Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రెండు కండ్లు ఒకే చూపు

తెలంగాణ ముద్దుబిడ్డలు పీవీ, కేసీఆర్‌

తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యాలు, నిర్వహించిన పదవులు వేరైనా ఇరువురి ఆలోచనల్లో, కార్యాచరణలో సారూప్యం ఉన్నది. ఇరువురి ఆకాంక్ష పేదల కన్నీరు తుడవడమే. వివిధ సందర్భాలలో ప్రధానిగా పీవీ ప్రసంగాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఆచరణ గమనిస్తే, భావసారూప్యం ఎంతగా ఉందో తెలిసిపోతుంది.

పీవీ ప్రధాని పదవి చేపట్టే నాటికి దేశ ఆర్థిక పరిస్థితి అధోగతిలో ఉన్నది. ఏ మాత్రం ఆలస్యమైనా విదేశీ మారక ద్రవ్యం తరిగిపోయి, పెట్రోలు మొదలైన దిగుమతులు నిలిచి పోయి దేశమంతా అల్లకల్లోలమయ్యేది.

పీవీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సాహసోపేత నిర్ణయాలతో దేశ పరిస్థితిని మార్చివేశారు. ఆర్థిక రంగంలో మౌలికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరువడంతో, దేశం పారిశ్రామికంగా అభివృద్ధిబాటలో పరుగులు తీసింది. సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు వచ్చాయి. పీవీ వేసిన పునాదులపైనే ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మనదేశం మారబోతున్నది.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆరు దశాబ్దాల పరాయిపాలనలో తెలంగాణ అల్లకల్లోలమై ఉన్నది. పల్లెల్లో పల్లేరులు మొలిచాయి. ఇనుప బూట్ల శబ్దాల మధ్య బితుకుబితుకుమంటూ బతికిన రోజులవి. బతకలేక బొంబాయి, దుబాయి పారిపోయిన రోజులవి.

తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్‌ తెలంగాణ సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చివేశారు. పచ్చని, ప్రశాంత తెలంగాణను సృష్టించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలతో లక్షల కోట్ల రూపాయలు పల్లెల్లోకి ప్రవహింప చేశారు. అత్యుత్తమ వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ విధానాలతో తెలంగాణ దేశానికే తలమానికంగా మారింది.

భూమి రికార్డులను సక్రమంగా నిర్వహించడానికి, గ్రామీణ ప్రాంతంలో శాంతికి సంబంధం ఉంటుంది. భూమి వివాదాలు తరచుగా హింసాయుతంగా మారుతాయి. అవి కుల తగాదాలుగా పరిణమిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో గొడవలను పరిశీలిస్తే, భూమి రికార్డులను సక్రమంగా నిర్వహించక పోవడమే మూల కారణమని బయటపడుతుంది. భూమి రికార్డులను చక్కగా నిర్వహిస్తే, ప్రజలు తమ యాజమాన్యం, ఆస్తి హక్కుల గురించి తెలుసుకోగలుగుతారు. దీని గురించి అనేక సార్లు చర్చించాం. కానీ దేశంలో ఈ దిశలో సరైన కృషి జరగలేదు.

(1991 అక్టోబర్‌ 4న ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని పీవీ ప్రారంభోపన్యాసం)

మన దేశంలోని గ్రామాలలో ఎంతో మంది వృత్తి నిపుణులు ఉన్నారు. వారు నైపుణ్యంలో ఎవరికీ తీసిపోరు. కానీ వారి దగ్గర ఉండే ఉపకరణాలు కాలం చెల్లినవి. దేశంలో ఐదున్నర లక్షల గ్రామాలున్నాయి. అంటే ఎంత మంది వృత్తి నిపుణులు ఉన్నారో ఊహించుకోవచ్చు. వీరికి తగిన ఉపకరణాలు ఇచ్చి వారి నైపుణ్యాన్ని వినియోగంలోకి తేవాలి.

(1991 ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగం)

గ్రామాలలోని పరిస్థితి పట్ల మహాత్మాగాంధీ ఎంతో విచారం వెలిబుచ్చారు. గ్రామీణులకు జీవనోపాధి గ్రామాలలోనే లభించాలని గాంధీజీ అన్నారు. గ్రామీణుడు తన గ్రామంలోనే పనిచేసుకొని సంపాదించుకోగలిగితే, గ్రామాల నుంచి పేదరికం మాయమైపోతుంది.

(1991 అక్టోబర్‌ 2న ‘విశ్వ’ ప్రాజెక్టు చేపట్టిన సందర్భంగా పీవీ ప్రసంగం)

భూ రికార్డుల ప్రక్షాళన
భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, ఎంత ప్రయాస పడ్డారో తెలిసిందే. భూ రికార్డుల ప్రక్షాళన అంటే తేనె తుట్టెను కదపడమేనని, సాధ్యం కాని వ్యవహారమని విమర్శలు వచ్చాయి. అయినా కేసీఆర్‌ సాహసంతో, దృఢ నిశ్చయంతో ప్రక్షాళన కొనసాగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన, ఆచరణ కూడా సరిగ్గా ఇదే. తెలంగాణ అవతరణ తరువాత వృత్తినిపుణులను ప్రోత్సహించడానికి, ఉపకరణాలు అందించడానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, నిపుణులు అంటే సాఫ్ట్‌వేర్‌ వంటి పనులు చేసే చదువుకున్నవారు మాత్రమే అనుకోవడం పొరపాటు అవగాహన అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామీణ వృత్తుల వారు కూడా ఆయా రంగాల్లో నిపుణులే. వారి నైపుణ్యాలను ఉత్పత్తిదాయకంగా మారిస్తే, గ్రామాలు సుసంపన్నం అవుతాయని, అదే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామీణ వృత్తుల వారికి భారీ ఎత్తున ప్రోత్సాహమిచ్చారు. గొర్రెలు, బర్రెలు అందించారు. చెరువులను చేపలతో నింపి మత్స్యకారులకు ఉపాధి కల్పించారు. మహాత్మాగాంధీ, పీవీ అశయాలకు కేసీఆర్‌ ఆచరణ రూపం ఇచ్చారు.

——— వ్యవసాయం———
‘వ్యవసాయంపై ప్రభుత్వం పూర్తి దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని సుస్థిరపరచాలి. బహుముఖ అభివృద్ధికి అనువైన పరిస్థితులను సృష్టించాలి. నీటిపారుదలను విస్తరించడం, బీడు భూములను సాగులోకి తేవడంపై ప్రత్యేకమైన ఆసక్తిని ప్రదర్శిస్తాం. విస్తరణ సేవలను పటిష్ఠం చేయడంతోపాటు, ఆధునిక సాంకేతికతను రైతుల ముంగిటిలోకి తీసుకువస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం… మన రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి.

(1991 జూన్‌ 22న ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా పీవీ ప్రసంగం నుంచి.. )

వ్యవసాయ రంగంలో కేసీఆర్‌ చేపడుతున్న చర్యలు నాటి పీవీ ప్రసంగాన్ని గుర్తుకు తెస్తున్నాయి. పీవీ చెప్పినట్టు తెలంగాణలో రైతు బహుముఖ అభివృద్ధికి బాటలు పడ్డాయి. కాళేశ్వరం మొదలైన ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణతో నీటిపారుదల విస్తరించింది. బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. విస్తరణ సేవలను పటిష్ఠం చేయడం, ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడమూ జరుగుతున్నది. వ్యవసాయం పండుగగా మారింది. ఎగుమతులు భారీగా సాగించే దిశగా అడుగులు పడుతున్నాయి.

జాతీయ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తేవాలనేది మా ప్రయత్నం. ఈ సమస్య ఎంత పెద్దదీ అంటే, ఏ ఒక్క పార్టీ దీనిని పరిష్కరించలేదు. పరస్పర విమర్శలు మానుకుందాం. సమస్య పరిష్కారానికి ఉద్యుక్తులం అవుదాం. మనం ఇదే స్ఫూర్తితో కృషి చేయాలి

(1991 సెప్టెంబర్‌ 21న జైన మహాసభలో పీవీ ప్రసంగం )

ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తరువాత అభివృద్ధి కోసం సమష్టి కృషి చేయాలని కేసీఆర్‌ అంటూ ఉంటారు. శాసనసభా చర్చలు కూడా అర్థవంతంగా ఉండాలని, రాష్ర్టాభివృద్ధి విషయంలో వివాదాలు వద్దని అంటారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఇదే వైఖరి. పార్టీలుగా విభేదాలున్నా, కేంద్ర రాష్ర్టాల మధ్య సమన్వయం, సత్సంబంధాలు ఉండాలని అంటారు. జాతీయ స్థాయి రాజకీయ రంగంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్‌ సాగించిన కృషి గమనార్హమైనది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేర నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. దేశ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపే ప్రణాళికను రూపొందించి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు.

మత రాజకీయం కాదు, సమస్యల పరిష్కారం
మతోన్మాదం అనేది అత్యంత ప్రమాదకారియైన వైరస్‌. ఇది విద్వేషాలను పెంచుతుంది. దేశ శక్తిని, వనరులను ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగించ వలసి రావడం దురదృష్టకరం. దేశ ఆర్థికాభివృద్ధికి, పేదల శ్రేయస్సు కోసం పాటుపడటం తక్షణావసరం. దేశం అసాధారణ స్థాయిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభాన్ని అధిగమించడమే కాకుండా, అంతర్జాతీయ సమాజంలో దేశాన్ని దృఢమైనదిగా నిలబెట్టే విధానాలను చేపట్టాం. విద్యావ్యాప్తి, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, అందరికి ఆహారం, గృహవసతి కల్పించడం, ఆదాయాలను, ఉపాధి అవకాశాలను పెంచడం మొదలైనవి ఎన్నో సాధించవలసి ఉంది. ఈ లక్ష్యాలు సాధించాలంటే, సమాజం ప్రశాంతంగా ఉండాలి. ప్రజల మధ్య సహకార స్ఫూర్తి నెలకొనాలి.

(1991 నవంబర్‌ 2న ఢిల్లీలో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పీవీ ప్రసంగం నుంచి.. )

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనా విధానం కూడా కచ్చితంగా ఇదేవిధమైనది. మత వివాదాలు పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలంటారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, అందరికి పోషకాహారం, గృహవసతి, ఉపాధి అవకాశాల వంటి ఆశయాలను నెరవేర్చడానికి మన శక్తియుక్తులను ఉపయోగించాలని ఆయన కాంక్షిస్తారు. ఈ లక్ష్యాలు సాధించాలంటే మత రాజకీయాలు ఉండకూడదని, సమాజం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.