-నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-పథకానికి కరీంనగర్లో ప్రత్యేక బ్యాంక్ ఖాతా
-జిల్లాల్లో హోరెత్తిన దళితుల సంబురాలు
-హుజూరాబాద్లో ఊరూరా మోగిన దండోరా
-అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
-తొలుత 5,000 కుటుంబాలకు లబ్ధి
-హుజూరాబాద్లో దళిత బంధుకు 500 కోట్లు

దళిత దండోరా మార్మోగింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదలచేయడంతో జిల్లాల్లో సంబురాలు మిన్నంటాయి. పథకం కొనసాగింపుపై ఎకసెక్కాలాడిన నోళ్లు మూతపడ్డాయి. పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న హుజూరాబాద్లోనైతే డప్పుల మోతలు.. డ్యాన్సుల కేరింతలతో భూమి ఆకాశం ఏకమైంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ సైతం ఆనందంతో తానే స్వయంగా డప్పుపై దరువేస్తూ నాట్యమాడారు..
దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్ మోడ్) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజలు సంబురాలు చేసుకొన్నారు.
గ్రామగ్రామాన దండోరా మోగించి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ కలలుగన్న స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కేసీఆర్ చిత్రటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామంలోని 76 కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను ఈ నెల ఐదోతేదీనే ప్రభుత్వం విడుదలచేసింది. దళితబంధు పథకం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచారు. అందులోనే సోమవారం విడుదలచేసిన రూ.500 కోట్లను జమచేశారు. హుజూరాబాద్ నియోజకర్గంలో దళితబంధు లబ్ధిదారుల కోసమే ఈ నిధులను వినియోగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

హోరెత్తిన సంబురాలు..
దళితబంధు నిధులు విడుదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపళ్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. ఇల్లందకుంటలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక దళితులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొన్నారు. వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు నాయకత్వంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొన్నారు. హుజూరాబాద్ మండలం కందుగులలో జడ్పీటీసీ పడదం బక్కారెడ్డి అధ్వర్యంలో అంబేద్కర్, కేసీఅర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు చిత్రపటాలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పాలాభిషేకం నిర్వహించారు. కమలాపూర్లో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, జడ్పీటీసీ కల్యాణి, వైస్ ఎంపీపీ శైలజ, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్రావు, మండల ఇంచార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పింగిళి ప్రదీప్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హుజూరాబాద్లో దళిత బంధుకు 500 కోట్లు
-పకడ్బందీగా పథకం అమలు
-కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
దళితబంధుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్లు జిల్లా ఖాతాకు చేరాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత కుటుంబాలు 20,929 ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్టుగా కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే ప్రస్తుతం వచ్చిన రూ.500 కోట్లతో 5వేల కుటుంబాలకు తొలి విడుత లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
పకడ్బందీగా పథకం అమలు
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే ప్రస్తుతం వచ్చిన రూ.500 కోట్లతో 5వేల కుటుంబాలకు తొలి విడుత లబ్ధి చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ప్రభుత్వ ఆదేశాలు, ఇప్పటివరకు జరిగిన సర్వేల ఆధారంగా దళిత కుటుంబాలకు లబ్ధి కల్పిస్తాం. హుజూరాబాద్లో దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దళితబంధు ఒక ఉద్యమం
దళితబంధు ఒక పథకం మాత్రమే కాదు.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమం. చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. ఈ పథకంతో దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నారు. నిన్నటిదాకా అవాకులు చవాకులు పేలిన బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఇప్పుడు ఎటుపోయారు? దళితులతోపాటు అన్ని వర్గాలు సీఎం కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 16న జమ్మికుంటలో సీఎం కేసీఆర్ నిర్వహించే సభకు దళితులంతా తరలిరావాలి.
-ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కేసీఆర్కు దళిత జాతి రుణపడి ఉంటుంది
రాష్ట్రంలోని దళిత జాతి ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటుంది. దళిత జనోద్ధరణ కోసం పాటుపడే సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దళితబంధు పథకంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కంపించిపోతున్నాయి. వాసాలమర్రిలో మొదలైన దళిత సంక్షేమ విప్లవం హుజూరాబాద్ మీదుగా రాష్ట్రమంతటా విస్తరిస్తున్నది. – ఎమ్మెల్యే టీ రాజయ్య
మరచిపోలేని రోజు
దళిత జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.500 కోట్లు విడుదల చేయటం మా దళిత జాతికి సుదినం. మా జీవితాలను మార్చే భగవంతుడు సీఎం కేసీఆర్. ఎన్ని జన్మలెత్తినా సీఎం కేసీఆర్ రుణం దళిత జాతి తీర్చుకోదు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్
-సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం
దళిత జాతి ఉద్ధరణకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. అన్నమాట ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.500 కోట్లు కేటాయించటం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్