-పచ్చజెండా ఊపిన కేంద్రం -నాడు కేసీఆర్ చొరవతో కదలిక -నేడు ఎంపీ వినోద్ కృషితో సాకారం -ఫలించిన తొమ్మిదేండ్ల కల

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో 2005లో ఈ లైన్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లైన్కు మోక్షం కలిగింది. కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బీ వినోద్కుమార్ జరిపిన సుదీర్ఘ కృషితో అడ్డంకులు తొలిగిపోయాయి. సుమారు తొమ్మిదేండ్లనుంచి పెండింగ్లో ఉన్న ఈ లైన్కు రాష్ట్రప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంతో కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇక లైన్ నిర్మాణానికి భూమి సేకరించడంతోపాటు, మొత్తం ఖర్చులో మూడవ వంతును రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. రానున్న ఐదేండ్లవరకు ఆపరేటింగ్ నష్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూ సేకరణ ఎంత త్వరగా జరిగితే రైల్వే విభాగం నిర్మాణ పనులను అంత త్వరగా చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు విషయమై కరీంనగర్ ఎంపీ బీ వినోద్ కుమార్ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కే చంద్రశేఖరరావు 2004లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన సందర్భంలో సుమారు 149 కి.మీ. మేరకు మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. అయితే ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రులుగా ఉన్నవారు తగిన తీరులో స్పందించని కారణంగా ఈ ప్రతిపాదన పట్టాలు ఎక్కలేదని అన్నారు.
ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోక్షం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు లైన్ ఇప్పటికే ఉన్నదని, అయితే మెదక్, కరీంనగర్ లాంటి వెనుకబడిన జిల్లాల్లో రైలు సదుపాయం కల్పించాలని కేసీఆర్ భావించారని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమ నిర్మాణం పనుల్లో కేసీఆర్ బిజీగా ఉన్నందువల్ల అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఒక ఎంపీగా తాను తీవ్ర ప్రయత్నాలు చేశానని తెలిపారు.
కేసీఆర్ చేసిన ఈ ప్రతిపాదనపై సర్వే జరిపిన రైల్వే బోర్డు రేట్ ఆఫ్ రిటర్న్ కనీసంగా 14% ఉండాలని, అయితే ఈ లైన్కు మాత్రం కేవలం 2.64% మాత్రమే ఉన్నదని పేర్కొందని వినోద్ చెప్పారు. నష్టాన్ని భరించడానికిగానీ, భూ సేకరణకుగానీ, ప్రాజెక్టు వ్యయంలో మూడవ వంతును భరించడానికిగానీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సిద్ధం కాలేదని, అప్పటి ప్రధాని మన్మోహన్కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తదితరులకు కేసీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వైఎస్ సహకారం లేకపోవడంతో ఫలితం రాలేదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి సెప్టెంబర్ 17వ తేదీన కేంద్రానికి లేఖ రాశారని, వెంటనే కేంద్రం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. ఎంపీగా కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు కదలిక తీసుకొస్తే కరీంనగర్ ఎంపీగా ఇప్పుడు తాను దాన్ని కళ్లారా చూసే అవకాశం లభించిందని అన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడకు హైదరాబాద్, కరీంనగర్లతో రైల్వే అనుసంధానం ఏర్పడుతున్నదని చెప్పారు.
కేంద్రంతో సత్సంబంధాలనే కోరుతున్నాం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ, కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఈ సంబంధాలను దెబ్బతీసేలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో టీఆర్ఎస్ ఎంపీలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని తెలిపారు.
ఈ కృషికి రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సహకారం అందించాలని, కేంద్రానికి తెలియజేయాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో సాఫ్ట్వేర్ పరిశ్రమకు హబ్గా మారనున్నదని అన్నారు.
రూ.975 కోట్ల ఖర్చు సుమారు రూ. 975 కోట్ల మేరకు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసిందని, ఇది రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నదని బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) అంజుమ్ పర్వేజ్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే భూ సేకరణపై నిర్ణయం తీసుకోవాలని, దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం తెలియజేయాలని కోరారు. అంచనా ప్రకారం భూ సేకరణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తే నిర్మాణ పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ కలల ప్రాజెక్టు.. నాటి కరీంనగర్ ఎంపీ, నేటి సీఎం కే చంద్రశేఖర్రావు కలల ప్రాజెక్టు కదిలింది. దశాబ్దంగా ఎదురు చూస్తున్న కొత్తపల్లి-మనోహరాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గానికి రైల్వే శాఖ పచ్చ జెండా ఊపడంతో ఈ మార్గం సాధనకు నిర్విరామ పోరాటం చేస్తున్న ఎంపీ వినోద్కుమార్ కృషి ఫలించినట్లయింది. కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ అతి తొందరలోనే మొదలుపెడతామని ఎంపీ వినోద్కుమార్ టీ మీడియాకు తెలిపారు. వీలైతే గురువారం ముఖ్యమంత్రిని కలిసి భూసేకరణపై చర్చిస్తామని తెలిపారు.
కేసీఆర్ అలోచనతోనే..: కేసీఆర్ 2004లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. జిల్లా పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి, రవాణారంగంలో ఇబ్బందులను గుర్తించారు. వాటి పరిష్కారానికి ఏకైక మార్గం.. కొత్తపల్లినుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ వరకు రైలు మార్గాన్ని నిర్మించడమేనన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు యుద్ధప్రాతిపదికన అంచనాలు, ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించారు. దీనికి నాటి బడ్జెట్లో సర్వే నిమిత్తం రూ.10 కోట్లు కేటాయించారు. అప్పట్లో కాంగ్రెస్తో విభేదాలు.. తెలంగాణ ఏర్పాటులో వారు చూపిన అలక్ష్యాన్ని నిరసిస్తూ కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ స్థానానికి 2006లో రాజీనామాచేశారు. ఉప ఎన్నికల్లో 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. అయితే.. యూపీఏ ప్రభుత్వంనుంచి కేసీఆర్ బయటకు రావడంతో రైలు మార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తర్వాత వివిధ రైల్వే బడ్జెట్లలో నిధులు ప్రతిపాదించినా.. పైసా కూడా విడుదల కాలేదు.
ఫలించిన ఎంపీ వినోద్ పోరాటం: ప్రస్తుత కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్కు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గంపై పూర్తి అవగాహన ఉంది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వినోద్ ఎంపీగా ఉన్నారు. ఈ మార్గం అనుమతులు సాధించేందుకు అనాడు కేసీఆర్తో కలిసి పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడమే అలస్యం.. రైలు మార్గం సాధనకు తన పోరాటాన్ని మొదలు పెట్టారు. ఈ సమయంలో అనేక కొర్రీలను రైల్వేశాఖ వినోద్ ముందు పెట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు భారాన్ని భరించాలని, భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడంతోపాటు ఆ భారాన్ని సైతం భరించాలన్న నిబంధనలు పెట్టింది. ఆ మేరకు ముఖ్యమంత్రిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని షరతులకు అంగీకారం తెలియజేస్తూ లేఖలు రాశారు.
కేసీఆర్ కలకల ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రి సైతం ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయకుండా రైల్వే బోర్డు షరతులకు అంగీకారం తెలిపారు. ఇక లైన్ క్లియర్ అవుతుందని భావించిన తరుణంలో ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఐదేండ్లపాటు నిర్వహణ ఇబ్బందుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వే బోర్డు మెలిక పెట్టింది. దీనికీ అంగీకరించడంతో గత నెలలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.
ప్రయోజనాలో ఎన్నో..: ఈ మార్గం పూర్తి అయితే ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లినుంచి దక్షణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కొలువై ఉన్న వేములవాడ, సిరిసిల్ల, మెదక్ జిల్లా సిద్దిపేట మీదుగా తూప్రాన్ మండల పరిధిలోని మనోహరాబాద్కు రైళ్ల రాకపోకలు మొదలవుతాయి. ప్రస్తుతం కరీంనగర్నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 170 కిలోమీటర్లు. ఇదే రైలు మార్గంలో 24 కిలోమీటర్లు తగ్గుతుంది. కరీంనగర్ కార్పొరేషన్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాల్టీకి రవాణా సౌకర్యం చేకూరనుంది.