-111 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జైత్రయాత్ర -తొమ్మిది కార్పొరేషన్లలో విజయదుందుభి -చతికిలబడ్డ హస్తం.. వాడిపోయిన కమలం -ప్రభావం చూపని వామపక్షాలు, స్వతంత్రులు -మున్సిపల్ ఎన్నికల్లో ఇక తుది ఘట్టం -రేపు మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక -డిప్యూటీ మేయర్లు, వైస్చైర్మన్లకు కూడా..
మునుపెన్నడూ చూడని మహా విజయం! మరోసారి చూస్తామో లేదో తెలియని అద్భుత ఫలితం! ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా! ఆ పార్టీపై రాష్ట్రంలోని పట్టణ ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసం! ఇది టీఆర్ఎస్ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ తిరుగులేని మార్గదర్శకత్వం అందించిన గెలుపు! యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆచరణాత్మక ప్రణాళిక.. దానికి అనుగుణంగా కదంతొక్కిన లక్షలమంది గులాబీ సైనికుల సమిష్టి కృషి.. క్షేత్రస్థాయిలో వారికి నాయకత్వం వహించిన మంత్రు లు, కీలకనేతల సమన్వయానికి లభించిన అపురూప విజయం! మొన్నటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో పల్లెలన్నీ గులాబీతోటలై గుబాళించగా.. నేడు మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు సైతం కారుపై గులాల్ చల్లారు.. గులాబీలతో పట్నాభిషేకం చేశారు! తొమ్మిది నగర పాలక సంస్థలకుగాను ఎనిమిదింటిని క్లీన్స్వీప్ చేసిన టీఆర్ఎస్.. మరోస్థానాన్ని సైతం ఎక్స్అఫీషియో సభ్యులు, ఎంఐఎం మద్దతుతో గెలుచుకునేందుకు సిద్ధంగా ఉన్నది. మరోవైపు 120 మున్సిపాలిటీల్లో ఏకంగా 111 చోట్ల విజయపతాకాన్నెగురవేసి.. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి తానేనని మరోసారి చాటింది! ఎన్నికల వాయిదాకు ఆఖరు నిమిషం వరకు పన్నాగాలు పన్నిన ప్రతిపక్షాలు ఫలితాల సమయానికి చావుదెబ్బతిన్నాయి.
ఐదు ఉమ్మడి జిల్లాల్లో ప్రతిపక్షాలు కనీసం ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేక చతికిలపడ్డాయి. మిగిలిన జిల్లాల్లో ఒకట్రెండు మున్సిపాలిటీలు కనాకష్టంగా గెలుచుకుని ఉనికిచాటుకునేందుకు ప్రయాసపడ్డాయి. చాలాచోట్ల విపక్షాల అభ్యర్థులు ఫలితాల ప్రకటనకు ముందే ఇంటిముఖం పట్టారు. ఇక సీపీఎం, సీపీఐ ఎప్పటిలాగానే దారుణంగా దెబ్బతిన్నాయి. వామపక్షాలకు అంతో ఇంతో ప్రాబ ల్యం ఉండే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈసారి పూర్తిస్థాయిలో పత్తా లేకుండాపోయాయి. స్వతంత్రులుగా బరిలో నిలిచినవారు కూడా అంతగా ప్రభావం చూపలేదు. రాష్ట్రంలో ఇప్పటికే కనుమరుగైన టీడీపీ.. కేవలం 8 వార్డుల్లో గెలిచింది. పుర ఎన్నికల్లో ప్రధాన ప్రక్రియ పూర్తవడంతో ఇక తుదిఘట్టానికి రంగం సిద్ధమైంది. సోమవారం మేయర్లు, చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఏ ఎన్నికలైనా అప్రతిహతంగా దూసుకెళుతున్న టీఆర్ఎస్.. తాజా విజయం స్ఫూర్తితో పట్టణాల దిశ దశ.. రూపురేఖలు మార్చేసేందుకు కంకణం కట్టుకుంటున్నది. వినూత్నమైన పురపాలనకు సవినయంగా సమాయత్తమవుతున్నది. చారిత్రాత్మక సమయాన రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి.. రంగులు సంబురాలు చేసుకోగా.. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు కనీసం కార్యకర్తలు కూడా ముఖం చూపించకపోవడంతో వెలవెలబోయాయి.
కరీంనగర్ ఫలితాలు రేపు కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఇక్కడ మొత్తం 60 డివిజన్లకుగాను ఇప్పటికే రెండింటిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలినవాటిలోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్నది.

