లేను దీనికి చీఫ్గా అహ్మద్నగర్ సుల్తాన్ బహద్దూర్ నిజాం షా నియమించాడు. అతనికి శివ్నేరి, చక స్ ప్రాంతాలనిచ్చాడు. ఆంగ్ల యాత్రికుడు ఫ్రేజ్ ఈ కోటను సందర్శించాడు. అది అజేయమైన కోట అని అతను అభివర్ణించాడు. ఏడు సంవత్సరాల పాటు వెయ్యి కుటుంబాలను పోషించే నిల్వలు కోటలో ఉన్నట్టు ఫ్రేజ్ కథనాల ద్వారా తెలుస్తున్న ది. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం త ర్వాత 1820లో ఈ కోట బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. 2021లో ఈ కోట యు నెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకొన్నది.
జోక్ ఇన్ ఇండియా
ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇండియా’ జోక్ ఇన్ ఇండియాగా మారిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘మేక్ ఇండియా లక్ష్యం నెరవేరితే ప్రతి పట్టణంలో భారత్ బజార్లే ఉండేవి. కానీ ఇప్పటికీ గల్లీగల్లీలో చైనా బజార్లే ఉన్నాయి. కావాలంటే నాందేడ్లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్క తీయండి మీకే తెలుస్తుంది. పతంగుల మాంజా, దీపావళి పటాకులు, హోలీ రంగులు, వినాయక విగ్రహాలు.. చివరికి జాతీయ పతాకాలు కూడా చైనా నుంచే రావాలా? మన్కీ బాత్.. ఏ బాత్.. ఓ బాత్. ఇలా ఎప్పటి వరకు చెప్తారు? మనం మరణించేదాకా ఇలాంటి తియ్యటి పుల్లటి ముచ్చట్లు వినుడేనా? మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఆవేదనతో చెప్తున్నా. నేను చెప్పేది నిజమా కాదా? అనే విషయాన్ని మనసు పెట్టి ఆలోచించండి. ఇలా ఎంతకాలం సాగనిద్దాం?’ అని ప్రశ్నించారు. నేను రాజకీయాల కోసం ఆలోచించమని చెప్పుటం లేదు. ఇది జీవన్మరణ సమస్యగా పరిగణించి చర్చించండి. ఎంతకాలం ఇలా సమస్యలతో చస్తాం? ఎందుకు చావాలి? అసలు ఆత్మహత్య చేసుకోవటానికే పుట్టామా?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.