-1,26,272 కోట్ల ప్రగతి పద్దు -పల్లె మురిసి..పట్నం మెరిసి.. -సంక్షేమ రథం.. ప్రగతి పథం.. మౌలిక సౌకర్యం -1,000 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం -రూ. 3000 కోట్లతో మహిళలకు వడ్డీలేని రుణాలు -రూ.2000 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు -రూ.1000 కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండోదశ -రూ.1450 కోట్లతో హైదరాబాద్కు సుంకిశాల నీళ్లు -రూ.3000 కోట్ల చేయూత.. ఆర్టీసీకి ఇదే తొలిసారి -రూ.3000 కోట్లతో 3 లక్షల గొర్రెల యూనిట్లు -స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం -ఎస్సీ ప్రత్యేక ప్రగతినిధి 21,306.85కోట్లు -ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి 12,304.23 కోట్లు -5,522 కోట్లతో బీసీ సంక్షేమం -ఆసరా పింఛన్లకు 11,728 కోట్లు -11,000 కోట్లతో డబుల్బెడ్రూంలు -వ్యవసాయానికి 25,000 కోట్లు -నీటి పారుదలకు 16,931 కోట్లు -పంటరుణ మాఫీకి 5,225 కోట్లు -రైతుబంధు కోసం 14,800 కోట్లు -రైతుబీమాకు రూ.1,200 కోట్లు -1500 కోట్లతో సాగు యాంత్రీకరణ -పామాయిల్ సాగుకు ప్రోత్సాహం -400 కోట్లతో సమగ్రంగా భూసర్వే -రీజినల్ రింగ్రోడ్డుకు 750 కోట్లు -వర్సిటీలు, ఠాణాల్లో షీ టాయిలెట్లు -ఆటో డ్రైవర్లకు రిస్క్ అలవెన్సులు -720 కోట్లతో గుడుల అభివృద్ధి -జంటనగరాల్లో ధూపదీప నైవేద్యం -7,500 ఆలయాలకు ప్రయోజనం -కరోనా కట్టడికి 1,178 కోట్లు -మండలాలు.. జెడ్పీలకు 500 కోట్లు కేటాయింపు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకు 5 కోట్లు -ప్రగతి పల్లెలు.. పురోగామి పట్నాలు -సాగునీటికి పెద్దపీట.. పట్టణీకరణపైనా అంతే శ్రద్ధ -సకల జన వికాసం.. దళితులకు సాధికారం -సంక్షేమ సమతుల్యం.. కేటాయింపుల్లో మానవీయం -వ్యవసాయం, విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి -రూ.2,30,825.96 కోట్లతో భారీ వార్షిక బడ్జెట్ -అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక మంత్రి హరీశ్రావు

‘ఏదీ సులభమ్ముగా సాధ్యపడదు’ అన్న దాశరథి కవితకు అక్షరాకృతిగా, మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, తెలంగాణ బడ్జెట్ రూపుకట్టింది. సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే, ప్రగతి రథాన్ని పరుగు పెట్టించింది. పల్లెను కళకళలాడిస్తూనే, పట్నానికీ కొత్త కట్నాలు పెట్టింది. పాత స్కీములను కొనసాగిస్తూనే, కొంగొత్త పథకాలను మోగించింది.
కరోనా కొట్టిన దెబ్బనుంచి తెలంగాణ తేరుకుంటున్నదని ఘనంగా చాటింది. మౌలిక వసతులను, ఆర్థిక లావాదేవీలను పెంచడం ద్వారా అటు పల్లెను, ఇటు పట్నాన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చేందుకు మూలధనాన్ని ఇంధనంగా వాడింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచే మూస ధోరణిని విడిచి పెట్టిన వార్షిక బడ్జెట్లో, ప్రజల అవసరాల మేరకే, భవిష్యత్తు ప్రాథమ్యాలే ప్రాతిపదికగానే కేటాయింపులు జరిగాయి.
మహిళలకు వడ్డీలేని రుణాలు, దళితులకు సాధికారతా సాయం, ప్రభుత్వ బడుల్లో సదుపాయాల వంటివి మొదలుకుని.. పోలీసు స్టేషన్లలో, యూనివర్సిటీల్లో పెరిగిన మహిళా ఉద్యోగుల కోసం టాయిలెట్ల నిర్మాణం దాకా.. భారీ భవిష్యత్తు పథకాల నుంచి చిన్న మానవీయ ఏర్పాటు దాకా.. బడ్జెట్ అంటే అంకెలు కాదు; మన అవసరాలు, ఆశలు! ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఆర్థికమంత్రి హరీశ్రావు తీర్చిదిద్దిన బడ్జెట్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇగురం కొద్దీ వ్యవహారం. బడ్జెట్ ప్రసంగంలో హరీశ్రావు చెప్పిన గాలిబ్ కవితలోలాగా..
ధ్యేయమును బట్టి ప్రతి పనీ దివ్యమగును!! సకల జనుల సంక్షేమం, దళిత చైతన్యం.. పల్లెలు.. పట్టణాల ప్రగతి మధ్య సంతులనం.. మౌలిక సదుపాయాల విస్తరణ లక్ష్యంగా అన్ని రంగాలను సమన్వయం చేసుకొంటూ.. రూ. 2,30,825.96 భారీ అంచనాలతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం అసెంబ్లీకి సమర్పించారు. పల్లెల్లో ప్రగతి.. వ్యవసాయాభివృద్ధితోపాటు ఈసారి బడ్జెట్లో ప్రధానంగా పట్టణ ప్రగతిపై దృష్టిసారించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయంగా నిధులు కేటాయించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేక విద్యాపథకం కోసం నాలుగువేల కోట్లను హరీశ్ ప్రతిపాదించారు. సబ్బండవర్గాల ఆకాంక్షలను, సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని, సకల జనుల సంక్షేమానికి భారీగా నిధు లు కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి రూ.73 వేల కోట్లు, సాధారణ సర్వీసులకు రూ.46,741 కోట్లు కేటాయించారు. దళితుల చైతన్యం కోసం రూ.వెయ్యి కోట్లతో కొత్తగా దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాల ప్రజల అభ్యున్నతికి నిధులు వినియోగిస్తారు. మొత్తం బడ్జెట్లో రెవెన్యూ రాబడి రూ.1,76,126.94 కోట్లు కాగా, వ్యయం రూ.1,69,383.44 కోట్లు గా ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులును రూ.6,743.50 కోట్లుగా పేర్కొన్నారు. పెట్టుబడి రాబడి (క్యాపిటల్ రిసిప్ట్స్) రూ.53,850కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటును రూ.45,509.50 కోట్లుగా ఉన్నది. వడ్డీలు పోను ప్రాథమిక ద్రవ్యలోటును రూ. 27,925.22 గా ప్రతిపాదించారు.
భారీగా పెరుగుతున్న రెవెన్యూ రాబడులు కరోనా కష్టకాలంలోనూ రెవెన్యూ రాబడులు ఇతర రాష్ర్టాల కంటే మెరుగ్గా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడి భారీగా పెరుగుతుందని బడ్జెట్లో అంచనా వేశారు. మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,76,126 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లుగా ఉంటుందన్నారు. మొత్తానికి రెవెన్యూ వ్యయం కంటే ఆదాయం రూ.6743.50 కోట్లు ఎక్కువగా ఉన్నది. ఆ మొత్తాన్ని రెవెన్యూ మిగులుగా చూపారు. ప్రపంచం మొత్తం మహా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం సొంత రాబడులను పెంచుకొని, ఆర్థికంగా నిలదొక్కుకున్నదని బడ్జెట్ ప్రతిపాదనలుచూస్తే అర్థమవుతున్నది. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా రాబడులు లేకపోయినా.. గతంలో కంటే మెరుగైన రాబడులను సాధించి దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.
ప్రత్యేక విద్యాపథకం విద్యావ్యాప్తి, కులవృత్తులకు ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేసింది. ప్రత్యేకంగా సరికొత్త విద్యాపథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ విద్యాపథకానికి రెండేండ్లకు 4 వేల కోట్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో అందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడి న విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నదన్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధి కింద రూ.21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యే క ప్రగతినిధి కింద రూ.12,304.23 కోట్లను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్లో పలు కొత్త పథకాలకు ప్రభు త్వం శ్రీకారంచుట్టింది. సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు కేటాయించా రు. వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు, డబుల్బెడ్రూం ఇండ్లకోసం రూ.11 వేల కోట్లు ప్రతిపాదించడంతోపాటు, 14,020 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. రెండోదశ మెట్రోరైల్ ప్రాజెక్టుకోసం వెయ్యికోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు ప్రతిపాదించారు. పోలీసు స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు, యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు.
15 వేల కోట్ల అదనపు ఆదాయం 2019-20తో పోలిస్తే ప్రస్తుతం (2020-21)లో రూ.15 వేల కోట్లకు పైగా ఆదాయం ఎక్కువగా వచ్చింది. 2019-20లో రూ.1,02,543 కోట్లుగా ఉన్న రెవెన్యూ రాబడులు.. ఈసారి రూ.1,17,757 కోట్లకు పెరిగాయి. కరోనా ప్రళయంలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా మారినప్పటికీ గతం కంటే ఎక్కువ రాబడులు సాధించి, తెలంగాణ సత్తా చాటింది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి బడ్జెట్ అంచనాలు రూ.1.43 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా వేయగా రూ.25 వేల కోట్ల వరకు తగ్గింది. సంక్షోభంలోనూ గతంకంటే రాబడులు పెరగడం, 4 నెలలుగా శాఖలవారీగా ఆదాయం అనూహ్యంగా పుంజుకోవడాన్ని గమనంలోకి తీసుకుని.. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం భారీగా అంచనాలను సవరించారు. పన్నులు, సుంకాలతో రూ.1,06,900 కోట్లు, పన్నేతర రాబడులు రూ. 30,557 కోట్లుగా, గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద రూ.38,669 కోట్లు సమకూరుతాయని అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.76 వేల కోట్ల రాబడి వస్తుండగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి రూ.92 వేల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. మొత్తానికి రెవెన్యూ రాబడులు రూ. 1,76,126.94 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈసారి కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటాపై ఆశలు సన్నగిల్లాయి. కేంద్రం నుంచి పన్నుల వాటా కేవలం రూ. 13,990 కోట్లే సమకూరుతాయని అంచనా వేసింది. 2019-20లో రూ.15,987 కోట్ల రాబడి రాగా 2020-21 సవరించిన అంచనాల్లో రూ.11,731 కోట్లకే పరిమితమైంది.
రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అస్పష్టంగా, గందరగోళంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అస్పష్టతలను చేధిస్తూ, ఆదాయ వ్యయాలను ఆకళింపు చేసుకుంటూ, నూతన రాష్ర్టానికి తగిన విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించింది. లక్ష్యాలను, ఆశించిన సమయంలోనే సాధిం చింది. దీని వెనుక సీఎం కేసీఆర్ నిరంతర మేథోమధనం ఉంది. – బడ్జెట్ ప్రసంగంలో హరీశ్రావు
