-చిరస్థాయిగా నిలిచిపోనున్న కొంగరకలాన్ సభ -ప్రజాసంక్షేమానికి ఇప్పటివరకు ఏం చేశాం -తెలంగాణ భవిష్యత్తు కోసం ఏం చేస్తాం -ప్రజలకు వివరించనున్న సీఎం కే చంద్రశేఖర్రావు -పలు అంశాలపై సంచలనాత్మక ప్రకటనలు! -ఎన్నికలు ఎప్పుడో స్పష్టతనిచ్చే అవకాశం -సభకు ముందే మంత్రివర్గ కీలక భేటీ -ఉద్యోగులకు ఐఆర్, డ్వాక్రా మహిళలకు రుణాలతోపాటు.. -మరికొన్ని కీలక అంశాలపైనా చర్చ! -నిర్ణయాలను ప్రజలకు వివరించనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ గడ్డ మరోసారి చరిత్రపుటల్లోకి ఎక్కేందుకు సిద్ధమవుతున్నది. దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి ఆదివారం హైదరాబాద్ మహానగరం సాక్షిగా నిలువనున్నది. కొంగర కలాన్- రావిర్యాల వద్ద నిర్వహించే చారిత్రాత్మక సభ.. మరో చారిత్రక ఘట్టానికి నాంది పలుకబోతున్నది. దేశంలో భారీ జనసమీకరణతో సభలు నిర్వహించడంలో టీఆర్ఎస్కు సాటిలేదనే పేరుంది. ఆదివారం నాటి కొంగర కలాన్- రావిర్యాల సభతో ఇది మరోసారి నిరూపితం కానున్నది. ఉద్యమ సమయంలో వరంగల్లో ఏర్పాటుచేసిన సభ ప్రపంచంలోనే అతిపెద్ద సభల్లో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును తిరుగరాసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సుమారు 1600 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సభద్వారా తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంతోపాటు దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ప్రగతి నివేదన సభ వైపు చూస్తున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత బలమైన ప్రాంతీయపార్టీల్లో ఒకటిగా ఉన్న టీఆర్ఎస్.. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలురైన రాజకీయనాయకుడిగా గుర్తింపు ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభ వేదిక నుంచి చేయబోయే ప్రసంగం అత్యంత కీలకం కాబోతున్నది. తెలంగాణ భవిష్యత్తు చిత్రపటాన్ని కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
నాటి స్వప్నం.. నేటి వాస్తవం.. రేపటి భవిష్యత్తు.. బక్కపల్చని వ్యక్తి.. తెలంగాణ స్వాప్నికుడు. ఒక్కడిగా మొదలై సముద్రంలా మారి ఢిల్లీని ఒప్పించి తెలంగాణను సాధించిన అనితరసాధ్యుడు కేసీఆర్. ఆనాడు 2001లో తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు.. 2014లో రాష్ట్ర అవతరణ వరకు నిరంతర పోరాటాలతో, ఉద్యమాలతోనే సహజీవనం చేశారు. 2014 జూన్ 2కు పూర్వం ఉన్న పరిస్థితులను, సమైక్యపాలనలో తెలంగాణ ఎదుర్కొన్న కష్టనష్టాలు, ఇక్కడి ప్రజలు అనుభవించిన దుఃఖం గురించి, రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం, రాష్ట్రం ఆవిర్భవించేనాటికి ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు ముఖ్యమంత్రి మరోసారి గుర్తుచేయనున్నారు.
భవిష్యత్తు ఆవిష్కరణ ఆదివారం నాటి సభలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. తమ 51 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించడంతోపాటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రకటనను ముఖ్యమంత్రి చేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో సంపద సృష్టి.. సృష్టించిన సంపదను పేదలకు పంపిణీ చేస్తున్న తీరు.. సంక్షేమ కార్యక్రమాల అంతిమ లక్ష్యం ఏమిటన్నది వివరించనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయరంగ సంస్కరణల ఫలితాలను విశదీకరిస్తారు.
ఎన్నికలపై స్పష్టత ఇవ్వనున్న కేసీఆర్! రాబోయే ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభ నుంచి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధంగానే ఉంటుందని గతకొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు టీఆర్ఎస్ నేతలు చెప్తున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి సవివరంగా మాట్లాడుతారని సమాచారం.
నేడు మంత్రివర్గ సమావేశం.. ఆ తర్వాత సభకు రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో జరుగనున్నది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై నివేదికను సమర్పించాలంటూ ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలకు, మంత్రులకు లేఖలు రాసింది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు నివేదికలను పంపించారు. వాటి ఆధారంగా కొన్ని కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకోనున్నది. ఈ నిర్ణయాలను ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని తెలుస్తున్నది.

