-నాయకులంతా భాగస్వాములు కావాలి -జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కార్యాచరణ -పార్టీ నాయకులతో సమీక్షలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -నేడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం
ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టిసారించి ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూచించారు. ఓటరు నమోదు, సవరణకు జనవరి 6వ తేదీ వరకు అవకాశం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎం శ్రీనివాస్రెడ్డి, రావుల శ్రవణ్రెడ్డి, సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక మంది తమ ఓటు గల్లంతైందని ఆందోళన వ్యక్తంచేశారని, వారందరినీ గుర్తించి ఓటుహక్కు కల్పించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో ఓటరు జాబితా ఆధారంగా ముందుకు సాగాలని చెప్పారు. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకోవడానికి అవసరమైన దరఖాస్తు ఫారాలను పార్టీ నాయకుల వద్ద అందుబాటులో ఉంచామన్నా రు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థలాలు చదును చేయించండి 30 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణానికి కేటాయిచిన స్థలాలు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుపాలని కేటీఆర్ కోరారు. అనువుగా ఉన్న చోట్ల వెంటనే చదును చేయించాలని, అనుకూలంగా లేకుంటే ప్రత్యామ్నాయ స్థలాలు వెతుకాలని పార్టీ జిల్లా ఇంచార్జులు, ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కార్యాలయాలు ఒకే మోడల్లో ఉండేలా బ్లూ ప్రింట్ తయా రు చేయిస్తున్నామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపైనా కేటీఆర్ సమీక్షించారు. కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపుకార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులను ఆదేశించారు. సభ్యత్వ నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తి వివరాల నమోదుపై సమగ్ర కార్యాచరణ ఖరారు చేయాలని సూచించారు.
నేడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ కార్యాలయాల నిర్మాణం, ఓటరు నమోదు తదితర అంశాలపై చర్చించనున్నారు.
కేటీఆర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కలిశారు. కేటీఆర్ను కలిసినవారిలో మాజీ ఎంపీ జీ వివేక్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్రెడ్డి, బాల్క సుమన్, శ్రీనివాస్గౌడ్, బాజిరెడ్డి గోవర్ధన్, పువ్వాడ అజయ్, ప్రకాశ్గౌడ్, సోయం బాపూరావు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, సోమారపు సత్యనారాయణ, తక్కళ్లపల్లి రవీందర్రావు, పూల్ సింగ్ తదితరులు ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చి కేటీఆర్కు వినతిపత్రాలు అందజేశారు.
రూ.5 లక్షల విరాళం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. గురువారం చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు. మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, నేవూరి ధర్మేందర్రెడ్డి, సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

