-పేదలను సంతృప్తిపర్చే మ్యానిఫెస్టో రాబోతున్నది.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ -కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్వి ఉత్తుత్తి హామీలే -వారి ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మరు -ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా చంద్రబాబు వ్యవహారశైలి -అభివృద్ధిని అడ్డుకుంటూ పొత్తులతో కొత్త కుట్ర -సమైక్యపాలనలో ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా సిరిసిల్ల -టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నిలయంగా మార్చాం -గత ప్రభుత్వంలో పరిశ్రమలకు పవర్ హాలిడే -ఇప్పుడు 24 గంటల కరంటు ఇస్తున్న ఘనత కేసీఆర్దే -ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు -4 లక్షల బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం -సిరిసిల్లలో టీఆర్ఎస్లోకి చేరికల సందర్భంగా కేటీఆర్ -కేటీఆర్కు మద్దతు ప్రకటించిన స్థానిక నాయీబ్రాహ్మణులు
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని, టీఆర్ఎస్సే మళ్లీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ ఉతుత్తి హామీలు, కాంగ్రెస్ ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో పాతరేసేందుకు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను ఓడించే సత్తాలేని పార్టీలన్నీ ఒక్కటైనా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని అందరూ చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు.. పొత్తులు పెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
నాడు పవర్ హాలిడేలు.. నేడు నిరంతర విద్యుత్ గతంలో దేశంలో, రాష్ట్రంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దొంగోలె వచ్చే కరంటుకోసం రైతులు, పరిశ్రమలలో కార్మికులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్హాలిడే ఇస్తే చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు ధర్నాచేసిన రోజులను ఆయన గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడమేకాకుండా.. పరిశ్రమలకు నాణ్యమైన కరంటు ఇచ్చి పెద్దపీట వేశామన్నారు.
టీఎస్ఐపాస్తో వేల కోట్ల పెట్టుబడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దేశ ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఉపాధి కల్పనేనని మంత్రి కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంకోసం టీఎస్ఐపాస్ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మన ప్రభుత్వానిదేనని చెప్పారు. అగ్రవర్ణాలలో కూడా పేదలున్నారని, అటువంటివారికి చేయూతనివ్వాలని అన్నారు. సీఎం కేసీఆర్ అందరికీ కన్నతండ్రిలాగా వ్యవహరిస్తూ, సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.
నేతన్నల బతుకులు మార్చాం సమైక్య పాలకులు నిర్లక్ష్యంతో వ్యవహరించి, సిరిసిల్లను ఆత్మహత్యలు, ఆకలిచావులకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉరిసిల్లగా మారిన సిరిశాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారని చెప్పారు. ప్రతి కార్మికుడికీ నెలకు రూ.20 వేలకు పైగా వేతనం వచ్చేలా బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యామిషన్, రంజాన్, క్రిస్మస్ దుస్తుల తయారీ ఆర్డర్ను సిరిసిల్లకే ఇచ్చామని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో ఉరిసిల్ల నుంచి సిరిసంపదలకు నిలయంగా అభివృద్ధి జరిగిందని అన్నారు.
సిరిసిల్లను నంబర్వన్ నియోజకవర్గం చేస్తా తనను ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే అందరినీ సంతృప్తిపరిచేలా, పదిరెట్ల అభివృద్ధితో సిరిసిల్లను రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు. మూడేండ్లలో కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ పనులు పూర్తిచేసి, సిరిసిల్ల ప్రజలకు రైలుకూత వినిపిస్తానని చెప్పారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల మీదుగా కరీంనగర్, ఇతర ప్రాంతాలకు రైళ్లు ఈ మార్గం గుండా వెళ్తాయన్నారు. సిరిసిల్ల ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా రూపొందిస్తున్న కొత్త చెరువు మినీ ట్యాంకుబండ్ దీపావళికి అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది నాలుగు లక్షలమంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మనదేనని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. అనారోగ్యాలకు గురవుతున్న బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సిరిసిల్లలో అపారెల్పార్కు నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయని, అందులో పదివేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘం, మహిళావిభాగం, యువజనసంఘాల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి నాయీబ్రాహ్మణుల విరాళం రూ.11,011 కేటీఆర్ ఎన్నికల ఖర్చులకోసం తమ ఒకరోజు వేతనం మొత్తం రూ.11,011లను స్థానిక నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు విరాళంగా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పావని, సెస్ వైస్చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


