-మధ్యమానేరు నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తాం -అర్హులకు అన్యాయం జరుగనివ్వం -వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో గెలుస్తాం: మంత్రి ఈటల ధీమా
బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. విద్య, వైద్యానికి కూడా అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం ఆర్థికవ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్ర బడ్జెట్ మాత్రం ఆశాజనకంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. గతంలో అధికారులను దళారులు మచ్చికచేసుకొని నిర్వాసితులకు అన్యాయం చేశారన్నారు. బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల మండలాల్లో 12 గ్రామాల్లో నిజమైన లబ్ధిదారులు, నిర్వాసితులు మోసగాళ్ల బారినపడి నష్టపోయారన్నారు. ఇండ్లు, పొలాలతోపాటు సర్వం కోల్పోతున్నవారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వందలకోట్ల రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదు.. నిజమైన పేదలకు అన్యాయం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షాకాలం నాటికి జలాశయంలో నీటిని నిల్వచేసేలా పనులను వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే పలుమార్లు నిర్వాసితులపై జిల్లా ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్సింగ్ పాల్గొన్నారు.

