– చంద్రబాబు బలమెంతో తేలిపోవాలి – బీజేపీకి ఓటెందుకేయాలి..? బాబు ఆడించినట్టల్లా ఆడుతున్నందుకా? – రైతుల బాధలను కాంగ్రెస్ నేతలెప్పుడైనా పట్టించుకున్నారా? – ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్రావు
ఆంధ్రా సీఎం చంద్రబాబు ఆడించినట్టల్లా ఆడుతూ తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్న బీజేపీకి మెదక్ ఉపఎన్నికల్లో ఓటర్లు దిమ్మదిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. చంద్రబాబు అడుగగానే హైదరాబాద్పై ఆంక్షలు విధించి, తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన కేంద్ర ప్రభుత్వం, లోయర్ సీలేరు ప్రాజెక్టు నుంచి తెలంగాణకు రావాల్సిన 450 మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించినా మౌనంగా ఉందని విమర్శించారు.
ఉక్కు మనిషి అద్వానీని పార్టీ నుంచి బయటకు పంపి, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చిన బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మెదక్ ఉప ఎన్నిక తీర్పు ఢిల్లీ దిమ్మ దిరిగేలా వుండాలని, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికతో తెలంగాణలో చంద్రబాబు బలమెంతో తెలిసిపోవాలని, అప్పుడు కేంద్రం కండ్లు తెరిచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను ఇస్తుందన్నారు. మెదక్ జిల్లా నంగునూరులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేండ్లు తెలంగాణలో వడగండ్లవానలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ఒక్కపైసా ఇవ్వకుండా సీమాంధ్రలో నీలం తుఫాన్ బాధితులకు సీమాంధ్ర సర్కారు అడిగినన్ని నిధులిస్తుంటే నోరు మెదపని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాపై విమర్శలు చేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రైతలు వెతలను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే రైతులకు నాలుగు సంవత్సరాల ఇన్పుట్ సబ్సిడీని రూ.480 కోట్లు విడుదల చేశారని తెలిపారు. సిద్దిపేటకు తాగునీటి కోసం రూ.150 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపితే, కిరణ్కుమార్రెడ్డితో ఒత్తిడి చేయించి ఆ పథకాన్ని ఆపిన జగ్గారెడ్డికి ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు.
ప్రజల నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన జగ్గారెడ్డి, సంగారెడ్డిని బీదర్లో కలుపాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధిని విస్మరించిందన్న కాంగ్రెస్ నేతలు జీవన్రెడ్డి, శ్రీధర్బాబు విమర్శలను హరీశ్రావు తిప్పికొట్టారు. మూడు నెలల పాలనలో ఏం చేశారని విమర్శిస్తారా..! మా ప్రభుత్వం రాగానే మా రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశారు. నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి రాజయ్య రూ.8.2 కోట్లు విడుదల చేశారు. లిప్టు ఇరిగేషన్కు రూ.8 కోట్లు మంజూరయ్యాయి అని చెప్పారు. దసరా పండుగ నుంచి వృద్ధులకు నెలకు రూ.1000 ఫించన్ అందుతుందని హామీ ఇచ్చారు.
ఉప ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి చరిత్రను సృష్టించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఛాగండ్ల నరేంద్రనాథ్, కర్ర శ్రీహరి, జాప శ్రీకాంత్రెడ్డి, రాగుల సారయ్య, దువ్వల మల్లయ్య, వేముల వెంకట్రెడ్డి, కోల రమేశ్గౌడ్, ఎడ్ల సోంరెడ్డి, సంగు పురంధర్, బద్దిపడగ కిష్టారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. లతో కలిసి హరీశ్రావు మాట్లాడారు.

