అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ను నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. స్వచ్ఛమైన నీరు పొందడం కనీస మానవ హక్కుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంగళవారం సచివాలయంలో తన చాంబర్లో మీడియాతో తెలిపారు. రెండు మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు రక్షిత మంచినీటిని ఇచ్చే ఉద్దేశంతో వాటర్గ్రిడ్ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

-ప్రతిరోజు గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాలకు150 లీటర్ల రక్షిత నీరు -25 వేల గ్రామాలు, 67 పట్టణాలకు పైప్లైన్ల ద్వారా సరఫరా -వాటర్గ్రిడ్పై నేడు సిద్దిపేటలో మంత్రులు, అధికారులకు అవగాహన కల్పించనున్న సీఎం -వాటర్గ్రిడ్ లక్ష్యాలను వెల్లడించిన మంత్రి కేటీఆర్ -నేడు సిద్దిపేటకు తరలనున్నరాష్ట్ర క్యాబినెట్ 20 ఏండ్ల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన సిద్దిపేట తాగునీటి ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకొని చేపడుతున్న ఈ తాగునీటి వాటర్గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతిరోజు గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 150 లీటర్ల తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా ప్రటి ఇంటికి తాగునీటి సరఫరా చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2050 నాటికి రాష్ట్రంలోని ప్రజల, పరిశ్రమల నీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ బృహత్తర ప్రాజెక్టును కేవలం వాటర్గ్రిడ్గా మాత్రమే పరిగణించకుండా స్మార్ట్ వాటర్గ్రిడ్గా కూడా రూపొందించనున్నట్లు చెప్పారు. బుధవారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలంగాణ వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి వివరాలను మంత్రి మంగళవారం మీడియాకు వివరించారు. ఈ వాటర్గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో 25 వేల గ్రామీణ ఆవాసాలకు, 67 పట్టణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా సురక్షిత తాగునీరు అందించొచ్చన్నారు. వాటర్గ్రిడ్ కోసం గోదావరి నుంచి 34 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 21.41 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రాథమిక అంచనాగా నిర్ణయించినట్లు తెలిపారు.
పనుల్లో సమన్వయం పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టర్మ్కీ విధానం పాటిస్తున్నట్లు వివరించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామస్థాయిలో మహిళలు, సర్పంచ్ల ఆధ్వర్యంలో తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి, పర్యవేక్షణ , నాణ్యత తనిఖీ బాధ్యతలు అప్పగించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
సిద్దిపేట ప్రాజెక్టే స్ఫూర్తి 20 ఏండ్ల కిత్రం రూపుదిద్దుకున్న సిద్దిపేట సమగ్ర మంచినీటి సరఫరా పథకమే నేటి వాటర్గ్రిడ్కు స్ఫూర్తి. సిద్దిపేట మానేరు నీటి సరఫరా పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక. 1996-97 ప్రాంతంలో ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరందించేందుకు రూ.60 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని గడపగడపకు నీటిని సరఫరా చేసి అపర భగీరథుడిలా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ పథకం నేటికీ విజయవంతంగా 180 గ్రామాలకు మంచి నీటిని అందించగలుగుతున్నది.
వాటర్గ్రిడ్లో ఎత్తుపల్లాలు, నీటి వనరుల ఆధారంగా భౌగోళిక పరిస్థితులను అవగాహన చేసుకొని, శాస్త్రీయ అంచనాలతో రూపొందిస్తున్న నెట్వర్క్తో మొత్తం 26 గ్రిడ్లు ఉండబోతున్నాయి. వాటర్గ్రిడ్ పథకంలో పూర్తిగా పైప్లైన్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. పైపులైన్ల పొడవు సుమారు లక్షా 27వేల 500 కిలోమీటర్లు ఉంటుంది.
స్మార్ట్ వాటర్గ్రిడ్ వాటర్గ్రిడ్ కోసం అత్యంత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాజెక్టు సర్వే కోసం అంతర్జాతీయ ప్రమాణాలున్న లైడర్ (లైట్ డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్) టెక్నాలజీ వాడుతున్నారు. తేలికపాటి విమానాలతో ఏరియల్ ట్రాయాంగిలేషన్ సర్వే చేయనున్నారు. కీలకమైన పైపుల నిర్మాణం, పంపింగ్ ఎత్తు, పంపింగ్ సామర్థ్యం వంటి సాంకేతిక అంశాల్లో ఉపయోగపడే హైడ్రాలిక్ మోడలింగ్ సాప్ట్వేర్ను వాడుతున్నారు. మొత్తం ప్రాజెక్టును స్వయంగా ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే సీఎం పర్యవేక్షించేందుకు సిస్టమ్ కంట్రోల్ అండ్ డేటా యాక్సెస్ వాడనున్నారు.