-జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు -పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ -కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు -కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి -తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం -మంత్రి కే తారక రామారావు ఉద్ఘాటన -ఐటీ, పరిశ్రమలశాఖల నివేదికల విడుదల

సాధారణంగా ఒక రాష్ట్రం ఒక రంగంలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తుంది. కానీ, తెలంగాణ అటు వ్యవసాయం మొదలుకొని సాగు అనుబంధ రంగాలు, పరిశ్రమలు.. ఐటీ దాకా అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ది సాధిస్తున్నది. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండడానికి కారణం… సీఎం కేసీఆర్ దార్శనికత, విధానాల రూపకల్పనలో చొరవ, అమలులోచూపే పట్టుదల, సమర్థులైన అధికారుల సమిష్టి కృషి! ఈ అద్భుతవిజయంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. –ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్
-తెలంగాణ ఐటీ ఎగుమతులు1.45 లక్షల కోట్లు -నిరుటికంటే 13 శాతం ఎక్కువ -8%ఉద్యోగాల కల్పనలో మన వృద్ధి రేటు -జాతీయ సగటు 2 శాతమే! -కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 46,489 -దేశజనాభాలో తెలంగాణ ప్రజలు 2.4% -5% జీడీపీకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ -గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్
‘ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది… ఇక హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఆగమే…’ అని జోరుగా ప్రచారం జరుగుతున్న కాలమది. 2014 జూన్. ఆ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ ఐటీ పరిశ్రమ ప్రముఖులతో సమావేశమయ్యారు. దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రోగ్రెసివ్ ప్రభుత్వం ఏర్పడిందని, ఎవరికీ ఎలాంటి భయమూ అవసరం లేదని, హైదరాబాద్ ఐటీ పరిశ్రమను అద్భుతంగా తీర్చి దిద్దుతామని వచ్చే ఐదేండ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తామని కేటీఆర్ ఆ రోజు హామీ ఇచ్చారు.
-2014 తెలంగాణ ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు -2018-19లో ఐటీ ఎగుమతులు 1,09,219 కోట్లు -2020-21లో ఐటీ ఎగుమతులు 1.45,522 కోట్లు

ఐదేండ్లలో దాదాపు రెట్టింపు చేయడమే కాదు.. ఏడేండ్లలో ఏకంగా మూడు రెట్ల దరిదాపునకు తీసుకువెళ్లారు. 2014లో ఐటీ రంగంలో నేరుగా 3.2 లక్షల మంది ఉద్యోగులుంటే ఏడేండ్లలో ఆ సంఖ్య 6.28 లక్షలకు పెరిగింది. ఒక ఐటీ ఉద్యోగానికి అనుబంధంగా కనీసం ఇద్దరు ముగ్గురికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ లెక్కన దాదాపు 18 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించింది. ఆఫీస్ స్పేస్కు డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు అదనం. కరోనా అతలాకుతలం చేస్తున్న కష్టకాలంలోనూ, క్లిష్ట సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించి దేశానికే రోల్ మోడల్గా నిలిచింది.
ఒకసారి వస్తే..వాపస్ పోరు పరిశ్రమల రంగంలోకి కొత్తవాళ్లను తేవడమే కాదు.. ఉన్నవాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కేసీఆర్ చేసిన సూచన.
తెలంగాణ పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్ 80 శాతం. ఉదాహరణకు హెచ్ఎస్ఐఎల్ కంపెనీకి తెలంగాణ రాకముందు రాష్ట్రంలో రెండు ఫ్యాక్టరీలుంటే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది మరో ఆరు ఫ్యాక్టరీలు ప్రారంభించింది.
టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక పెట్టుబడులు 2.14 లక్షల కోట్లు వచ్చిన ఉద్యోగాలు 15.6 లక్షలు
వీహబ్తో -సమకూర్చుకున్న నిధులు (ఫండ్ రైజింగ్): 53.2 కోట్లు -లబ్ధి పొందుతున్న మహిళా ఆంత్రప్రెన్యూర్స్: 4,527 -ఇంక్యుబేషన్లో ఉన్న స్టార్టప్స్: 327 -భాగస్వాములు: 54 -స్టార్టప్ కార్యక్రమాలు: 16
IT లీడర్ కరోనా క్లిష్ట సమయంలోనూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాలు అద్భుత ప్రగతిని సాధించాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. జాతీయ సగటుతో పోల్చితే ఏడాదికాలంలో రెట్టింపు వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు. ఇదే సమయంలో కొత్తగా 46వేల మందికి పైగా ఐటీ రంగంలో ఉపాధి పొందారని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయని మంత్రి ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు తలకిందులవుతున్నా.. తెలంగాణ మాత్రం వాణిజ్య అనుకూల పరిస్థితులను కల్పించడంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పారు. ‘గత ఏడాది నుంచి ఐటీ పరిశ్రమ మొత్తం వర్క్ ఫ్రం హోం ద్వారానే నడుస్తున్నది. అయినప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, 2020-21లో రూ.1.45 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. జాతీయ వృద్ధి రేటుతో పోల్చితే ఇది రెట్టింపు కావడం విశేషం.
గతేడాదితో పోలిస్తే 13% అధికం. ఉద్యోగాల కల్పనలోనూ రాష్ట్ర ఐటీ పరిశ్రమ దాదాపు 8% వృద్ధిని నమోదుచేసింది. కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. ఉద్యోగాల కల్పనలో జాతీయ సగటు రెండు శాతం ఉంటే, ఇక్కడ 8% ఉన్నది’ అని కేటీఆర్ చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం ఆయన ఐటీ, పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, ఎవరూ అడగకపోయినా, పారదర్శకతను పాటించేందుకే తన శాఖల నివేదికలను ఏటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ‘క్లిష్ట సమయంలోనూ ఐటీ, పారిశ్రామిక రంగాలు సాధించిన పురోగతిని సంబురంలాగా జరుపుకోవాలి. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాదాసీదాగా జరుపుతున్నాం. యావత్ ఐటీ, పరిశ్రమల దిగ్గజాలు నేడు తెలంగాణ వైపు చూడటానికి సీఎం కేసీఆర్, సమర్థులైన అధికార బృందమే కారణం. వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ దార్శనికత, విధానాల రూపకల్పనలో చొరవ, అమలులో పట్టుదల వంటివి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముం దుంచుతున్నాయి’ అని అన్నారు.
IT లీడర్ -తెలంగాణలోనే రిపీట్ ఇన్వెస్ట్మెంట్లు పరిశ్రమల రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 15.6 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘పెట్టుబడి పెట్టిన సరిగా చూసుకుంటే వారే పెద్ద అంబాసిడర్లు’ అని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, దీనికి అనుగుణంగా తెలంగాణ పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 80% ఉన్నదని చెప్పారు. 2020-21లో టీఎస్ఐఐసీ కొత్తగా 10 పారిశ్రామిక పార్క్లు ప్రారంభించిందని తెలిపారు. 2014లో కేవలం రూ.57వేల కోట్ల ఎగుమతులు జరిగితే, ఏడేండ్ల తర్వాత ఇప్పుడు రూ. 1,45,522 కోట్లకు చేరిందని అన్నారు. వార్షిక వృద్ధిరేటు 14.25 శాతంగా ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నదనడానికి ఇవే మంచి ఉదాహరణలని చెప్పారు. పరిశ్రమల రంగంలోకి కొత్తవాళ్లను తేవడమే కాదు.. ఉన్నవాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కేసీఆర్ చేసిన సూచన. దీనికి అనుగుణంగా తెలంగాణ పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 80% ఉన్నదని చెప్పారు. హెచ్ఎస్ఐఎల్ కంపెనీ తెలంగాణ రాకముందు రాష్ట్రంలో రెండు ఫ్యాక్టరీలు ప్రారంభిస్తే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరో ఆరు ఫ్యాక్టరీలు ప్రారంభించిందని చెప్పారు.

సమతుల అభివృద్ధి సీఎం నాయకత్వంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ తదితర రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నదని, గ్రామీణ, పట్టణ అన్న తేడా లేకుండా సమతుల్య వృద్ధిని రాష్ట్రం నమోదు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో సమానంగా వృద్ధిని నమోదు చేస్తున్న అరుదైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచిందన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ ఐటీ పరిశ్రమ హైదరాబాద్కే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఫేస్బుక్, టెక్మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని చెప్పారు. ఈ తరహా పెట్టుబడులు ద్వితీయ శ్రేణి నగరాలకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని, మహబూబ్నగర్, నిజామాబాద్లో వాటి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. సిద్దిపేట, నల్లగొండ, రామగుండంలో త్వరలో నిర్మాణాలు చేయబోతున్నట్టు చెప్పారు.
జీడీపీలో మనదే ప్రధాన వాటా 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లు అని, భారత్ మొత్తంగా చూస్తే జీడీపీ 8% తగ్గితే, తెలంగాణలో తగ్గుదల 1.26 శాతమే ఉన్నదని కేటీఆర్ వివరించారు. వ్యవసాయ రంగంలో 20.9% వృద్ధి సాధించామన్నారు. జాతీయస్థాయిలో 3శాతమే ఉంటే, తెలంగాణలో 20.9% ఉన్నదని చెప్పారు. జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది 4.7% ఉంటే, ఈ ఏడాది 5% ఉన్నదన్నారు. జనాభాకు రెట్టింపు స్థాయిలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నామని చెప్పారు. దేశ తలసరి వార్షికాదాయం రూ.1,27,768 ఉంటే, తెలంగాణలో రూ.2,27,145గా ఉన్నదన్నారు.
ఉద్యోగాల కల్పన అతి పెద్ద సవాల్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు వారి సంఖ్య 6.28 లక్షలకు పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రం, కరోనా వంటి అనేక సవాళ్ల మధ్య ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలు లభించడం విశేషమన్నారు. పరోక్షంగా దాదాపు రెండున్న రెట్ల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. మొత్తంగా ఐటీ రంగంపై 20 లక్షల మందికి పైగా ఆధారపడ్డారని, దీనికి అదనంగా పరిశ్రమల రంగంలో ప్రత్యక్షంగా 15లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు.
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ? కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ ఖర్చు పెట్టారో తనకు తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం చిన్న, మధ్య పరిశ్రమలకు ఎంతో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో చర్యలు తీ సుకుంటున్నదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని సమర్థంగా వినియోగించాలంటే కేంద్రం రాష్ట్రాలతో మేక్ ఇన్ ఇండియా నినాదంతో కలిసి పనిచేయాలని అన్నారు.