-పేదల ఆకలిని అర్థం చేసుకొన్న నేత
-6 కిలోలకు పెరిగిన బియ్యం కోటా
-రోగి సహాయకులకు రూ.5 కే భోజనం
-మానవతకు మారుపేరు..ఆకలిని అర్థం చేసుకొన్న కేసీఆర్
-దవాఖానల్లో డైట్ చార్జీలు డబుల్: మంత్రి హరీశ్రావు
సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపేలా అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగి సహాయకులకు (అటెండెంట్స్) మూడు పూటలా రూ.5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని గురువారం ఆయన.. హోం మంత్రి మహమూద్అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి ఉస్మానియా దవాఖానలో ప్రారంభించారు. దీంతోపాటు ఆర్థోపెడిక్ అకడమిక్ బ్లాక్, ఆపరేషన్ థియేటర్లు వంటివాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ‘గతంలో రేషన్ బియ్యం ఒక్కొక్కరికి కేవలం 4 కిలోలే ఇచ్చేవారు. పైగా 20 కిలోల సీలింగ్ ఉండేది. ఇంట్లో పది మంది ఉన్నా.. 20 మంది ఉన్నా 20 కిలోల బియ్యమే ఇచ్చేవారు. రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలోనే పేదలు అన్నానికి ఇబ్బంది పడొద్దని, కడుపునిండా భోజనం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచించారు. రూపాయికి కిలో బియ్యాన్ని కార్డుమీద ఎంతమంది ఉన్నా ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం తీసుకెళ్తున్నారు. పేదల కడుపు నింపడానికి ఖర్చుకు వెనుకాడలేదు’ అని వివరించారు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో అన్నం ముద్దముద్దగా ఉండేదని.. ఒక్కో విద్యార్థికి 200 గ్రాములని కొలిచి పెట్టేవారని గుర్తుచేశారు. పిల్లలు అర్ధాకలితో బాధపడుతుండటాన్ని గమనించిన కేసీఆర్ పిల్లలు తిన్నంత అన్నం పెట్టాలని ఆదేశించారని తెలిపారు.
రోజుకు 20 వేల భోజనాలు
అటెండెంట్ల ఆకలి తీర్చే పథకానికి సహకారం అందిస్తున్న హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్కు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 18 దవాఖానల్లో ఈ పథకం ద్వారా రోజుకు 20 వేల భోజనాలు అందిస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందుకు ఏటా ప్రభుత్వం రూ.40 కోట్ల వరకు వెచ్చిస్తున్నదన్నారు. ప్రధాన దవాఖానల్లో నైట్ షెల్టర్లను ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మించామని, మిగతావి త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ చార్జీలను రెట్టింపు చేసిందని, తద్వారా ఏటా రూ.43 కోట్ల ఖర్చు పెరుగుతున్నదని వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒకో బెడ్కు చెల్లించే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచామని, వీటి ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 338 కోట్ల భారం పడుతుందని వివరించారు.
ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు
స్వరాష్ట్రం రావడానికి ముందు వృద్ధులు.. కొడుకులు, కోడళ్లు, వితంతువులు తోబుట్టువుల మీద ఆధారపడేవారని హరీశ్రావు అన్నారు. వారు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం ఆసరా పింఛన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచారని తెలిపారు. దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ.లక్షా నూటపదహార్లు ఇస్తుండటంతో తల్లిదం డ్రులపై ఆర్థిక భారం తగ్గిందని వివరించారు. ఇవన్నీ ఎవరో దరఖాస్తు పెడితేనో.. దండం పెడితేనో అమలు చేసినవి కావని.. అందుకే సీఎం కేసీఆర్ను గొప్ప మానవతావాది అని మంత్రి హరీశ్రావు కొనియాడారు.
ఉస్మానియా విస్తరణపై ప్రాథమిక నివేదిక
రాజధానిలో రూ.2,679 కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. గచ్చిబౌలి టిమ్స్, నిమ్స్లో అదనంగా ఏర్పాటు చేయనున్న 2 వేల పడకల ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు విడుదల అవుతాయని చెప్పారు. వీటితోపాటు అల్వాల్లో ఎంసీహెచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధానిలోని అన్ని దవాఖానలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ చర్యల కోసం నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ మొట్టమొదట ఉస్మానియాలోనే పర్యటించారని, వెంటనే రూ.250 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి ఉత్తర్వులు విడుదల చేయించారని గుర్తుచేశారు. కానీ, చారిత్రక భవనాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వారసత్వ కట్టడాన్ని కాపాడుతూనే కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై అధ్యయనానికి నియమించిన కమిటీ ఇటీవలే ప్రాథమిక నివేదిక ఇచ్చిందని, పూర్తి నివేదిక అందిన తర్వాత దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ పాల్గొన్నారు.