-తగ్గిన బాల్యవివాహాలు.. ఆడపిల్లల్లో పెరిగిన భరోసా -అమ్మాయిల చదువుల్లో వృద్ధి.. -సీఎం కేసీఆర్ పెండ్లి కానుకతో బహుళ ప్రయోజనాలు
స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల కష్టాలను తొలిగించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కేవలం పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా రాష్ట్రంలో బాల్యవివాహాల జాడ్యాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. అంతేకాదు, పెండ్లి వయసు వచ్చేంతవరకు బిడ్డలకు చదువుచెప్పించాలనే ఆలోచనకు ఈ పథకం నాంది పలికింది. 2014లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా, బాలికల విద్య 32 శాతం పెరిగింది.
అమ్మకు భరోసా ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించే వయస్సు నుంచి ఉన్నత చదువులు చదువుకొనేవరకు ప్రభుత్వం నుంచి భరోసా లభించడంతో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం మొదలైంది. అమ్మాయి పుడితే కేసీఆర్కిట్తో రూ.13 వేల ఆర్థికసాయం, అంగన్వాడీ కేంద్రాల నుంచి నాణ్యమైన ఆహారం, తల్లీబిడ్డకు సాయం వంటి కార్యక్రమాలతో నవజాత శిశువుల స్థాయి నుంచే బాలికల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పెండ్లీడుకొచ్చిన తర్వాత ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడపిల్లలకు వరంగా మారింది. 2012-13లో తెలంగాణ ప్రాంతంలోనమోదైన బాల్య వివాహాలు 3,268. అత్యధికంగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో సగటున 400 బాల్య వివాహాలు నమోదయ్యాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో వీటన్నింటికీ బ్రేక్ పడింది. పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి కోసం రూ.1,00,116లను రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా చేతుల్లో పెడుతున్నది. ఆడబిడ్డ తల్లికి ఈ చెక్కును అందిస్తున్నది. మొదట్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన ఈ పథకం ఇప్పుడు అన్ని వర్గాలను ఆదుకుంటున్నది. ఈ పథకంలో చేర్చిన నిబంధనలతో రాష్ట్రంలో బాల్య వివాహాలను నిరోధించి, బాలికలను బడి, కాలేజీల వైపు అడుగులు వేయిస్తున్నాయి.
మార్పునకు శ్రీకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అర్హత కోసం 18 ఏండ్లు నిండిన వారిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. వారి ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలతో వయస్సును ధ్రువీకరిస్తున్నారు. 18 ఏండ్ల కంటే ఒక్క నెల తక్కువగా ఉన్నా, వారికి ఈ పథకం వర్తించదు. రాష్ట్రంలో 2014-15 లో అధికారుల దృష్టికి వచ్చి ఆగిపోయిన బాల్య వివాహాలు 359 మాత్రమే. 2015-16లో 1,102 బాల్య వివాహాలను అడ్డుకుని కౌన్సెలింగ్ చేశారు. 2016-17లో 728 నమోదుకాగా, 2017-18లో 662 బాల్య వివాహాలను నిలిపివేశారు. 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి బాల్య వివాహాల సంఖ్య 457కు పడిపోయింది. రాష్ట్రంలో ఈ నెల మొదటి వరకు 4,28,855 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీచేశారు. మొత్తం రూ.2,763.99 కోట్లను ఆడబిడ్డలకు సర్కారు కట్నంగా ఇచ్చారు.
విద్య పెరిగింది.. వివాహాలు తగ్గాయి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులు సిద్దిపేట జిల్లాలో ఓ సర్వే నిర్వహించి రిపోర్టును రూపొందించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో బాల్య వివాహాలు తగ్గినట్లు తేల్చారు. 2011 నుంచి 2014 వరకు 56 శాతం బాల్య వివాహాలు నమోదు కాగా.. 2014 నుంచి 2017 వరకు 23.61 శాతం జరిగినట్లు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 2011 నుంచి 2014 వరకు 38.09 శాతం వివాహాలు జరుగగా.. 2014 నుంచి 2017 వరకు కేవలం 18.44 శాతం బాల్య వివాహాలు జరిగాయి. ఇదే సమయంలో సర్కారుతోపాటు ప్రైవేటు కళాశాలల్లో బాలికల విద్య పెరిగినట్లు తేలింది. పెండ్లీడు వచ్చేదాక వివాహం చేయరాదనే లక్ష్యంతో ఉన్న ఆడబిడ్డల తల్లిదండ్రులు వారిని బడికి, కాలేజీలకు పంపిస్తున్నారు. బాగా చదువుకునేవారిని ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సహిస్తున్నారు. 2016 నుంచి విద్యనభ్యసించే ఆడబిడ్డలు 32 శాతం పెరిగినట్లు తేలింది. అంతేకాకుండా.. ఆడబిడ్డలను కూలి పనులకు పంపించే శాతం కూడా తగ్గింది. కేవలం ఒకే ఒక పథకం కల్యాణలక్ష్మి.. సామాజిక రుగ్మతగా ఉన్న బాల్యవివాహం అనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

