-86శాతం ప్రజల మనోగతమిదే -దేశంలోనే అత్యధిక ప్రజాదరణగల ముఖ్యమంత్రి -రెండో స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ -మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమత -ఐదోస్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు -వీడీపీ అసోసియేట్స్ సర్వేలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రం మరోమారు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు అత్యధిక స్థాయిలో జనామోదం లభిస్తున్నదని తేటతెల్లమయ్యింది. దేశంలోని వివిధ రాష్ర్టాల సీఎంల పనితీరుపై వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం బయటపడింది. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 70 స్థానాలు వస్తాయని వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇదే సంస్థ ఇప్పుడు నిర్వహించిన సర్వేలో అన్ని రాష్ర్టాల సీఎంల కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అగ్రస్థానంలో ఉన్నారని తేలింది. ఆయనకు 86శాతం జనామోదం ఉన్నదని సర్వేలో వెల్లడయ్యింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నిలిచారు. ఆయనకు రాష్ట్రంలో 81శాతం మంది మద్దతు ఉన్నదని సర్వేలో తేలింది.75శాతం జనామోదంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మూడో స్థానం సాధించారు. కొత్త రాష్ర్టానికి నూతన రాజధాని నిర్మించే పనిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో ఉన్నారు.

