ఎలాంటి తెలంగాణను కోరుకుంటున్నారు? 2022 నాటికి కోటి ఎకరాల ఆకుపచ్చని తెలంగాణను చూడడం నా స్వప్నం. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లున్నాయి. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారమే గోదావరి నుంచి పోలవరం వద్ద సముద్రంలోకి వెళుతున్న నీరు నలభైయేండ్ల సగటు 2651 టీఎంసీలు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారమే కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజెక్టును దాటి ప్రవహిస్తున్న నీరు నలభైయేండ్ల సగటు 1204 టీఎంసీలు. ఇవిగాక ఇరు రాష్ర్టాల్లోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువుల్లో మరో 400 టీఎంసీల నీరు లభిస్తుంది. మొత్తం 4255 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో అందులో కేవలం వెయ్యి టీఎంసీల నీటితో కోటి ఎకరాల భూమిని సాగులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నది. మిగిలిన నీళ్లతో మరో మూడు కోట్ల ఎకరాలు సాగు చేసుకోవచ్చు. నదుల్లో నీళ్లు లేవని యాగీ చేయడం, లేనిపోని సమస్యలు సృష్టించడం, కేంద్రానికి, బోర్డులకు లేఖలు రాయడం దేనికోసం? సముద్రంలో కలిసినా ఫర్వాలేదుగానీ తెలంగాణ మాత్రం వాడుకోవడానికి వీల్ల్లేదన్నట్టుంది తెలుగుదేశం నాయకుల ధోరణి. అయినా వెనుకకు తగ్గం. పొరుగు రాష్ర్టాలతో తగాదా పడే ఉద్దేశం లేదు. మా హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తీ లేదు.
2018 చివరికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టుల కింద తలపెట్టిన రిజర్వాయర్లన్నీ పూర్తిచేసి నీటిని నింపాలన్నది లక్ష్యం. ఆ వెంటనే పిల్లకాలువలు నిర్మించి పొలాలకు, చెరువులకు నీరందిస్తాం. ఈ రెండు ప్రాజెక్టుల కింద తలపెట్టిన రిజర్వాయర్లు పూర్తయి, చెరువులన్నిటికీ నీరందితే వాగులు, వంకలు, చిన్నచిన్న నదులు అన్నీ పునర్జీవం పొందుతాయి. తెలంగాణ కళకళలాడుతుంది. పచ్చని పంటపొలాలతో అలరారుతుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. మరోవైపు నిజాంసాగర్, శ్రీరాంసాగర్లకు జీవంపోసి ఆదిలాబాద్, నిజామాబాద్లను, దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.
పదేపదే ఫార్మ్హౌజ్కు వెళతారన్న విమర్శపై ఏమంటారు? అవన్నీ గిట్టనివాళ్ల పిచ్చి ప్రేలాపనలు. అది ఫార్మర్స్ హౌజ్. నా ఇల్లు. అది నా నియోజకవర్గం. అక్కడ నా పొలం. అదంతా చేతగానివాళ్ల యాగీ.
నగర పరిధిలో 111 జీవోను సవరిస్తామని గతంలో చెప్పారు..
తప్పనిసరిగా ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. 111 జీవోపై త్వరలో సమీక్ష చేస్తాం.
మంత్రివర్గంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు. ఎవరిపైనా అసంతృప్తి లేదు. మంత్రులంతా బాగా పనిచేస్తున్నారు. అందరూ కష్టపడుతన్నారు. ఇప్పుడు ఎవరినీ మార్చే యోచన లేదు. అవసరమైనప్పుడు చూస్తాం.
కేంద్రం నదుల అనుసంధానం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నది. మీ అభిప్రాయం? అప్పుడోసారి ఇప్పుడోసారి ఆ ప్రస్తావన వస్తున్నది నిజమే. కానీ అనుసంధానం సాధ్యాసాధ్యాలేమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇంతవరకు తేటతెల్లం కాలేదు. అదో ఉటోపియన్ భావన.
జిల్లాల విభజన జరిగితే జోన్ల సమస్య తలెత్తుతుందా? రాష్ట్రపతి ఉత్తర్వులు అడ్డం వస్తాయా? తెలంగాణలో జోన్లు అవసరమా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. జిల్లా క్యాడర్, రాష్ట్రస్థాయి క్యాడర్ ఉంటే సరిపోతుందని ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయి. అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చిస్తాం. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉపసంహరింపజేస్తాం.
రీజినల్ రింగ్రోడ్డు ఎంతవరకు వచ్చింది? ఓఆర్ఆర్ పూర్తి కావస్తున్నది. కండ్లకోయవద్ద చిన్న ముక్క తప్ప అంతటా పని పూర్తి అవుతున్నది. త్వరలోనే 282 కిలోమీటర్ల రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు చేపడతాం. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, మహదేవ్పూర్ల మధ్య ఈ రోడ్డు నిర్మాణం చేపడతాం.
కళాశాలలపై విచారణ ఎంతవరకు వచ్చింది? విద్యాప్రమాణాలు పెరుగాలన్న ఆలోచనతోనే తనిఖీలు, విచారణలు చేయిస్తున్నాం. మన పిల్లలకు మంచి చదువులు కావాలా? వద్దా? మంచి ప్రమాణాలు కల్పిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు. ఈ విషయం కళాశాలల యాజమాన్యాలతోనే నేరుగా చెప్పాను.
ఐటీఐఆర్ ఎందుకు మూలకు పడింది? కేంద్రం నుంచి అందాల్సిన సహకారం అందడం లేదు. కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు.
మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఏదశలో ఉంది? మూసీ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టి తీరతాం. మూసీలో రోడ్డు ప్రాజెక్టును చేపట్టడంతోపాటు మూసీకి మంచి నీరు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గండిపేట, హిమాయత్సాగర్లు ప్రతిఏటా నిండితే మూసీ శుద్ధి తేలికవుతుంది. గండిపేట, హిమాయత్ సాగర్లను నింపడానికి అటు కాళేశ్వరంనుంచి ఇటు పాలమూరు ప్రాజెక్టులోని చివరి రిజర్వాయర్ లచ్చిందేవిపల్లినుంచి నీటిని తీసుకురావడానికి గల అవకాశాలను ఉపయోగించుకుంటాం. నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు నిండితే జాలు నీటితో మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుంది.

