-గ్రాంటు రూపంలో నిధులు కేటాయించండి -ప్రధాని నరేంద్రమోదీని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ -పదహారు అంశాలపై ప్రధానికి సీఎం వినతులు -రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ను అభినందించిన ప్రధాని -ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలుv -నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్పోలో గ్రౌండ్ను అప్పగించాలి. -రోడ్ల వెడల్పుకోసం హైదరాబాద్లోని రక్షణశాఖ భూములను ఇవ్వాలి. -కరీంనగర్లో ఐఐఐటీ, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుచేయాలి. -రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలి. -హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుచేయాలి. -ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ హైవే అథారిటీ సంయుక్తంగా సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలి. -జహీరాబాద్ నిమ్జ్కు నిధులను విడుదలచేయాలి. -కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్కు రూ.వెయ్యి కోట్ల సాయమందించాలి. -కృష్ణా నదీజలాల పంపిణీపై తెలంగాణ పిటిషన్లను కృష్ణా నది నీటి వివాదాల ట్రిబ్యునల్కు కేంద్రం నివేదించాలి. -9, 10 షెడ్యూల్ సంస్థల విభజన సమస్యలను పరిష్కరించాలి. -రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలి. -ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలి. -వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలి. -రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్గా ఇచ్చే రూ.450 కోట్లను విడుదలచేయాలి. -ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నిధులను విడుదల చేయాలి, పెండింగ్ అనుమతులు మంజూరుచేయాలి.
తెలంగాణ సమాజానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. తెలంగాణలో పలు కేంద్ర విద్యాసంస్థలను ఏర్పాటుచేయాలని, విభజనచట్టం ప్రకారం 9,10 షెడ్యూలులోని సంస్థల విభజన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో రైల్వేప్రాజెక్టులను పూర్తిచేయాలని, నూతన సచివాలయ నిర్మాణానికి బైసన్పోలో మైదానాన్ని కేటాయించాలని, రహదారుల వెడల్పుకోసం రక్షణశాఖ భూములను కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఢిల్లీలోని లోక్కల్యాణ్మార్గ్ 7లో ప్రధానమంత్రి నివాసంలో మోదీని సీఎం కేసీఆర్ కలిశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్.. ప్రధానిని కలువడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ను ప్రధాని మోదీ అభినందించారు. అరగంటకుపైగా సాగిన భేటీలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. రాష్ర్టానికి సంబంధించిన 16 అంశాలపై వినతిపత్రం అందించారు. తెలంగాణకు గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, రాష్ట్ర ప్రజల అవసరాలను వాటిలో పొందుపర్చారు. వీటిని మంజూరుచేయడంద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, ఐఐఎస్ఈఆర్లను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. కృష్ణానది జలాల పంపిణీపై తెలంగాణ పిటిషన్లను కృష్ణానది నీటి వివాదాల ట్రిబ్యునల్కు నివేదించాలని కేంద్రాన్ని కోరారు.
రాజ్నాథ్సింగ్తో సీఎం కేసీఆర్ భేటీ
రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన త్వరగా పూర్తిఅయ్యే విధంగా చూడాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రితో సీఎం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన కేసీఆర్ను రాజ్నాథ్సింగ్ అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఉన్నారు.

నేడు పలువురు ప్రముఖులతో భేటీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీలో పర్యటనలో భాగంగా గురువారం పలువురు ప్రముఖులతో భేటీకానున్నారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులతో సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా వారితో చర్చిస్తారు. వీరితోపాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.

