-ఎన్నికల్లో ఆగం కావొద్దు.. అన్నీ వినిచర్చించాలె -103 నుంచి 108 సీట్లు మనయేనని తాజా సర్వే చెప్తున్నది -చంద్రబాబును, కాంగ్రెసోళ్లను కాగ్నా నదిలో కలపాలె.. -2004లో తెలంగాణ ఇస్తే వాళ్ల గౌరవం దక్కేది -తాండూరు ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ -గత ప్రభుత్వాలు ప్రజల సొమ్ము దోచుకున్నయి -అవినీతిని బంద్పెట్టి.. సంక్షేమం పెంచినం
గత ప్రభుత్వాలు అవినీతితో ప్రజల సొమ్ము దోచుకుంటే.. తాము ప్రభుత్వంలో అవినీతిని బంద్చేసి.. సంపద పెంచామని, పెంచిన సంపదను అనేక సం క్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రభు త్వం మానవీయ కోణంలో పథకాలు అమలుచేసి, సాధించిన ఫలితాలన్నీ మీ కండ్లముందే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికలు కేవలం పార్టీలు, అభ్యర్థుల గెలుపుకోసం కాదు.. తెలంగాణ రాష్ర్టానికి చాలా ప్రధానమైన ఘట్టం ఈ ఎన్నిక. ఎలక్షన్ వస్తే ఆగం ఆగం కావొద్దు. అన్ని పార్టీలు చెప్పేమాటలు వినాలి. తర్వాత మీ గ్రామాలకు వెళ్లి చర్చపెట్టాలి. నిజానిజాలు తేల్చాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలువాలి. తదనంతర పరిపాలనలో ప్రజలు కోరుకున్నది జరుగాలి.
అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పారు. నిన్న మొత్తం తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలపై మంచేంది.. చెడ్డేందని సమీక్ష చేసిన. నిన్ననే నా చేతికో సర్వే రిపోర్టు వచ్చింది. ఇయాల లేటెస్ట్ సర్వే చెప్తున్నది.. టీఆర్ఎస్ ఈ రాష్ట్రం లో 103 నుంచి 108 సీట్లు గెలుచుకునే పరిస్థితి.. రోజుకింత పెరుగుతున్నది అని వెల్లడించారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ ప్రజాఆశీర్వాదసభలో సీఎం మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
తాండూరులో శాస్త్రీయ పద్ధతుల్లో స్టోన్కటింగ్ ఇండస్ట్రీ పెద్దఎత్తున స్టోన్కటింగ్ ఇండస్ట్రీ ఉన్నది. షాబాద్ బండలకు చాలా ప్రసిద్ధి తాండూరు. తెలంగాణలో ఎక్కడైనా ఇల్లు కడుతున్నపుడు తాండూరు బండలు ఏయించినం అని చెప్తరు. అంత ఫేమస్. అయితే ఇక్కడ ఇం డస్ట్రీ సైంటిఫిక్ పద్ధతుల్లో లేదు. ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్న.. తాండూరు స్టోన్కటింగ్ ఇండస్ట్రీని సైంటిఫిక్ పద్ధతుల్లో బ్రహ్మాండంగా పెడుతం. ఈ ఇండస్ట్రీకి కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఆలోచనచేస్తం.
భిక్షాటన చేసి చేనేత కార్మికులకు పైసలిచ్చిన సమైక్యరాష్ట్రంలో పద్మశాలీ కార్మికులు, చేనేత కార్మికులు ఒక్కోరోజు ఏడుగురేడుగురు, పదిపదిమంది చనిపోయేవాళ్లు. పోచంపల్లి గ్రామంలో నేనే పోయి ఏడ్చిన! ఆ రోజు చంద్రబాబు సీఎంగా ఉంటే.. అయ్యా ఒక యాభై వేలు వీళ్లకు మాఫీ చేయమంటే చేయలె. నేను భిక్షాటన చేసి, మూడున్నర లక్షలు పోగుచేసి, స్వయంగా పోయి ఇంటికో యాభై వేలు ఇచ్చి వాళ్ల కుటుంబాలు నిలబెట్టిన. ఆయాల గోల్డ్ ఆభరణాలు కంసాలివారు చేసిచ్చేవాళ్లు.. మొత్తం జువెలరీ షాపులు వచ్చినంక వాళ్ల వృత్తి పోయినాది. పట్టించుకునేవాళ్లు లేరు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నిలబెట్టినం. నేను చెప్పే చేపపిల్లలు మీరు ఊరు చెర్లకూడా పోస్తున్నరు. నేను చెప్పే గొర్రెలు మీ ఊళ్లే కూడా వచ్చినయ్. కరంటు మీ ఊళ్లే కూడా వస్తుంది. రైతుబంధు కూడా వచ్చింది. కల్యాణలక్ష్మి చెక్కులొస్తున్నయ్. మహిళలు ప్రసవానికిపోతే ఇచ్చే కేసీఆర్ కిట్టు మీ ఊళ్లే కూడా వచ్చింది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిలగాడు పుడితే రూ.12 వేలు ఇస్తున్నం. అమ్మ ఒడి వాహనాలు పెట్టి దానిలో తీసుకునిపోయి, మళ్ల వాళ్లను ఇంటికాడ దించుతున్నం. ఈ రకంగా అన్నీ చేయిస్తా ఉన్నం. ఈ సంక్షేమం మరింత పెరగాలె.
చంద్రబాబును, కాంగ్రెసోళ్లను కాగ్నా నదిలో కలపాలె.. మన రాష్ట్రం మనకొచ్చినంక.. ఇప్పుడు కూడా మన రాష్ట్రం మీద చంద్రబాబు పెత్తనం అవసరమా? చంద్రబాబు మనకు తెల్వని మనిషా! పాలమూరు ఎత్తిపోతల పథకం తప్పుడు ప్రాజెక్టు అని చెప్పి దానిపై 35 కేసులు పెట్టినాడు. ఆ చంద్రబాబును ఇయాల కాంగ్రెస్ భుజాలమీద పెట్టుకుని తోలుకొస్తున్నది. వ్యవసాయానికి నీళ్లు రావాలంటే ఏం చేయాలె? చంద్రబాబును, వాన్ని మోసుకొచ్చేటోళ్లను ఇద్దరినీ కలిపి కాగ్నా నదిలో కలపాలె. వాళ్లను ఓటుతోని కొట్టాలె దెబ్బ. మన రాజకీయ చైతన్యాన్ని, మన తెలివిని చూపెట్టేకాడ చూపెట్టాలె.
స్టోన్ ఇండస్ట్రీ పార్కు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇచ్చే బాధ్యత నాది.. మహేందర్రెడ్డి క్రియాశీల కార్యకర్త, ధైర్యంగా పనిజేస్తరు. కొత్తపార్టీ అయినప్పటికీ అంతటా మంచిగ దాని గరిమను కాపాడారు. ఆయన నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా కూడా ముందుకు పోతాఉన్నది. మహేందర్రెడ్డిని గెలిపించండి. మాకు ఇక్కడ మెడికల్ కాలేజీ, నర్సింగ్కాలేజీ కావాలని ఆయన కోరినాడు. వచ్చే ప్రభుత్వంలో ఆరునెలలు అటూఇటూగా చేస్తం. స్టోన్ ఇండస్ట్రీ తాండూరుకు కావాల్సిందే. మహేందర్రెడ్డిని అదేస్థాయిలో కొనసాగుతరు. బ్రహ్మాండంగా తాండూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను అభివృద్ధి చేసుకుందం. ఇండియాల్నే తాండూరు కందిపప్పు ఫేమస్. కందిపంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్పరంగా ఇంకా సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
2004లో తెలంగాణ ఇస్తే వాళ్ల గౌరవం దక్కేది తెలంగాణ ఏర్పడినంక సోనియాగాంధీ రాష్ర్టానికి మొదటిసారి వచ్చారా? పోయినతాప ఇదే జిల్లాకు వచ్చే కదా! 2014 ఎన్నికల్లో కరీంనగర్ వచ్చారు. ఇదే జిల్లాలో చేవెళ్లకు వచ్చారు. ఈడనుంచి మెదక్ జిల్లాలోని ఆందోల్కు వెళ్లారు. ఆమె వచ్చిన పాపానికి వికారాబాద్లో అప్పుడు నా సభ రద్దయింది. కానీ ఆమె మొదటిసారి తెలంగాణకు వచ్చిందని చెప్తరు! అదే రాహుల్గాంధీ ఐదారుసార్లు వచ్చి.. మేం రెండు లక్షల రుణమాఫీ చేస్తమని చెప్పారు.. ఎవరూ నమ్మలే. తెలంగాణ కాంగ్రెస్కుగానీ, సోనియాకుగానీ, రాహుల్గాంధీకి గానీ ఒక్కటే చెప్తున్న. మీరు 2004లో మాతో పొత్తుపెట్టుకుని గెలిచినప్పుడు.. తెల్లారో, మర్నాడో, నాలుగు నెలలకో ఇమాన్దారీగా తెలంగాణ ఇచ్చి ఉంటే మీ గౌరవం దక్కేది. కానీ మీరు ఎగపెట్టిండ్లు. 14 ఏండ్లు మళ్లా మేం పట్టుకుని ఏడిస్తే.. చివరికి నేను ఆమరణ నిరాహార దీక్షకు దిగితే.. దిక్కులేక, గతిలేక ఇచ్చిండ్లు తప్ప.. ప్రేమతో ఇయ్యలే. అందుకే 2014లో ప్రజలు మిమ్ముల ఓడించారు. మిమ్ముల నమ్మలె. ఎవరు నిజంగా కొట్టాడిండ్లు అనేది ప్రజలు గమనించి మాకు అధికారం ఇచ్చారు.
పెద్ద రాష్ర్టాలు కూడా మన దరిదాపుల్లో లేవు గతంలో లకిడీకాపూల్లో పైరవీకారుల మందలుండేవి. ఇప్పుడు తుపాకీతో కొడుదామన్న ఎవరూ కనిపిస్తలేరు. పారదర్శక పాలనతో రాష్ర్టానికి పెట్టుబడులు పెరుగుతున్నయి. నేను ఊహించినదానికంటే ఎక్కువ సంపద పెరుగుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులాంటి పెద్ద రాష్ర్టాలు కూడా మన దరిదాపుల్లోలేవు. నాలుగేండ్లలో రాష్ట్ర ఆదాయం 17.17% ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 19.73% ఉంది. తెలంగాణ రాకముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద ఆదాయం రూ.9.56 కోట్లు. నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనలో వచ్చింది రూ.2057కోట్లు. కచ్చితంగా పరిపాలిస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తయి.

