-నదీజలాలపై కెలికి కయ్యం పెట్టుకొంటున్న ఏపీ -ఏడేండ్లుగా పూర్తి నిర్లక్ష్య వైఖరితో మోదీ సర్కార్ -మనజోలికి రాకుండా ఏపీకి దీటుగా జవాబునిద్దాం -జలాలపై కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలు చెప్దాం -కేటాయింపులు చేయని కేంద్రం తీరును నిలదీద్దాం -సమావేశానికి సమగ్ర సమాచారంతో హాజరుకండి -జలవనరుల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు -అపెక్స్పై నేడు ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను వెంటనే కేటాయించాల్సి ఉంటుంది. 2014న జూన్ 2న ఏర్పడిన తెలంగాణకు నీటి కేటాయింపులు జరుపాలంటూ అదే ఏడాది జూన్ 14న ప్రధానమంత్రికి లేఖ రాశాం. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్-3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసైనా.. లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా కేటాయింపులు జరుపాలని లేఖలో కోరాం. ఏడేండ్లు అవుతున్నా నేటికీ స్పందన లేదు. కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేకపోగా అపెక్స్ కౌన్సిల్ పేరిట ఏదో చేస్తున్నట్టు చెప్తున్నారు. నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకొంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆ రాష్ట్రంచేసే వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంచేయాలి. -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
రాష్ట్ర నీటిహక్కులను హరించేందుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా నిజాలను తేటతెల్లం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఈ నెల 6వ తేదీన తెలుగురాష్ర్టాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల్శక్తి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో జలవనరులశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ జలవనరులశాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు తీసుకొని సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ‘నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకొంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆ రాష్ట్రంచేసే వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంచేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, ఏడేండ్ల అలసత్వాన్ని సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘రాష్ర్టాల పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను వెంటనే కేటాయించాల్సి ఉంటుంది. 2014న జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి నీటి కేటాయింపులు జరుపాలంటూ అదే ఏడాది జూన్ 14న ప్రధానమంత్రికి లేఖ రాశాం. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్-3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసైనా.. లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా కేటాయింపులు జరుపాలని లేఖలో కోరాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏడేండ్లు అవుతున్నా ఆ లేఖపై నేటికీ స్పందన లేదని స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు చెప్తున్నారని అన్నారు. ‘ఈ నెల 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలి’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధంచేయాలని అధికారులకు సూచించారు.