-జాతీయ సంఘాల నుంచి భారీగా వలసలు
-సింహం సింగిల్గా వస్తుంది.. ఎన్ని సంఘాలు కూటమి కట్టినా
-సింగరేణిలో గెలుపు టీబీజీకేఎస్దే.. వారసత్వ ఉద్యోగాలు కల్పించేది కేసీఆరే
-టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కే కవిత.. గులాబీ సంఘంలో చేరిన ఎస్టీ కార్మికనేతలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మద్దతు గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఇఫ్టు తదితర సంఘాలతోపాటు వివిధ ఇతర సంఘాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీబీజీకేఎస్లో చేరుతున్నారు. దాదాపు 20, 30 ఏండ్లుగా ఆయా సంఘాల్లో కార్యకర్తలు, నాయకులుగా ఉన్నవారు సైతం వస్తుండటం గమనార్హం. బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి తదితర ప్రాంతాల్లో జాతీయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో టీబీజీకేఎస్లో చేరుతున్నారు. కొత్తగూడెం, భూపాలపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో నిత్యం చేరికలు జరుగుతున్నాయి. సింగరేణి ఎస్టీ కార్మికుల సంఘం నాయకులు శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో గులాబీ సంఘంలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించే సత్తా, అవకాశం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే ఉన్నాయని చెప్పారు.
టీబీజీకేఎస్లో చేరిన ఏఐటీయూసీ సీనియర్ నేత శ్రీనివాస్
సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5షాఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు దుర్గారాశి శ్రీనివాస్ శనివారం టీబీజీకేఎస్లో చేరారు. స్థానిక చుంచుపల్లిలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఆయనకు కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. గత 36ఏండ్లు గా ఏఐటీయూసీలో ప్రముఖ పాత్ర పోషించిన తాను.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను చూసి, కార్మికులకు మరిన్ని సేవలు అందించడానికి టీబీజీకేఎస్లో చేరినట్లు దుర్గారాశి శ్రీనివాస్ తెలిపారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాం బాబుయాదవ్, టీబీజీకేఎస్ నేతలు కూసన వీరభద్రం, టీ శరభలింగం, డాక్టర్ శంకర్నాయక్, గోపాలరావు, కొదమసింహం పాండురంగాచార్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెం ఏరియాలో 700 మంది చేరిక కొత్తగూడెంలో శనివారం సుమారు 700 మంది కార్మికులు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు. 5షాఫ్ట్ బొగ్గుగనిలో ఓవర్మెన్లు నరేశ్, నాగార్జున, రామకృష్ణ ఆధ్వర్యంలో బదిలీ ఫిల్లర్లు 70 మంది, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలు 30 మంది, ఏ-రిలే, సీ-రిలే నుంచి కోల్ కోల్కట్టర్స్, జనరల్ మజ్దూర్లు, టింబర్మెన్లు, జీకేవోసీలో టెక్నీషియన్లు, ఫోర్మెన్లు, ఆపరేటర్లు 20 మంది, రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో సుమారు 200 మంది సమావేశాలకు హాజరై టీబీజీకేఎస్కు మద్దతు ప్రకటించారు. వీకే7షాఫ్ట్ బొగ్గుగనిలో సుమారు 484 మంది టీబీజీకేఎస్లో చేరారు.
మంచిర్యాలలో.. మంచిర్యాల జిల్లాకేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఇఫ్టూ నేతలు ఎం సమ్మిరెడ్డి, కే వెంకటేశం, ఎన్ శ్రీనివాస్రెడ్డి, ఎం రాజేశం, బీ వెంకటేశం, కే అశోక్, సీహెచ్ సారంగపాణి, వీ అజయ్కుమార్, ఎం సత్యనారాయణరెడ్డి సహా సుమారు 45 మంది ముఖ్యనేతలు, కార్యకర్తలు ఎంపీ బాల్క సుమన్ సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 గనిలోని మైనింగ్స్టాఫ్, జేఎంఈటీలు, ఎస్డీఎల్ ఆపరేటర్లు, ట్రామర్లుసహా నాయకులు, కార్యకర్తలు 200మంది ఎంపీ సుమన్, అధ్యక్షుడు వెంకట్రావ్ సమక్షంలో చేరారు. తాండూర్లోని మాదారం డిస్పెన్సరీ సిబ్బంది, సివిల్ కార్యాలయ సిబ్బంది 27మంది, ఏఐటీయూసీ సీనియర్ నేత గంజి శంకర్ తదితరులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టీబీజీకేఎస్ చేరారు.
బెల్లంపల్లి ఏఐటీయూసీ నుంచి ఇప్పటికే ముఖ్య నేతలు ఎం రామారావు, ఎంపీ వెంకటేశం, సంపత్రావు తదితరులు చేరగా తాజాగా సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ నుంచి వేణుచంద్రకుమార్, హెచ్ఎంఎస్ నుంచి మాసాడి నారాయణ, డోర్లీ 1 పిట్ సెక్రటరీ, ఏఐటీయూసీ నేత నర్సింగం, కైరిగూడ పిట్ సెక్రటరీ, ఏఐటీయూసీ నేత తిరుపతి, బెల్లంపల్లి ఎక్స్ప్లోరేషన్ విభాగం, దవాఖాన నుంచి సైతం చేరికలు జరిగాయి. శ్రీరాంపూర్లో ఆర్కే 6 గని నుంచి మూడు రోజుల్లో దాదాపు 350 మంది వివిధ సంఘాల నుంచి టీబీజీకేఎస్లో చేరారు. ఆర్ 7 గని నుంచి 175 మంది చేరారు. కొత్తగూడెం ఏరియా బ్రాంచి ఏఐటీయూసీ కార్యదర్శి కూసన వీరభద్రం టీబీజీకేఎస్లోకి రావడంతో గులాబీ సంఘం మరింత బలోపేతమైంది. శ్రీరాంపూర్ ఏరియా ఏఐటీయూసీ మాజీ ఉపాధ్యక్షుడు, హెడ్ ఓవర్మెన్ యోహాన్, సెంట్రల్ మైనింగ్ స్టాఫ్ ఇంచార్జి కాసిపేట శంకరయ్య, ఏఐటీయూసీ నేత శ్రీనివాస్ తదితరులు ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో శుక్రవారం టీబీజీకేఎస్లో చేరారు. టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు బ్రహ్మచారి మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ సంఘంలో చేరారు. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ నేతలు విప్ నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో టీబీజీకేఎస్లో చేరారు.
సోమారపు ఆధ్వర్యంలో
ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 ఓల్డ్సైట్ ఆఫీస్ ఆవరణలో, జీడీకే-7 ఎల్ఈపీ గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన గేట్ మీటింగుల్లో రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, నారదాసు లక్ష్మణరావు సమక్షంలో పలువురు కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. ఏపీఏ డివిజన్లోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో వందమంది టీబీజీకేఎస్లోకి చేరారు.
తుమ్మల సమక్షంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో టీబీజీకేఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీలకు చెందిన 20మంది టీబీజీకేఎస్లో చేరారు.
వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించేది కేసీఆరే: కవిత సింగరేణి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న జాతీయ సంఘాలది కార్మిక కూటమి కాదని, రాజకీయ కూటమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుని ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సంఘాన్ని ఒక్కరుగా ఎదుర్కొలేమనే ఉద్దేశంతోనే సిద్ధాతాలకు భిన్నంగా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. సింహం సింగిల్గానే వస్తుందని, వారెందరు కూటమిగా ఏర్పడినా టీబీజీకేఎస్దే మరోసారి గెలుపని కవిత ధీమా వ్యక్తంచేశారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సింగరేణి గిరిజన కార్మికుల సంఘం నాయకులు కవిత సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించేది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనేని స్పష్టంచేశారు. దీనిని అచరణలో ఏ విధంగా అమలుచేయాలనే దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారని తెలిపారు. కొద్దిగా అలస్యమైనా, అమలుచేసే చిత్తశుద్ది, అవకాశం, పట్టుదల ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని కవిత చెప్పారు.
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన ఏఐటీయూసీ ఇప్పుడు వారసత్వ ఉద్యోగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవాచేశారు. వేజ్ బోర్డులో సభ్యత్వం ఉన్న ఏఐటీయూసీ వేతనాలను 50 శాతం ప్రకటించే విధంగా కృషి చేస్తామని చెప్పి 20శాతానికే ఎందుకు ఒప్పుకున్నదని ప్రశ్నించారు. ఆ సంఘంలో త్యాగాలు చేసే నాయకులు గతంలో ఉండేవారని, ప్రస్తుతం భోగాలు అనుభవించే నాయకత్వమే ఉందని విమర్శించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గిరిజనుల కోసం బ్యాక్ ల్యాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఎంపీ కవిత ఎంతగానో కృషి చేశారన్నారు. బొగ్గుగని ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంతులు నాయక్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కోరారు. అంబేద్కర్, సేవాలాల్ జయ ంతి, తీజ్ ఉత్సవాల నిర్వహణకు సింగరేణి నుంచి నిధులు కేటాయించాలని విన్నవించారు. గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల కోసం ఐదేండ్లుగా పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటి భర్తీకి మోక్షం కలిగిందన్నారు. టీబీజీకేఎస్ నాయకుడు కనకరాజు మాట్లాడుతూ బొగ్గు గనుల్లో పనిచేయడానికి మొదట గిరిజనులే ముందుకు వచ్చారన్నారు. టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ పండుగ అడ్వాన్స్ను పెద్ద ఎత్తున పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
టీబీజీకేఎస్లో చేరిన నేతలు వీరే సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారావత్ పంతులు నాయక్, ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వర్రావు, బాదావత్ శంకర్నాయక్, పాయం నర్సింగరావు, రాంబాబు, కృష్ణానాయక్, కే సత్యనారాయణ, హరిలాల్, భీముడు నాయక్, వెంకటేశ్వర్లు, మోతీలాల్, బాబూనాయక్, గోపాల్నాయక్, కిరణ్, కిషన్, చందర్నాయక్, తారాచంద్ నాయక్, వినాయక్లతోపాటు సింగరేణిలోని 11 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన గిరిజన కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు.
సింగరేణి భవన్లో ఎమ్మెల్యే జలగం ప్రచారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సింగరేణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేట్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న సింగరేణిభవన్ ఉద్యోగులను కలిసి టీబీజీకేఎస్కు ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సింగరేణి దేశంలో నంబర్వన్ సంస్థగా ఆవిర్భవించిందని, అందుకే యావత్ సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్కు మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

