-పెన్షన్లు మొత్తం మీరే ఇస్తున్నారా? -నిరూపిస్తే నిమిషంలో పదవికి రాజీనామా -బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ -రాష్ట్రం నుంచే రూ.11 వేల కోట్ల పెన్షన్లు -కేంద్రం ఇస్తున్నది 105 కోట్లే

రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లపై బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా మండిపడ్డారు. పింఛన్లలో కేంద్రం ఇస్తున్నదెంత? రాష్ట్రం ఖర్చుపెడుతున్నదెంతో తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం రూ.11వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నదని, ఇందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.105 కోట్లేనని చెప్పారు. తాను చెప్తున్నది అబద్ధమని రుజువుచేస్తే ఒక్క నిమిషంలో తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.. ‘మన రాష్ట్రంలో 38,64,751 మందికి పెన్షన్లు ఇస్తున్నం. ఇందులో అన్ని రకాల పెన్షన్లున్నయి. మనం ఒక్కరికి రూ.2016 ఇస్తున్నం. ప్రతి ఊరుకు లక్షల రూపాయలు వస్తున్నయి. టంచన్గా నెల తప్పకుండా వస్తున్నాయి. దరఖాస్తు లేదు, పైరవీ లేదు బాజాప్తా పోస్టాఫీసుకు వస్తాయి. మనం 38లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, కేంద్రంలో ఉన్న బీజేపీ ఇస్తున్నది కేవలం 7 లక్షల మందికే. మనం రూ. 2016 ఇస్తే.. కేంద్రం ఇచ్చేది మనిషికి రూ.200. అంటే ఏడాదికి ఎంత. పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా అనేకమందికి మనం ఇచ్చేది రూ. 2016. దీనికోసం మనం ఏడాదికి రూ. 11 వేల కోట్లు కేటాయిస్తే, బీజేపీ ఇచ్చేది కేవలం రూ. 105 కోట్లు. దానికి కేంద్రమే ఇస్తున్నది పెన్షన్లు అంటరు. పెన్షన్లు ఇచ్చేది రాష్ట్రం అయితే బీజేపీ ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నరు. కేసీఆర్ అబద్ధం చెబుతున్నరు అని అంటున్నరు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? ఇంత దిగజారిపోయి బతుకుడెందుకో నాకర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా రుజువు చేస్తరా? రూ. 11వేల కోట్ల దాకా రాష్ట్రం ఖర్చు చేస్తున్నది. ఈ లెక్క చూసేందుకు కాగ్ ఉంటది. అన్ని ప్రభుత్వాల ఖర్చులను వారు ప్రచురిస్తారు. నేను చెప్పేది రికార్డుల్లో ఉంది. నేను చెప్పేది అబద్ధమే అయితే.. ఎవడైనా రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
దుబ్బాకలో వాళ్లు గెలిచేది లేదు.. చేసేది లేదు.. ‘దుబ్బాకల ఎన్నికలు జరుగుతున్నయి. బీజేపీ ఆడ గెలిచేది లేదు, ఏది లేదు. అక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నమో అంత బ్రహ్మాండంగ ఉన్నం. నాలుగు రోజులైతే మీరే చూస్తరు. ఎటువంటి ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతరంటే.. దేశాన్ని పాలించే పార్టీ తప్పుడు ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్అలీ దొంగ నాటకం చేస్తడు. గణేశ్ అని చెప్పి ఒక ఎలక్ట్రీషన్ ఉంటే ఆయనతో పంట కాలబెట్టించి, రైతులు కాలబెట్టినట్లు డ్రామా చేశారు. పత్రికా విలేకరులకు, సోషల్ మీడియాకు ఇచ్చి మోసం చేసే యత్నం చేశారు. ఇంత మోసమా’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.