తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అద్భుత విధానాలను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామీకరణకు పెద్దపీట వేస్తున్నామని, పరిశ్రమలకు కేటాయించదగిన భూములపై సర్వే కొనసాగుతున్నదని చెప్పారు. ఈ భూములపై త్వరలోనే వ్యూహాన్ని ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బుధవారం టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ సీఎం కేసీఆర్ను కలిశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకం, అందరికీ వైద్యం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.ప్రతి రంగంలోనూ సమగ్రాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. సత్వర అభివృద్ధి కోసం రూపొందించే ప్రత్యేక విధానాల్లో విశిష్ట అనుభవం కలిగిన టాటా వంటి కన్సల్టెన్సీల సలహాలను స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్లో 1700 గుర్తించిబడిన మురికివాడలున్నాయని, వాటిలో ఇండ్లు, రోడ్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ వేతనాల కలిగినవారు కూడా మెరుగైన జీవితాన్ని గడిపేందుకు కాలనీలు ఏర్పడాలన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ యూనిట్ల స్థాపపై టాటా గ్రూపు అధ్యయనం చేయాలని కోరారు.
రాష్ర్టానికి సాంకేతికతను అందిస్తాం పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనే కాకుండా చాలా విభాగాల్లో తమ గ్రూపు సంస్థలు పని చేస్తున్నాయని, అన్నింటా సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ హామీ ఇచ్చారు. అనుభవం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మేథోపరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఉచిత నిర్బంధ విద్య అమలుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు, విద్యలో నాణ్యతను పెంచే అంశాలు, బోధనా పద్ధతులు తదితర అంశాల్లో తమ దగ్గర కావాల్సినంత సమాచారం ఉందని తెలిపారు.
తెలంగాణలో తమ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి అవసరమైన సలహాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చాలన్న కేసీఆర్ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవలంభించబోయే పారిశ్రామిక విధాన డ్రాఫ్టు బాగుందని, పారిశ్రామికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. ఈ భేటిలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.