-అన్ని జిల్లాల్లో ఐటీ విస్తరణ
-ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులను తయారుచేసే సత్తా మనది
-నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ ఆకాంక్షలన్నీ నెరవేరుస్తున్నాం
-లక్షా 12వేల ఉద్యోగాలు ఇచ్చితీరుతాం
-ప్రైవేట్లో 5.50 లక్షల ఉద్యోగాలు సృష్టించాం: కేటీఆర్
-కోటి ఎకరాల మాగాణమే సీఎం కేసీఆర్ సంకల్పం..
-టీఎస్ఐపాస్ విప్లవాత్మక విధానం
-నిజామాబాద్ సభలో ఐటీ మంత్రి కే తారకరామారావు
-నగరంలో ఐటీ హబ్ భవన నిర్మాణానికి భూమి పూజ ..
-పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
హైదరాబాద్కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలన్నింటిలో ఐటీహబ్లు ఏర్పాటుచేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రపంచానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను తయారుచేయగల సత్తా మనకుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతం నుంచి ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్ల వరకు ఉంటే.. ఈ సంవత్సరం దాదాపు లక్ష కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది అనుకున్న లక్ష్యం మేరకు లక్షా25వేల కోట్లకు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. నిజామాబాద్ నగరంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్ భవనానికి బుధవారం నిర్వహించిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానం ఫలాలను సామాన్యులకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాలన్న సీఎం కేసీఆర్ సూచనమేరకు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ తదితర నగరాల్లో స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరంలో వెయ్యికి తగ్గకుండా ఉద్యోగాలు నిజామాబాద్ ఐటీ హబ్లో కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. దాశరథి ఇదే నిజామాబాద్ జిల్లా జైలుగోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని బొగ్గుతో రాశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కూడా కావాలనే సంకల్పంతో ఉన్నారు. గోదావరి, కృష్ణానదిలో మనకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు కృషిచేస్తున్నారు. ఆ నీటిని కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. ఆడకూతుళ్ల కష్టం తెలిసిన మనసున్న సీఎం కాబట్టి.. ఈరోజు ఏ ఆడబిడ్డ నీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్లమీదకు రావొద్దని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
కొలువుల హామీ నెరవేరుస్తాం
లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 46వేలు, సింగరేణి, పోలీస్శాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్.. మొత్తంగా లక్షా 12వేలు కాదు.. అనుకున్నదానికంటే ఇంకో పదిపన్నెండు వేల ఉద్యోగాలు ఎక్కువగానే ఇచ్చే సంకల్పంతో ముందుకు పోతున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా గడిచిన మూడేండ్లలోనే రాష్ర్టానికి లక్షా23వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఫలితంగా ప్రైవేట్రంగంలో కొత్తగా 5.50 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగామని చెప్పారు. ఈ క్రమంలోనే నిజామాబాద్లో ఐటీహబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇందూరు బిడ్డలు.. అద్భుత ఆవిష్కరణలు ఇందూరు బిడ్డలు ఐటీ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేశారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నిజామాబాద్కు చెందిన రాజురెడ్డి 30 ఏండ్లకిత్రం హైదరాబాద్లో ఒక సంస్థను హైదరాబాద్లో ఏర్పాటుచేశారని, దానిని జపాన్ సంస్థ ఇటాచీ టేకోవర్ చేసిందని తెలిపారు. ఈ రోజు రాజురెడ్డి కీలకమైన బాధ్యతలో ఉన్నారని చెప్పారు. నిజామాబాద్ మరో ముద్దుబిడ్డ సామా ఫణీంద్ర రెడ్బస్ డాట్ ఇన్ అనే సంస్థను ఏర్పాటు చేశారని, ఆ కంపెనీ ఈ రోజు వందల కోట్లకు చేరుకున్నదని తెలిపారు. ప్రస్తుతం ఫణీంద్ర రూపాయి జీతాన్ని కూడా ఆశించకుండా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్కు సీఈవోగా ఉన్నారని వివరించారు. వాహనాల లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్లు ఒకే చోట ఉండేలా రాడికల్ ట్రైబ్ అనే సంస్థ రూపొందించిన యాప్ను 20 లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇవన్నీ కిందిస్థాయి ప్రజల సమస్యల్లోంచి వచ్చినవేనని చెప్పారు. ప్రపంచానికి అవసరమయ్యే పరిజ్ఞానాన్ని, ఉత్పత్తులను తయారుచేసే సత్తా మనకు కూడా ఉందని అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం నిజామాబాద్లో ఐటీహబ్ ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని కేటీఆర్ వెల్లడించారు. పట్టణంలో ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుచేయాలని ఎంపీ కవిత కోరారని, త్వరలోనే నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం.. ప్రభుత్వానికి రెండుకళ్లు సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకుపోతుంటే కొందరికి నచ్చడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ను గద్దెదించేవరకు నిదురపోమంటున్నారు. ఇంకొకరు కేసీఆర్ను గద్దెదించేంత వరకు గడ్డం తీయనని చెప్తున్నారు. ఆయన గడ్డం పెంచుకొని సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప మనకు పోయేది ఏంలేదు అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. అన్నివర్గాల వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ను గద్దె దించాలంటున్నారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. రాష్ర్టాన్ని 55 ఏండ్లు పాలించినవారు ఈ పనులన్నీ చేసి ఉంటే తమకు ఈ రోజు ఈ అవకాశం వచ్చేదా? అని నిలదీశారు. అరవై ఏండ్ల దారిద్య్రం నాలుగేండ్లలో పోదని చెప్పారు. మీ అధిష్ఠానాలు, మీ బాసులు ఢిల్లీలోనో, అమరావతిలో ఉండొచ్చు.. మా టీఆర్ఎస్కు బాసులు ఢిల్లీలో లేరు.. నిజామాబాద్ గల్లీలోనే ఉన్నరు అని అన్నారు. అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ముందుకుపోతున్న ప్రభుత్వానికి ఏకపక్షమైన తీర్పునిచ్చి టీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని ప్రజలను కేటీఆర్ కోరారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, స్థానిక అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మిషన్ భగీరథ వైస్చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ఆమీర్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్రావుపట్వారీ తదితరులు పాల్గొన్నారు.
యువతను మేల్కొలిపేలా తారక మంత్రం ఐటీ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగం యువతను మేల్కొలిపే తారక మంత్రంలా సాగింది. ఇందూరు జిల్లా యువతకు ఐటీ హబ్ అండగా నిలువనుండడంతో యువత తమ ఆలోచనలకు పదును పెట్టాలని, ప్రపంచానికి పనికివచ్చే నూతన ఆవిష్కరణలకు నడుం బిగించాలని ఇచ్చిన పిలుపు యువతను ఆలోచింపజేసింది. ఆవిష్కరణలు, నూతన ఆలోచనలు ఆకాశం నుంచి ఊడిపడవని, మనం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుండే పుట్టుకొస్తాన్నారు. ఇలా తమ జీవితంలో కొత్త ఆవిష్కరణలు చేసి విజయవంతంగా సమాజానికి మేలుచేస్తున్న రెడ్బస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్స్ సెల్ సీఈవో సామ ఫణీంద్రను వేదికపై పరిచయంచేశారు. టాక్సీ దొరుకక విసిగివేసారిన ట్రామ్ష్ కలానీ ఎవరైనా తాము ఉన్న దగ్గరకే టాక్సీ వచ్చేలా చేయాలని తలచి చేసిన ఆవిష్కరణే ఉబెర్ సంస్థ అని చెప్తూ.. ఇప్పుడు ఈ స్టార్టప్ ప్రపంచంలోనే అత్యంత విలువైనదని వివరించడం యువతను ఆలోచింపజేసింది.
ఉత్తమ్.. ఓ దర్జీ కథ.. ఉత్తమ్కుమార్రెడ్డి గురించి కేటీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. గతంలో ఒక ఊళ్లో ఒక దర్జీ ఉండేవాడు. దసరా పండుగ ఆర్డర్లు బాగా ఉండటంతో ఓ రోజు జోరుగా బట్టలు కుడుతున్నడు. అప్పుడే చీకటి పడతాంది. మిషన్ నుంచి సూది కిందపడ్డది. ఎంత దేవులాడినా దొరకలే. చూసిండు.. చూసిండు.. అక్కడ దేవుడి పటం ఉంటే దేవుడా.. ఆ సూది దొరికితే కిలో చక్కెర తీసుకొచ్చి నీకు ప్రసాదమిస్తానని మొక్కిండు. అప్పుడే ఇంట్లోకెళ్లి భార్య వచ్చింది.. నీకు బుద్ధి ఉందా? ఐదు పైసల సూది కోసం ఎవరైనా కిలో చక్కెర మొక్కుతరా? ఇంకో సూది కొనుక్కుంటే సరిపోదా అన్నది. అయితే అప్పుడు ఆయన.. ముందు సూదైతే దొరకనీ. దేవుడొచ్చి అడిగేది ఉందా! అన్నడు.. కాంగ్రెసోళ్లది అట్లనే ఉంది. ఏదో ఒకటి చెప్పాలె. ఓట్లు వేయించుకోవాలె. అవుతల పడాలె. ఐదేండ్లు కనబడకుండా మాయం కావాలె. ఈ ఆలోచనలతో, నీతిమాలిన వాగ్దానాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు. ఇందూరు నుంచి అతిపెద్ద ఐటీవిప్లవం -ఎంపీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ జిల్లా నుంచి అతిపెద్ద ఐటీ విప్లవం రావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం రాబోయే తరాల యోగక్షేమాల కోసం పనిచేస్తున్నదని, తెలంగాణ సాధించుకున్నది కూడా భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు. బుధవారం నిజామాబాద్లో ఐటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఐటీ ఫలాలు తెలంగాణ పిల్లలందరికీ అందాలనే ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో ఐటీహబ్ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. రేపటి బిగ్గెస్ట్ ఐటీ రెవల్యూషన్ నిజామాబాద్ నుంచి రావాలని ఆకాక్షించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ఏది చదివినా ఐటీ హబ్లో ఏర్పాటుచేసిన టాస్క్ అనే ప్రత్యేకవింగ్ ఒక స్నేహితుడు, గైడ్లాగా ఉపయోగపడుతుందని చెప్పారు. మన ఇంట్రస్ట్, టాలెంట్కు తగ్గట్టుగా సమాధానం దొరుకుతుందని చెప్పారు.
ఐటీహబ్ అనేది కేవలం ఐటీ స్టూడెంట్స్ కోసమే అని అనుకోవద్దని.. సెల్ఫోన్, సోలార్ ప్యానల్ రిపేరింగ్ కూడా నేర్చుకోవచ్చని, ఐటీఐ దగ్గరనుంచి చదువుకున్న స్థాయినిబట్టి ట్రైనింగ్ తీసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఐటీహబ్తో ఎంవోయూ చేసుకోవడానికి వచ్చినవారందరికీ నిజామాబాద్ విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సెప్టెంబర్30న రూరల్ షోర్ అనే ఔట్సోర్సింగ్ సంస్థ వందమందితో ప్రారంభం కాబోతున్నదని వెల్లడించారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం పైచదువులు చదివినవారు హైదరాబాద్, ముంబై, బెంగళూరు తదితర నగరాలకు పోతున్నారని.. మంత్రి కేటీఆర్ ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీహబ్ను ఎందుకు పెట్టకూడదని ఆలోచించి నిజామాబాద్లో ఐటీ కంపెనీని సాంక్షన్ చేశారన్నారు. ఎంపీ కవిత సూచన మేరకు ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాలతో అమెరికా వెళ్లి 45 కంపెనీలతో ఒప్పందం చేసుకుని వచ్చినట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో ఎంతో ప్రోత్సహించారని అన్నారు.
హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే టీ హబ్: మహేశ్ బిగాల హైదరాబాద్ తర్వాత టీ హబ్ తెలంగాణలోని నిజామాబాద్లోనే ఏర్పాటవుతున్నదని, టీ హబ్ను జిల్లాకు కేటాయించినందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్బిగాల అన్నారు. ఇక్కడ చదువుకున్నవారు హైదరాబాద్ వెళ్లి జాబ్ చేసుకునే పరిస్థితి ఉందని, మంత్రి కేటీఆర్ చొరువతో ఇప్పుడు ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్లోనే ఐటీ హబ్ ను ఏర్పాటుచేస్తున్నారని చెప్పారు. పది కంపెనీల వారు ప్రత్యక్షంగా ఐటీహబ్ శంకుస్థాపనలో పాలుపంచుకోవడానికి వచ్చారని తెలిపారు. హైదరాబాద్ అంతటి స్థాయిలో నిజామాబాద్లో ఐటీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
పలు కంపెనీల ఎంవోయూలు నిజామాబాద్ ఐటీహబ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ చేసుకున్నాయి. దాదాపు పన్నెండు కంపెనీల ప్రతినిధులు బుధవారం మంత్రి సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారు. మొత్తం 45 కంపెనీలు ఐటీహబ్లో పనిచేయడానికి ముందుకొచ్చాయి. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ రాంకిషన్రావు, ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.