Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పోరు ఏకపక్షమే!

-నిజామాబాద్‌లో సీఎం సభ సక్సెస్‌తో ఊపుమీదున్న టీఆర్‌ఎస్
-మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి చేరికతో పెరిగిన బలం
-కొనసాగుతున్న చేరికల జోరు
-కామారెడ్డి జిల్లాలో దూసుకుపోతున్న మంత్రి పోచారం
-ఇంకా అభ్యర్థుల వేటలో ప్రతిపక్షాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నెల 3న నిజామాబాద్ నగరంలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి.. ఇందూరువాసులు తమ ఉద్యమ చైతన్యాన్ని చాటుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు కొనసాగుతున్నది. అన్ని కులసంఘాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మీ వెంటే మేమంతా అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. పల్లె పల్లెనా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు మనసారా దీవిస్తున్నారు. దీంతో అన్నిచోట్లా ఏకపక్ష విజయ వాతావరణం ఏర్పడింది.

కలియదిరుగుతున్న అభ్యర్థులు
బాల్కొండ నియోజకవర్గంలో అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచారం జోరందుకున్నది. నియోజకవర్గంలోని కార్యకర్తలంతా ఆయన గెలుపు కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డి 36 వేల ఓట్ల మెజారిటీతో జిల్లాలో రికార్డు సృష్టించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అభ్యర్థి జీవన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బలమైన క్యాడర్, కార్యకర్తలను కలిగిఉన్న మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఈ రెండు నియెజకవర్గాలకు లాభం చేకూర్చుతున్నది. ముఖ్యంగా ఆర్మూర్‌లో సురేశ్‌రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 50 వేల ఓట్లు సాధించారు. ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు జీవన్‌రెడ్డికి సానుకూలాంశం కానున్నది. నిజామాబాద్ ఎంపీ కవిత సైతం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకేనని చెప్తున్నారు.

బాన్సువాడ నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కులసంఘాలు, సబ్బండవర్ణాలు ఆయనకు సంఘీభావంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పోచారంను లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించడం మరింత కలిసి వస్తున్నది. కామారెడ్డిలో గంప గోవర్దన్ ప్రచారం జోరుగా సాగుతున్నది. అన్ని వర్గాల వారు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు వివరిస్తున్నారు. జుక్కల్‌లో హన్మంత్ షిండే తన ప్రచార వేగాన్ని పెంచారు. ఈసారి కూడా గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద, బలహీన వర్గాలతోపాటు అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని విడమరిచి చెప్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్దన్ బలమైన నాయకుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటివరకు అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఇబ్బందికర వాతావరణం తొలిగిపోయింది. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఏకతాటిపైవచ్చి బాజిరెడ్డి గెలుపునకు కృషి చేస్తున్నాయి. బోధన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

కూటమిలో తేలని పొత్తులు
జిల్లాలో కూటమి పొత్తులు, లెక్కలు ఇంకా తేలడం లేదు. అసమ్మతి చెలరేగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, నరాల రత్నాకర్, కేశవేణు తదితరులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా, బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా, ఆయనకు ప్రచారంలో నిలదీతలు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత అమర్‌నాథ్‌బాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ నుంచి టీడీపీ కోటాలో ఏలేటి అన్నపూర్ణమ్మకు టికెట్ వస్తుందనే ప్రచారం ఊపందుకున్నది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం రాజారాం యాదవ్, ఆకుల లలిత ప్రయత్నాలు చేస్తున్నారు. రూరల్‌లో భూపతిరెడ్డి తనకే టికెట్ కన్ఫమ్ అంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సురేశ్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడటంతో పెద్ద ఎత్తున క్యాడర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ టికెట్ ఆశిస్తున్నారు. బాన్సువాడ నుంచి మల్యాద్రి రెడ్డి, కాసుల బాలరాజు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున షబ్బీర్ అలీ ప్రచారాన్ని ప్రారంభించారు. కూటమిలో భాగంగా టీడీపీకి అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులే బరిలోకి దిగనున్నారు. బీజేపీ నుంచి వెంకటరమణరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి నల్లమడుగు సురేందర్, సుభాష్‌రెడ్డి టికెట్ ఆశిస్తూ పోటీలో ఉన్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్ నుంచి అరుణతార, సౌదాగర్ గంగారాం టికెటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్కోస్థానం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉండటంతో సీట్ల కేటాయింపు తర్వాత అసమ్మతి రాగాలు తప్పవని తెలుస్తున్నది.

బీజేపీలో అయోమయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పరిస్థితి ఘోరంగా ఉన్నది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇతర పార్టీల పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ అసంతృప్తులకు పార్టీలో అవకాశమివ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అర్బన్ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ధన్‌పాల్ సూర్యనారాయణ, బస్వ లక్ష్మీనారాయణ ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రూరల్ నుంచి కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బోధన్ నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, ఆర్మూర్ నుంచి వినయ్‌రెడ్డి, బాల్కొండ నుంచి సునీల్‌రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ..
-బాల్కొండ నియోజకవర్గం : 36,248 ఓట్లు
-జుక్కల్ నియోజకవర్గం: 35,507 ఓట్లు
-నిజామాబాద్ రూరల్: 26,547 ఓట్లు
-ఎల్లారెడ్డి నియోజకవర్గం: 24,009 ఓట్లు
-బాన్సువాడ నియోజకవర్గం: 23,930 ఓట్లు
-బోధన్ నియోజకవర్గం : 15,808 ఓట్లు
-ఆర్మూర్ నియోజకవర్గం : 13,961 ఓట్లు
-నిజామాబాద్ అర్బన్: 10,308 ఓట్లు
-కామారెడ్డి నియోజకవర్గం: 8,683 ఓట్లు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.