నియంత్రిత సాగుపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి విప్ దామోదర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి, ఎంపీ రాములు, కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగిందన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవన్నారు.

రాబోయే రోజులలో తెలంగాణలో బావిలో చెంబుతో నీళ్లు ముంచుకునే పరిస్థితులు వస్తాయన్నారు. ఆరేళ్ల కేసీఆర్ పాలనతో అభివృద్ది వైపు రాష్ట్రం పరుగెత్తుతుందన్నారు. వ్యవసాయం బాగుపడితే గ్రామాలు బాగుపడతాయని వినూత్న పథకాలు తెచ్చారన్నారు. కోటి 23 లక్షల ఎకరాలలో ఈ ఏడాది సాగు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సారి 40 లక్షల ఎకరాలలో వరి సాగయిందని, రైతుల బాగుకోసమే సమగ్ర వ్యవసాయ విధానం తెచ్చారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా దిగుబడి అయి నిలువ ఉందని రైతులకు చెప్పారు మంత్రి. మరో ఏడాది వాడినా మక్క నిలువలు తరిగిపోవు అన్నారు.