హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధులమై పని చేద్దామని గ్రేటర్ ఎన్నికల విజయ సారథి, రాష్ట్ర పంచాయతీ, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. నయాపైసా లంచం లేకుండా జీహెచ్ఎంసీలో ప్రజలకు పనులు జరిగినపుడే ఇంతటి భారీ విజయాన్ని అందించిన గ్రేటర్ ప్రజలకు న్యాయం చేసినవారమవుతామని టీఆర్ఎస్ కార్పొరేటర్లనుద్దేశించి ఆయన అన్నారు. గురువారం జీహెచ్ఎంసీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ముందు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ ప్రజలు పూర్తి విశ్వాసంతో టీఆర్ఎస్కు అనూహ్య విజయాన్ని అందించారని, వారి ఆశలు నెరవేర్చేలా పని చేసి మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. -హైదరాబాద్ను విశ్వనగరంగా మారుద్దాం -సకాలంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి -కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ -జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం
స్వచ్ఛ హైదరాబాద్, సామాన్యుడి కల డబుల్బెడ్ రూమ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందాలన్నారు. ప్రజల సమస్యలు, పనులను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చి సకాలంలో పరిష్కరించడంలో కార్పొరేటర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జీ జగదీశ్రెడ్డి , టీ పద్మారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, పట్నం మహేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డీ శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కనకారెడ్డి, సాయన్న, కేఎం వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, వీ శ్రీనివాస్గౌడ్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శంభీపూర్ రాజు, విద్యాసాగర్, పాతూరి సుధాకర్రెడ్డి, యాదవరెడ్డి, ప్రభాకర్, పురాణం సతీశ్ కుమార్, పార్టీ నాయకులు పుటం పురుషోత్తం రావు, సీఎం రాజకీయ సలహాదారు శేరి సుభాష్రెడ్డి, గ్రేటర్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా తెలంగాణ భవన్.. తెలంగాణ నినాదాలు, పటాకుల మోతలతో తెలంగాణ భవన్ గురువారం కోలాహలంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ అల్పాహార విందు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు నాయకులు తరలిరావటంతో తెలంగాణ భవన్ గులాబీవనంగా మారింది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సమావేశం అనంతరం కార్పొరేటర్లు నాలుగు బస్సుల్లో బయలుదేరి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళారు.

