– ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు గీటురాయని చాటండి: మంత్రి కేటీఆర్ -దయాకర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: డిప్యూటీ సీఎం కడియం -ఇది జవాబుదారీ సర్కారు: మంత్రి ఈటల -మ్యానిఫెస్టోపై ప్రతిపక్షాలు బహిరంగచర్చకు సిద్ధమా?: మంత్రి జగదీశ్రెడ్డి -ఆరు నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సభల హోరు -ఆనందోత్సాహాల్లో గులాబీ శ్రేణులు -వరంగల్ ఎన్నికల శంఖారావంలో కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపు -సొమ్ము మనదే.. అభివృద్ధీ మనదే: మంత్రి ఈటల -ప్రతిపక్షాలకు ఓటేస్తే ద్రోహులకు వేసినట్టే: మంత్రి జగదీశ్రెడ్డి
తెలంగాణ చరిత్రలో ఎన్నికలంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే ఎన్నికల ఫలితాలుగా చరిత్ర సృష్టించిన ఆ పార్టీ ఆదివారం వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారానికి శంఖారావం పూరించింది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు ఆధ్యంతం ఆనందోత్సాహాల మధ్య, పండుగ వాతావరణంలో కొనసాగాయి. పార్టీ అభ్యర్థి ప్రకటనతోనే ప్రతిపక్షాలకు డిపాజిట్ గల్లంతని తేలిపోయిందని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైనదని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సారథులు స్పష్టంచేశారు.
బంగారు తెలంగాణ సాధన కోసం అధికారంలోకి వచ్చిన 16 నెలలుగా అహర్నిశలు కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలను పాతాళంలోకి తొక్కాలని, ఈ ఉప ఎన్నిక తీర్పే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా భావించి శ్రేణులంతా ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక సమన్వయకర్తలుగా ఉన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ వినోద్మార్ సహా ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం మినహా పాలకుర్తి, వర్ధన్నపేట, స్టేషన్ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లిల్లో ఒకే రోజు టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలు టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయోత్సవ సభలను తలపించాయి. టీఆర్ఎస్ గెలుపు ఖాయం.. మెజారిటీపై దృష్టిపెట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తామని ప్రతిన బూనారు.
గతం కంటే మెజారిటీ ఎక్కువే రావాలి: మంత్రి కేటీఆర్ వరంగల్ లోక్సభ ఎన్నిక సీఎం కేసీఆర్ పనితీరుకు గీటురాయిగా మారనున్నదని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హన్మకొండ ఎన్జీవోస్కాలనీలోని శ్యామల గార్డెన్లో జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఎమ్యెల్యే దాస్యం వినయ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. సభలో కేటీఆర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా ప్రతిపక్షాలు మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలతోపాటు మూడేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని, ఇవ్వకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రానని సవాల్ చేసిన దేశంలోని ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభు త్వం 60 నెలల్లో చేసి చూపిస్తుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతిపక్షాలకు గుండె జల్లు మనేలా సమాధానం ఇవ్వాలన్నారు. త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు ఈ ఎన్నికను నాందిగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం జిల్లాలోని మురికివాడల్లో తిరుగలేదని, అలాంటిది కేసీఆర్ మూడు రోజులు వరంగల్లో మకాం వేసి పేద ప్రజల ఇండ్లలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేశారని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, కొండా సురేఖ, రెడ్యానాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, అర్బన్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
పాలకుర్తిలో లక్ష మెజారిటీ రావాలి: డిప్యూటీ సీఎం కడియం ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను పాతాళంలోకి తొక్కాల్సిన సమయం ఆసన్నమైనదని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పాలకుర్తిలో నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్రావు అధ్యక్షతన జరిగిన సభలో కడియం మాట్లాడారు. దళిత నిరుపేద బిడ్డ, ఉద్యమకారుడు పసునూరి దయాకర్కు ఈ నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 16నెలల పాలనలో సీఎం కేసీఆర్ అభివృద్ధికి పాటుపడుతుంటే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సిగ్గు చేటన్నారు. ప్రతి పక్షాలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడే అర్హత కేంద్రంలోని బీజేపీకి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రాఫ్ ఇన్సూరెన్సూపై కేంద్రానికి నివేదిక పంపిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పత్తికి మద్దతు ధర ఇప్పించలేని ఎన్డీయే నాయకులు చిల్లర రాజకీయాల కోసం మార్కెట్ల చుట్టూ తిరగడం సిగ్గు చేటన్నారు. రైతులే బీజేపీ, టీడీపీ నేతలను తరిమి కొడుతున్నారన్నారు.
మ్యానిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమా: మంత్రి జగదీశ్రెడ్డి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. పాలకుర్తిలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఆంధ్రాలో కలుపుతామన్న పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లని, టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే ద్రోహులకు వేసినట్లు అవుతుందన్నారు.
కాంగ్రెస్వి పరేషాన్ యాత్రలు: మంత్రి పోచారం
అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టనష్టాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతు భరోసా పేరుతో యాత్రలు చేస్తుండడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో వాళ్లు పరేషాన్ యాత్రలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. భూపాలపల్లిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎంతో వివక్షకు గురైందన్నారు. అప్పుడు వారు చేసిన పాపాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కడుగుతున్నదని చెప్పారు. వాటర్గ్రిడ్, డబుల్బెడ్రూం, మిషన్కాకతీయ, విద్యుత్ ఉత్పత్తి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోటా పెంపు, ఇండస్ట్రీల ఏర్పాటు, ఐటీ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, హరితహారం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలాంటి పథకాలతో దేశం తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఓటెయ్యకుంటే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామనడం వారి బానిసత్వానికి నిదర్శనమన్నారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: మంత్రి జోగు రామన్న
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పసు నూరి దయాకర్ను గెలిపిస్తాయని అటవీశాఖ మంత్రి జోగు రామ న్న పేర్కొన్నారు. వర్ధన్నపేటలోని లక్ష్మీఫంక్షన్హాలులో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీగా పోటీచేసిన కడియం శ్రీహరికి లక్షా ఒకవేయి ఓట్ల మెజార్టీ ఇచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈనెల 21న జరుగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గత మెజార్టీని ఏమాత్రం తగ్గనివ్వమన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నియోజకవర్గంలో రూ.773 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు.
శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలంగాణ సాధించుకున్న 16 నెలల కాలంలో ప్రజలు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్లోని మాగార్డెన్లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన సభకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ అధిక మెజారిటీతో గెలిచేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమంలో కడుపుకట్టుకుని పనిచేశారని, వారికి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయన్నారు.
హామీలను అమలు చేస్తున్నాం: మంత్రి ఈటల ప్రభుత్వం జవాబుదారీ తనంతో అవినీతి, పక్షపాత రహితంగా పనిచేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, మ్యానిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాడు సొమ్ము తెలంగాణది.. సోకు ఆంధ్రా పార్టీలదిగా వర్ధిల్లితే.. నేడు మన సొమ్మును మనమే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నామన్నారు. బొగ్గు మనది, నీరు మనది, కరెంటు మాదే అని చెప్పిన కేసీఆర్ నేడు నిరూపించి చూపిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజారిటీతో గెలిపించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీ బీ వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రజా బలంలేని ప్రతిపక్షాలు వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలను విస్మరించి.. నాయకులు ఏకం కావాలంటూ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఉద్యమ కాలంలో కనీసం తెలంగాణ కోసం నోరుమెదపని ఈ నేతలు, ఎన్నికల కోసం ఐక్యతారాగాన్ని ఆలపించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

