-పరిషత్ ఎన్నికల్లో ఘనవిజయం ఖాయం
-పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని సూచన

రానున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమై జిల్లాలవారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్లతోపాటు 530కి పైగా మండల పరిషత్ల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్ను కోరిన నేపథ్యంలో వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని సూచించారు. నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేయాలని చెప్పారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతోపాటు మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా సాగుతామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ చెప్పారు.