-ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు లక్ష్యం -ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రులు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు -20 కల్లా పూర్తిచేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం -పర్యవేక్షిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చివరి అంకానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. పూర్తయిన సభ్యత్వాల డిజిటలైజేషన్ కొత్త జిల్లా కేంద్రాల్లో సమాంతరంగా జరుగుతున్నది. ఈ నెల 20 కల్లా సభ్యత్వాల ప్రక్రియను పూర్తిచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నమోదులో పాల్గొంటున్నారు. సభ్యత్వాల నమోదు అనంతరం పార్టీ గ్రామ, మండల కమిటీలను వేయనున్నారు. జూన్ 27న తెలంగాణభవన్లో పార్టీ సభ్యత్వ నమోదును పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేల సభ్యత్వా లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యం దాదాపుగా పూర్తికావొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం కూడా దాటింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మ న్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
మున్సిపాలిటీల్లో సభ్యత్వాలపై ప్రత్యేక దృష్టి ఈ నెల 20కల్లా సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలికాన్ఫరెన్స్లో పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నందున మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. కాలనీ అసోసియేషన్ల సభ్యులు పార్టీ సభ్యులుగా చేరేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ఒకటి రెండు నియోజకవర్గాలకు ఒకరి చొప్పున ఇంచార్జీలను నియమించారు. వారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేతలను సమన్వయంచేస్తూ సభ్యత్వాలు ఉత్సాహంగా జరిగేలా కృషిచేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ నేతృత్వంలో బృందం పనిచేస్తుండగా.. ప్రతి కొత్త జిలా ్లకేంద్రానికి బాధ్యులను నియమించారు.

