-ప్రతిపక్షాల విమర్శలన్నీ ఉద్దేశపూర్వకమే -పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం -విమర్శలు చేసే ముందు క్షేత్రస్థాయికి వెళ్లాలి: మంత్రి హరీశ్రావు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడునెలల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల హరీశ్రావు అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు మరెన్నో కొత్త పథకాలను ప్రజలకోసం చేపట్టామని తెలిపారు. తమ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్కు ప్రశ్నించే హక్కుందా.. 2009 ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఏడునెలల పాలనలో సగానికి పైగా హామీలను నెరవేర్చిన తమను ప్రశ్నించే హక్కు ఎక్కడిదని హరీశ్రావు అన్నారు. తొమ్మిది గంటల కరెంటు, ఒక్కొక్కరికీ ఆరు కేజీల బియ్యం, 24లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తామన్నారు. ఐదేండ్ల్లు అధికారంలో ఉండి ఏ ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? కొత్త రాష్ట్రంగా అవతరించిన నేపథ్యం, పక్క రాష్ట్రం కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్న పరిస్థితులు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో లేకున్నా దేశానికి ఆదర్శంగా ఉండే ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేసి రూ.4,250 కోట్లు కొత్త రుణాలు ఇచ్చాం. రూ.200 పింఛన్ను ఐదింతలు చేసి రూ.1000 చొప్పున 25లక్షల మందికి ఇస్తున్నాం. పవర్లూం కార్మికులకు రుణమాఫీ వర్తింపచేసినందుకా మాపై విమర్శలు? ఆటోడ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు పాత బకాయిలు రద్దు చేసింది వాస్తవం కాదా? మీ కాంగ్రెస్ పాలనలో ఎర్రజొన్న రైతులకు రుణమాఫీ అడిగితే తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం ఎర్రజొన్న రైతులకు పాత బకాయిలు చెల్లించామా లేదా? ఆర్మూర్, బాల్కొండ రైతులను అడగండి అని అన్నారు. ఆర్టీసీకి మొదటిసారి రూ.400 కోట్లు విడుదల చేసి 1000 కొత్త బస్సులు కొన్నది.. చెరువుల పునరుద్ధరణకు చేపడుతున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగనిది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు చంద్రబాబును విమర్శించాలి.. జలహారంతో నాలుగేండ్లలోగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం ఫలవంతం అయ్యేందుకు ముఖ్యమంత్రి 8గంటలపాటు అన్నిశాఖల వారిని కూర్చోబెట్టి రివ్యూ చేయడం గతంలో ఏనాడైనా చూశారా అంటూ ప్రతిపక్షాలను హరీశ్రావు నిలదీశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి నిధులు, వరంగల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్కు, హైదరాబాద్లో పేకాట క్లబ్బులు మూసివేతతో తమ జీవితాలు బాగుపడ్డాయని మహిళలు సీఎం కేసీఆర్ను దీవిస్తున్నారు. మీరేమో హైదరాబాద్లో ఉంటూ గాంధీభవన్, ఎన్టీఆర్ భవన్లలో ప్రెస్మీట్లు పెట్టి ఏం జరగడంలేదు అని అంటున్నారు అని వ్యాఖ్యానించారు. గత పాలకులు తమ నెత్తిన పెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు అప్పులను రూ.500 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతావి కూడా చేస్తామని చెప్పారు.