-ఏ సర్వేలైనా ఇదేమాట చెప్తున్నాయి -గజ్వేల్లో 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలో చేశాం -కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి చెరువు, కుంటను నింపుతాం -సిద్దిపేట, గజ్వేల్ ఎన్నికల ప్రచారసభల్లో మంత్రి హరీశ్రావు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని, ఏ సర్వేలైనా ఇదేమాట చెప్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఢిల్లీకి, టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని, మోసం చేయడానికి ఒకటై వస్తున్న మహాకూటమికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గజ్వేల్లో 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలో చేసి చూపామని చెప్పారు. ఆదివారం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని 20, 30 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. మున్నూరు కాపు, త్రివీలర్స్ మోటరు అసోసియేషన్, పట్కరి, ఏకలవ్య సంఘాలు, గజ్వేల్లో పద్మశాలీ, ఆర్యవైశ్య, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతే రాజుగా పాలన సాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నారని చెప్పారు. వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువును, కుంటను నింపుతామని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల కరంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మన పథకాలను ఇతర రాష్ర్టాలవారు ఆదర్శంగా తీసుకొని వారి రాష్ర్టాల్లో అమలుచేశారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరంట్ కష్టాలు మళ్లీ వస్తాయన్నారు. ఇప్పుడున్న పథకాలన్నింటినీ రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ను, మహాకూటమిని పొలిమేర దాటేదాకా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుబాంధవుడైన సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
గజ్వేల్ సంగాపూర్.. సింగపూర్గా మారింది గజ్వేల్లో 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలోనే చేసి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా సంగాపూర్లో ఎడ్యుకేషన్ హబ్ను ఏర్పాటుచేశామని చెప్పారు. సంగాపూర్ కాస్త సింగపూర్ అయిందన్న ఆనందం ఇక్కడి ప్రజల్లో కనిపిస్తున్నదన్నారు. మంచినీళ్ల గోసను తీర్చామని చెప్పారు. గజ్వేల్కు ఔటర్ రింగు రోడ్డు వచ్చిందని, త్వరలోనే రైలు కూడా రానుందని అన్నారు. ఈ ప్రాంతానికి పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తామని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చే పైసల కోసం కాంగ్రెసోళ్లు మళ్లీ బాబును తెలంగాణకు తెస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

